అమరావతి: పికె బృందం చివరి పేమెంట్ కోసం జగన్ని భ్రమలో ఉంచుతోందని దేవినేని అన్నారు. జగన్ అప్పుడే ముఖ్యమంత్రి అన్నట్లు నేమ్ ప్లేట్ తయారు చేయించుకోవటం పిచ్చికి పరాకాష్ట అని దేవినేని ఎద్దేవా చేశారు.
సోమవారం దేవినేని అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ… ఈవీఎంలపై చర్చ నుంచి తప్పించుకునేందుకు ఎన్నికల కమిషన్ కుంటి సాకులు చెబుతోందని మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు ఆరోపించారు.
కేసు ఉందనే కారణంతో హరి ప్రసాద్ను చర్చకు వద్దంటున్నారనీ, ఈవిఎంలను ఏ విధంగా హ్యాక్ చేయొచ్చో చూపినందుకు ఆయనపై కేసు పెట్టారని దేవినేని తెలిపారు.
31 కేసులున్న జగన్,13 కేసులున్న విజయ సాయిరెడ్డి ఫిర్యాదులపై ఈసి స్పందించిందని దేవినేని మండిపడ్డారు.
దేశ రాజధానిలో చంద్రబాబు చేసిన పోరాటం ఇతర పార్టీలను మేల్కొల్పిందని దేవినేని అన్నారు. పోలింగ్ను ఏ విధంగా ఆలస్యం చేయొచ్చో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కమిషన్ చేసి చూపిందని దేవినేని దుయ్యబట్టారు.
ఓటింగ్ శాతం పెరగకుండా నియంత్రించే కుట్ర ఎన్నికల కమిషన్ పన్నిందనీ, కానీ ప్రజలు కసిగా ఓటింగ్లో పాల్గొని గట్టిగా బుద్ది చెప్పారనీ దేవినేని తెలిపారు. టిడిపి సానుభూతి పరులు ఉన్న పోలింగ్ బూత్లలోనే ఎక్కువగా ఈవిఎంలు పని చేయలేదని దేవినేని ఆరోపించారు. మహిళలు అండగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడారని దేవినేని పేర్కొన్నారు.