YS Jagan : అభయంతో ఏపీ పంచాయతీ ఎన్నికల రంగంలోకి కీలక నేతలు, అధికారులు వస్తున్నారా? అంటే అవుననే పరిస్థితలే ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల ‘పంచాయితీ’లో వాద ప్రతివాదాలు, ఎత్తుకు పైఎత్తులు, దూషణలు, చర్యకు ప్రతిచర్యలు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు ఉత్తర్వులు.. ఇలా రాష్ట్రంలో రాజ్యాధికారానికి, రాజ్యాంగ వ్యవస్థకు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. అయితే.. ఈ యుద్ధంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై చేయి సాధించారు. 2021 మార్చిలో పంచాయతీ ఎన్నికలను నిమ్మగడ్డ వాయిదా వేసిన విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు సామాజికవర్గం కారణంగా నిమ్మగడ్డ ఆయనకు అనుకూలంగా పని చేస్తున్నారంటూ సీఎం జగన్ YS Jagan సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి జరుగుతున్న పోరులో సుప్రీంకోర్టులో నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు రావడంతో ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి.
పదవి పవర్ చూపిస్తున్న నిమ్మగడ్డ..
అయితే.. అందివచ్చిన అవకాశంగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తన పదవికి ఉన్న పవర్ ను చూపిస్తున్నారు. ఆయన దూకుడుకు కళ్లెం పడటం లేదు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం నుంచి ఎన్నికలు నిర్వహించే తీరు వరకూ ఆయన ప్రతి అంశాన్నీ కూలంకషంగా చర్చిస్తున్నారు.. ప్రతి అంశం తన దగ్గరకు వచ్చేలా చేస్తున్నారు. నియామాల్లో ఉన్న అన్ని సెక్షన్లు వాడేసేలా నిమ్మగడ్డ సూపర్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు. ఎన్నికల సమయంలో వాలంటీర్ల సేవలు వద్దన్నారు. ఇంటింటికీ రేషన్ ఆపేశారు. ఎమ్మార్వోలు జారీ చేసే కుల ధ్రువీకరణ పత్రాల్లో సీఎం జగన్ ఫొటో ఉండకూడదని ఆదేశాలిచ్చారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన ఉద్యోగ సంఘాల నాయకుడు వెంకట్రామిరెడ్డిపై నిఘా ఉంచాలని ఆదేశాలిచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు ముందు తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారందరిపై చర్యలు తీసుకుంటున్నారు. ఐఏఎస్ అధికారులను, కలెక్టర్లను బదిలీలు చేయాలంటూ ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిపై ఏకంగా గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఇలా.. తనకు ఎదురొచ్చే ప్రతి అంశంపై, నాయకుడిపై, ఉన్నతాధికారులపై ఎన్నికల కమిషన్ పవర్ చూపిస్తున్నారు. అయితే..
తర్వాత అంతా సీఎం జగన్ దే..
ఇదంతా ఎన్నికలు జరిగేంత వరకే. ఈ సమయంలో ఆయన్ను ఎదుర్కోలేక పోయినా ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ జగన్ ప్రభుత్వమే అధికారం చెలాయిస్తుంది. సీఎంగా జగన్ మళ్లీ తన పవర్ చూపిస్తారు. ప్రభుత్వాధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడమే తెలుసు. ఇద్దరి మధ్య నలుగుతున్న ప్రభుత్వ అధికారులకు సీఎం జగన్ ఇప్పటికే భరోసాగా ఉన్నారని చెప్పాలి. సర్వీసు రికార్డుల్లో ఎస్ఈసీ వల్ల రిమార్కు పడితే అధికారులకు ఇది ఒక మచ్చలా ఉండిపోతుంది. ఇద్దరు అధికారులపై అభిశంసన ఇస్తే.. అది చెల్లదు.. వారిపై అభిశంసన చెల్లదంటూ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికే లేఖ రాసింది. ఎన్నికల పంచాయతీ నెల రోజుల్లో ముగిస్తే.. రెండు నెలల్లో నిమ్మగడ్డ రిటైర్ అవుతారు. అప్పటివరకూ నిమ్మగడ్డ హవానే కొనసాగుతుంది. అప్పటివరకూ ప్రభుత్వం తాను చేయాల్సిన పనిని చక్కబెడితే.. ఆ తర్వాత తాను ప్రభుత్వ ఉన్నతోద్యోగులకు చేయాలనుకున్నది చేస్తుందనడంలో సందేహం లేదు.
ముందే ఇలా జరిగుంటే..
అయితే.. ఈ ఎన్నికలను ఏకంగా అసెంబ్లీ ఎన్నిల తీవ్రత వరకూ తెచ్చుకుంది సీఎం జగన్, ఎస్ఈసీ నిమ్మగడ్డ అనే చెప్పాలి. 2018లో అప్పట్లో సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు ఈ ఎన్నికలను నిమ్మగడ్డ నిర్వహించలేదు. జగన్ పట్టుబట్ట లేదు. 2020లో సీఎంగా జగన్ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధపడితే నిమ్మగడ్డ అడ్డుకున్నారు. కరోనా నేపథ్యం చూపిస్తూ ఏకంగా వాయిదా వేసేశారు. సీఎం జగన్ తన అధికారిక హోదాలో నిమ్మగడ్డపై సామాజికవర్గం వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఆయనను ఆ పదవి నుంచి తొలగిస్తూ ఆర్డినెన్స్ తెచ్చారు. అనేక పరిణమాల అనంతరం మళ్లీ నిమ్మగడ్డ తన సీటు దక్కించుకోవడం దగ్గర నుంచీ వీరిద్దరిపై ఎత్తుకు పైఎత్తులు జరిగాయి. మొత్తంగా ఈ అంశాన్ని తెగే వరకూ లాగారు. ఇందులో నిమ్మగడ్డను హైలైట్ అవడం తప్పించి ఏం జరగలేదు. జగన్ నెమ్మదిగా ఉండి ఎన్నికలు జరిపించుకుని ఉంటే తాను చేయాల్సింది చేసేకుని ఆధిపత్యం చూపించుకనే అవకాశం జగన్ కు ఉండేది. ఇప్పటికి మించిపోయింది లేదనే చెప్పాలి.