YS Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన నిన్న కేబినెట్ భేటీ జరిగింది. పలు కీలక నిర్ణయాలపై ఆమోదం తెలిపారు. ప్రతి రెండు మూడు నాలుగు నెలలకు ఒక సారి ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు చర్చించి ఆమోదించేందుకు కేబినెట్ భేటీ జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ పరిపాలన సంబంధిత విషయాలపై చర్చించి ఆమోదం తెలుపుతూ ఉంటారు. ఇది సహజంగా జరుగుతుండేదే. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే..ఈ సారి జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాజకీయపరమైన చర్చ జరగడం విశేషం. గమనార్హం. అదీ కూడా వైఎస్ఆర్ సీపీకి చెందిన అంతర్గత వ్యవహారాలు, వచ్చే ఎన్నికలకు సంబంధించి ప్రణాళిక పై సింపుల్ గా ఓ అయిదు నిమిషాల చర్చ జరిగింది. అదే ఇప్పుడు ఏపి రాజకీయాల్లో ఓ కీలకమైన వార్తగా మారింది. వచ్చే ఎన్నికల నాటికి ఇప్పటి నుండే మంత్రులు అంతా సిద్ధంగా ఉండాలనీ, వచ్చే ఏడాది నుండి పీకే (ప్రశాంత్ కిషోర్) టీమ్ మళ్లీ రంగంలోకి దిగుతుంది అని జగన్ చెప్పారు. అంటే 2019 ఎన్నికల్లో వైసీపీకి పీకే టీమ్ ఎలా అయితే పని చేసిందో అదే విధంగా ప్రశాంత్ కిషోర్ టీమ్ 2024 ఎన్నికల్లో పని చేస్తుంది అని చెప్పారు.
YS Jagan: ఈ పాయింట్ల అర్థమేమిటి..!?
అయితే ప్రశాంత్ కిషోర్ పని చేస్తారనేది డౌటే ఎందుకుంటే ప్రస్తుతం జాతీయ స్థాయి రాజకీయాల్లో ఆయన బిజీగా ఉన్నారు. దీంతో ఆయన వచ్చినా రాకపోయినా వైసీపీకి ఆయన టీమ్ ఇక్కడ పని చేయడానికి సిద్ధంగా ఉందని మంత్రులకు జగన్ చెప్పారు. దానితో పాటు వచ్చే ఏడాది నుండి తాను కూడా వారంలో నాలుగు రోజుల పాటు జనంలో ఉండటానికి ప్రణాళికలు వేస్తున్నారు. వాస్తవానికి దసరా తరువాత వారానికి రెండు గ్రామ సచివాలయాలు సందర్శిస్తాను అని చెప్పారు కానీ దాన్ని మార్పు చేసి వచ్చే సంక్రాంతి తరువాత క్షేత్ర పర్యటనలు చేయడానికి సిద్ధం అవుతున్నట్లు మంత్రులకు వివరించారు. మంత్రులు కూడా ఆయా జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలని సూచించారు. ప్రధానంగా కేబినెట్ భేటీలో మూడు విషయాల గురించి చెప్పారు. తాను క్షేత్ర పర్యటనలు చేస్తాననీ, పీకే టీమ్ సిద్దంగా ఉందనీ, మంత్రులు క్షేత్ర పర్యటనలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలనే మూడు కీలక పాయింట్ లు చెప్పారు.
ఆ వర్గాల్లో వ్యతిరేకత పోతుందా..!?
ఇప్పటికే జిల్లాల వారిగా వైసీపీ పట్ల కొన్ని వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పూర్తి స్థాయిలో కాకపోయినా కొన్ని వర్గాల్లో వ్యతిరేకత కనకబడుతోంది. ప్రభుత్వం చేస్తున్న తప్పులు, కొన్ని సున్నిత వ్యవహారాల కారణంగా, అక్కడక్కడా కొంత మంది ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న వ్యవహారాల కారణంగా పార్టీకి చెడ్డపేరు వస్తోంది. అధికార పార్టీ అన్నతరువాత కొంత వ్యతిరేకత వస్తుంటుంది. అయితే వాటిని సరిద్దుకునే క్రమంలో సీఎం జగన్ పలు కీలకమైన సూచనలు చేశారు. రానున్న ఎన్నికలకు ఇప్పటి నుండే పని చేయండి, ఎన్నికల మూడ్ లోకి వెల్లండి అన్నట్లుగా సూచించారు జగన్. పొలిటికల్ గా యాక్టివ్ కావాల్సి ఉంది అన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ పరిణామాలు చూస్తుంటే జగన్మోహనరెడ్డి మొదటి రెండున్నర సంవత్సరాలు ఒకలా తరువాత రెండున్నర సంవత్సరాలు మరోలా ఉండే అవకాశం కనబడుతోంది. మొదటి రెండున్నర సంవత్సరాల్లో చేసిన తప్పులను, చెడ్డపేరును తరువాత రెండున్నరేళ్లలో కప్పిపుచ్చుకోవచ్చు. ప్రస్తుతం జగన్ ఆ స్ట్రాటజీ అమలు చేయనున్నారు.
ప్లానింగ్ పక్కాగా..!?
సాధారణంగా సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఎంత చెత్తగా ఉన్నా సెకండ్ ఆఫ్ బాగుంటే ఆ సినిమా క్లిక్ అవ్వడంతో పాటు ఫస్ట్ ఆఫ్ గురించి ప్రేక్షకులు పూర్తిగా మరిచిపోయి సెకండ్ ఆఫ్ గురించే గుర్తుంచుకుంటారు. సినిమాకు సెకండ్ ఆఫ్ ఎంత కీలకమో ప్రభుత్వానికి కూడా చివరి రెండున్నర సంవత్సరాలే కీలకం. ఇప్పుడు చేసే పనులే ప్రజల మైండ్ లో గుర్తు ఉంటుంది. ఇక జగన్ ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో పెన్షన్ ఒకే సారి మూడు వేలకు పెంచడమో, నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు, రెండున్నరేళ్లలో మూడు డీఎస్సీలు పెట్టేయవచ్చు. ఉద్యోగులకు పిఆర్సీ ఇవ్వడం, ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ఏడు డీఏలు ఒకే సారి ఇవ్వడం ఇలాంటి పనులు చేయడం వల్ల మొదటి రెండున్నరేళ్లలో ఉన్న మైనస్ అంతా పోయి ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. జగన్మోహనరెడ్డి ఆలోచనా విధానం ఎవరికీ అంతు చిక్కదు. ఆయనలో ఉన్న లోపాలను ఆయన తెలుసుకుని పొలిటికల్ స్ట్రాటజీ అమలు చేస్తే దాన్ని ఎదుర్కొవడం ప్రతిపక్షాలకు కష్టమే. ఒక రకంగా జగన్మోహనరెడ్డి టీమ్ ఎన్నికల కదనరంగంలోకి దిగినట్లే. టీడీపీ కూడా నైరాశ్యం వీడి జనంలోకి పూర్తి స్థాయిలోకి వచ్చి ఎన్నికల రంగంలోకి దిగితే ఏపిలో పొటిలికల్ గేమ్ స్టార్ట్ అయినట్లే..!