ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మొత్తం ఇప్పుడూ గుడి చుట్టూ ప్రదక్షిణలు అన్నట్టుగా…. దేవాలయాల చుట్టూ తిరుగుతున్నాయి. వరుసగా రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో చాలా మందిలో భయాందోళనలు మొదలయ్యాయి. వాస్తవానికి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు గురించి మాట్లాడాల్సి వస్తే ఎక్కువగా కుల రాజకీయ ప్రాతిపదికన ఉంటాయని చాలామంది అంటారు. కానీ తాజాగా మత రాజకీయాలు ఆధారంగా ఏపీలో అధికార- విపక్షాల మధ్య రాజకీయం జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారింది.
అంతర్వేది లో రథం దగ్ధం ఆ తర్వాత విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయంలో వెండి సింహం మాయమవడంతో… అధికార పార్టీ వైసీపీ పై జనసేన, బిజెపి, టిడిపి పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. ఈ విషయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక్క అడుగు ముందుకు వేస్తూ గవర్నర్ కి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా దేవాదాయశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న వెల్లంపల్లి శ్రీనివాస్…. జరుగుతున్న దాడుల విషయంలో సరైన రీతిలో కట్టడి చేయలేక పోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. రథం దగ్ధం సంఘటనపై వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు మరింత కఠినంగా ఉండటంతో పాటు ప్రభుత్వంపై విమర్శలు వచ్చే రీతిగా వ్యాఖ్యలు చేయడంతో జగన్ వెల్లంపల్లి శ్రీనివాస్ విషయంలో అసహనంగా ఉన్నట్లు పార్టీ లో టాక్ నడుస్తుంది.
ఇప్పటికే విపక్షాలు దేవాదాయ శాఖ మంత్రి పై అదేవిధంగా ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో పాటు కుదిరితే కేంద్రం వద్ద పంచాయతీ పెట్టడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి విషయంలో జగన్ త్వరలో సీరియస్ క్లాస్ తీసుకోబోతున్నట్లు.. వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తుంది. మరోపక్క ఇది కావాలని బీజేపీ నేతలు ఆడుతున్న డ్రామా అని అసలు చంద్రబాబు స్లో అయిన తర్వాత బిజెపి పార్టీ రాష్ట్రంలో పుంజుకోవటానికి దేవాలయాలపై దాడులు చేసి ప్రభుత్వంపై విమర్శలు తీసుకు వచ్చి ప్రజలను మత ప్రాతిపదికన చీల్చాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అసలు జగన్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై సీరియస్ అవ్వలేదని…. ఇదంతా టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియా ప్రచారం అని మరి కొంతమంది అంటున్నారు. చంద్రబాబు హయాంలో వీటికన్నా పెద్ద దాడులు హిందూ దేవాలయాల పై జరిగినా అప్పుడు మీడియా సైలెంట్ అవ్వటం, ఇప్పుడు మీడియా పైకి చూపించడమే ఇంత రాద్ధాంతనికి కారణమని జగన్ నమ్ముతున్నట్లు మరోపక్క వార్తలు వస్తున్నాయి.