YS Jagan: ఏపీలో ఉగాధి 2022 నుండి కొత్త జిల్లాల పాలన సిద్ధమవుతోంది.. ప్రభుత్వ పాలన కొత్త జిల్లాల నుండి కొనసాగేలా ప్రభుత్వ పెద్దలు ప్రణాళికలు సిద్ధం చేశారు.. ఈ మేరకు అన్ని జిల్లాల్లో అధికారులు, ప్రణాళిక విభాగం సిబ్బంది కసరత్తు మొదలు పెట్టారు.. అయితే జిల్లాల విభజన విషయంలో జగన్ ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. తాను అనుకున్న 26 జిల్లాలనే చేయాలని జగన్ నూటికి నూరు శాతం ఫిక్సయినట్టున్నారు.. కానీ ఇది అంత సులువు కాదు.. జిల్లాల విభజన అంటే మళ్ళీ మళ్ళీ చేపట్టేది కాదు. ప్రజాభీష్టం మేరకు జాగ్రత్తగా చేయాలి. కానీ ప్రభుత్వం ఎందుకో కొన్ని ప్రాంతాల్లో, కొన్ని జిల్లాల్లో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వెళ్తుంది.. దీనిపై ప్రభుత్వ పక్షాన ఉన్న ప్రజాప్రతినిధులు ఎవ్వరూ మాట్లాడడం లేదు.., ప్రతిపక్షాల నేతలు గొడవ చేస్తున్నా పట్టించుకోవడం లేదు.. పైగా న్యూట్రల్ వర్గాలు, జేఏసీలు ఆందోళనలు చేస్తున్నా ఎక్కడా పెద్దగా స్పందన ఉండడం లేదు.. ఇది జగన్ కి ఒక రకంగా కొత్త సమస్య కాబోతుంది..!!
YS Jagan: మాజీలు యాక్టీవ్ అయ్యారు..!
* ప్రకాశం జిల్లాలో మార్కాపురం కేంద్రంగా పశ్చిమ ప్రాంతాన్ని జిల్లాగా చేయాలని కోరుతూ అక్కడ 40 రోజుల నుండి వివిధ పార్టీల నేతలు.., ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు. తన రాజకీయ మనుగడకు దీన్ని పరీక్షగా నిర్ణయించుకుని.. పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదే క్రమంలో ఆయన కొన్ని అడుగులు ముందుకు వేసి “మార్కాపురం కేంద్రంగా జిల్లా” ప్రకటించకపోతే ఈ నెల 15 నుండి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని ప్రకటించారు. సో.. ఆయన రాజకీయ ఉనికికి ఈ ఉద్యమాన్ని బాగానే వాడుకుంటున్నట్టు లెక్క..!
* మరోవైపు పశ్చిమగోదావరి జిల్లాలో కూడా నరసాపురం మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు ఇదే తరహా పోరాటంతో యాక్టీవ్ అయ్యారు. నరసాపురం కేంద్రంగా జిల్లా ప్రకటించాలని కొన్ని రోజుల నుండి ఆందోళనలు చేస్తున్నారు. ఆ ఉద్యమానికి తెరవెనుక కర్త, కర్మ, క్రియ మొత్తం సుబ్బారాయుడు నడిపిస్తున్నారు.. సో.. ఈ ఉద్యమాన్ని కూడా తన రాజకీయ సెంటిమెంట్ గా వాడుకునే ప్రణాళికలో కొత్తపల్లి ఉన్నారు. ఇదే వేదికపై కొన్ని రోజుల కిందట ఆయన వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ.. తన స్థానిక ఎమ్మెల్యేని గెలిపించినందుకు అందరి ముందు చెప్పుతో కొట్టుకున్నారు..!
* చిత్తూరు, కడప వంటి జిల్లాల్లో కూడా జిల్లాల విభజన ఉద్యమాలతోనే టీడీపీ, జనసేన ఇతర మాజీ నేతలు బాగా యాక్టీవ్ అయ్యారు. మదనపల్లి.., అదోనీ, రాజంపేట వంటి నియోజకవర్గాల్లో కొన్ని వర్గాల ప్రజలను కలుపుకుని వెల్తూ.. ప్రజల సంఘాలను కలుపుకుని వెల్తూ.. టీడీపీ మాజీలు చురుకయ్యారు.. సో.. ఈ వాదన నిజంగా జనంలోకి వెళ్తే.., ఉద్యమాలు మరింత వేగంగా ఉదృతమైతే జగన్ కి కష్టం తప్పదేమో..!?