నర్సాపురం ఎంపి రఘు రామ కృష్ణంరాజు ఉదంతం తో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అలెర్ట్ అయినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా సి ఎం జగన్మోహన్ తన చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ హోదాల్లో ఉన్న నాయకుల్లో ఎవరు కోవర్టులు, ఎవరు తన పట్ల నమ్మకం గా ఉన్నారు అని తెలుసుకునే పనిలో ఉన్నట్టు సమాచారం అందింది. ఐదేళ్ళ పాటు అధికారాన్ని అనుభవించి చివరలో పార్టీలు మారే అవకాశం ఉన్న నాయకులు ఎవరు ? అధికారంలో ఉన్నా లేకపోయినా తనను నమ్మి తన వెంట నడిచే నాయకులు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ముద్రతో జగన్మోహన్ రెడ్డిపై అభిమానంతో తన వెంట ఉండే నాయకులు ఎవరు? అనే జాబితా తయారు చేసుకొని అందుకు అనుగుణంగా వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు వైసిపి వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజాగా నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాల ఇన్ చార్జి లు గా ముగ్గురు నాయకులను జగన్మోహన్ రెడ్డిని నియమించారు. ఈ నియామకాల సందర్భంగా వారు ముగ్గురికి కీలకమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
నర్సాపురం ఎం పి రఘురామకృష్ణం రాజు తరహా లోనే తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఒ నాయకుడు ఉన్నట్లు జగన్ వద్ద సమాధానం ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే గుంటూరు, ప్రకాశం జిల్లాలో కొంత మంది నాయకులు, రాయలసీమ లో కొంత మంది నాయకులు పార్టీ లో ఉంటూనే తెలుగుదేశం, బిజెపి పెద్దలలో టచ్ లో ఉన్నట్లు జగన్మోహన్ రెడ్డి వద్ద స్పష్టమైన సమాచారం ఉందట. దీనితో అలెర్ట్ అయిన సీఎం జగన్ వారిని కట్టడి చేస్తూనే, వారికి ప్రత్యామ్నాయంగా కూడా నాయకులను తయారు చేసే పనిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే పార్టీ ఇన్ ఛార్జి లను నియమించారు. గతంలో ఉన్న నాల్గవ వ్యక్తి కాకుండా ఇప్పుడు పార్టీ లో ద్వితీయ స్థానం లో వున్న సజ్జల రామకృష్ణారెడ్డి, వై వి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డిలకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించారు. ఈ ముగ్గురు జగన్మోహన్ రెడ్డి కి అత్యంత ఆప్తులు. ఒకరు సొంత బాబాయి. మరొకరు జగన్ కు సంబంధించి అన్ని వ్యక్తిగత లావాదేవీలు అన్నీ తెలిసిన వ్యక్తి. మరొకరు జగన్ పార్టీ పెట్టినప్పటి నుండి వెన్నంటి ఉన్న వ్యక్తి. ఈ ముగ్గురికి జగన్ అంటే అత్యంత అభిమానం. ఈ ముగ్గురు అన్నా జగన్ కు అత్యంత ఆత్మీయత. అందుకే ఈ ముగ్గురు ద్వారానే జగన్మోహన్ రెడ్డి పార్టీ వ్యవహారాలు నడిపించనున్నారు. సి ఎం హోదాలో ఆయన పరిపాలన పై దృష్టి పెడుతూనే ఈ ముగ్గురి ద్వారా అయా జిల్లాల్లో పార్టీ వ్యవహారాలపై ఒక కన్ను వేయనున్నారు.
మొదటి దశలో కోవర్ట్ లను కనిపెట్టి వాళ్ల ప్రాధాన్యతను తగ్గించి, రెండో దశలో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా మరో పార్టీ నాయకుడు ఎవరైనా ఉంటే తీసుకు వచ్చే వాళ్లకు పార్టీలో కొంత మేరకు ప్రాధాన్యత ఇచ్చి, మూడో దశలో ఎమ్మెల్యేల వ్యక్తిగత ప్రవర్తన పై, ప్రజల్లో ఉన్న పట్టు పై ప్రాథమికంగా ఒక నివేదిక సిద్ధం చేసుకొని రానున్న అరు నెలల కాలంలో వీటిని అమలు చేయనున్నారు. తద్వారా జిల్లాలో నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, నాయకుల పరిస్థితి పై సీ ఏం జగన్ ఒక అంచనాకు వస్తారు. ఈ ముగ్గురి ద్వారా ఈ నివేదికలను తెప్పించుకొని వచ్చే ఏడాది నాటికి అంటే జగన్ సీ ఎం అయిన రెండు సంవత్సరాల తర్వాత పార్టీ పరిస్థితి పై పూర్తి స్థాయిలో చర్చలు జరిపి అప్పటినుంచి రాజకీయ నిర్ణయాల ను మరింత వేగం చేయనున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.