YS Sharmila: ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు.. ఏపీలో సీఎం జగన్ ఏమి బలహీనపడలేదు.. ఏపీలో ప్రతిపక్ష పార్టీ అంతగా బలపడలేదు.. కానీ రాష్ట్రంలో రాజకీయ రచ్చకు ఏ మాత్రం కొదవ లేదు! అటు జగన్, ఇటు చంద్రబాబు, మధ్య మధ్యలో పవను చాలదన్నట్టు బీజేపీ సోము.., చివరికి కేఏ పాల్ కూడా రాజకీయం చేస్తున్నారు..! ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో షర్మిల కూడా వేలు, తల, కాలు, చేతులు అన్నీ పెట్టబోతున్నారట.. ఈ మేరకు ఆమె పరోక్షంగా కొన్ని సిగ్నళ్లు పంపించారు.. నిన్న తనను ఒక జర్నలిస్టు అడిగితే “ఏపీలో పార్టీ పెడితే తప్పేమిటి..!? దేశంలో ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టొచ్చుగా”..! అంటూ చెప్పేసారు. సో.. పరోక్షంగా ఆమె ఏపీలో రాజకీయ ప్రవేశంపై కొన్ని సంకేతాలిచ్చారు. అయితే ఇక్కడ కొన్ని సున్నితమైన అంశాలు పరిశీలించాల్సి ఉంది. ఆమె పార్టీ పెడితే ఆమెకు వంద ఓట్లు వచ్చినా అందులో 99 ఓట్లు ఆమె అన్నయ్య జగన్ వె.. ఆమెకు లక్ష ఓట్లు వచ్చినా అందులో 99 వేల ఓట్లు ఆమె అన్న జగన్ పార్టీకి వెళ్లాల్సినవే.. అంటే షర్మిల పార్టీ వలన నిలువునా, అడ్డంగా, ఎలాగైనా మునిగేది జగన్ మాత్రమే. అంచేత… ఇక్కడ కొన్ని అనుమానాలు 1. షర్మిల నిజంగా పార్టీ పెట్టాలని ఆలోచిస్తున్నారా..? లేదా ఆ పేరుతో అన్నాను బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..!?.. లేదా ఏపీ రాజకీయాన్ని కాసేపు చర్చకు దారితీయడానికి అన్నా చెల్లెల్లు డ్రామాలాడుతున్నారా..!? ఇలా అనేక అనుమానాలున్నాయి..!
YS Sharmila: సర్వే చెప్పిందట.. పార్టీ పెట్టాలని ఆలోచిస్తే..!?
షర్మిల ఏపీలో పార్టీ పెట్టాలని ఆలోచన చేయడంలో తప్పు లేదు. అందుకు చాలా అవకాశాలున్నాయి. తెలంగాణాలో రాజకీయ పార్టీ పెట్టినప్పటికీ పెద్దగా ఆమె ఆశించిన స్పందన రావడం లేదు. తెలంగాణ అనేది ఒక ప్రాంతీయ సెంటిమెంట్, ఒక యాస, భాష అన్ని భిన్నమైన సంస్కృతులు.. షర్మిల పూర్తిగా ఆ తరహాలో అల్లుకుపోలేరు. ఆమెకు అక్కడి సంప్రదాయాలు, అక్కడి రాజకీయాల మూలాలు తెలియవు. ఏదో నాన్న వేసిన పునాది ఉంది, బ్రాండ్ ఉంది కాబట్టి పెట్టేసారు. కానీ అక్కడ ఏ మాత్రం అనుకూల పరిస్థితులు లేవని తాను చేసిన పాదయాత్ర ద్వారానే తెలుసుకుంది. పైగా ఆమె చేయించుకున్న సర్వేలో కూడా ఒకటి, రెండు స్థానాలు గెలుపు కూడా కష్టమేనని తేలిందట.. అందుకే ఏపీపై ఆమె మనసు పడినట్టు.. ఏపీలో ఆమె పార్టీ పెడితే కనీసం 15 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్టు సర్వే ద్వారా వెల్లడవ్వడంతో ఆమె ఇటు మనసు పెట్టినట్టు సమాచారం.. అయితే ఆ 15 స్థానాలు కూడా తన అన్న పార్టీకి వెళ్లాల్సినవే.. ఆమెకు వచ్చే ప్రతీ ఓటు తన అన్న పార్టీకి వెళ్లాల్సినదే.. అందుకే పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. ఈ పేరుతో అన్నయ్యతో కొన్ని లావాదేవీలు, లెక్కలు తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు భోగట్టా..!
YS Sharmila: అన్నకు బ్లాక్ మెయిలింగ్..!?
షర్మిల పార్టీ వలన జగన్ కి రాజకీయంగా నష్టం తప్పదు. ఆ విషయం జగన్ కి బాగా తెలుసు. షర్మిల విస్తృతంగా ప్రచారం చేస్తే.., జగన్ లోపాలను, బలహీనతలు బయటపెడితే కనీసం 20 నుండి 25 స్థానాల్లో ఇబ్బందులు తప్పవు. తనకు సీటు కంటే ఏదీ ముఖ్యం కాదు. అందుకే షర్మిల ఏపీలో పార్టీ పెట్టకుండా ఉండడానికి ఆమెకు ఏం కావాలన్నా ఇవ్వడానికి జగన్ సిద్ధ పడే అవకాశం ఉంది. సో.. ఇదే అదనుగా షర్మిల అన్నతో ఆస్తి లావాదేవీలు.., పాత లెక్కలు.., కొన్ని కుటుంబ పరమైన వ్యవహారాలు కూడా తేల్చుకునే పనిలో ఉన్నట్టు వైఎస్ కుటుంబ వర్గాల ద్వారా తెలుస్తుంది. జగన్ సాధారణంగా ఎవరికీ లోంగే రకం కాదు. ఎవరి మాట వైన్ రకం కాదు. చాలా షార్ప్. చాలా తెలివి, టెంపర్, కన్నింగ్, రాజకీయం అన్నీ తెలిసిన వ్యక్తి. సో.., తన సొంత ఓటి వర్గాన్ని చీల్చడానికి తన సొంత చెల్లి రాజకీయ పార్టీ పెడతానని.. లేకపోతే నాకు అంత ఇవ్వాలి, ఇంత ఇవ్వాలి అని బేరం పెడితే చూస్తూ ఊరుకునే రకం కాదు. తనకు ఉన్న అనేక తలనొప్పుల్లో ఇది కొత్తగా పెద్దది చేసుకునే రకం కాదు.. అందుకే ఏదోటి తేల్చేసి, సైలెంట్ చేయాలని ఆలోచనలో జగన్ ఉన్నట్టు సమాచారం. అయితే ఈ చర్చలు ఓ దశకు రావట్లేదు.
ఇద్దరి డ్రామా అంటూ కొన్ని వార్తలు..!!
అయితే షర్మిల పార్టీ ఏపీలో ప్రవేశంపై మరో భిన్నమైన వాదన కూడా ఉంది. తెలంగాణాలో షర్మిల పార్టీ తెరవెనుక ఎవరున్నారు..? అనే స్పష్టత ఇప్పటికే ఎవ్వరికీ లేదు. కొందరు బీజేపీనే ఆమెతో ఆ పార్టీ పెట్టించిందని.. కొందరేమో కాంగ్రెస్ తో సన్నిహితంగా ఆమె ఆ పార్టీ పెట్టారని.. కొందరేమో జగన్ – కేసీఆర్ కలిసి షర్మిల చేత ఆ పార్టీ పెట్టించి ఓట్లు చీలిక రాజకీయం చేస్తున్నారని రకరకాల పుకార్లున్నాయి. ఇన్ని రకాల చర్చల మధ్య.. ఎటువంటి స్పష్టత రాకుండానే.. ఆమె తెలంగాణ రాజకీయాల్లో నిలదొక్కుకొండానే.., ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టాలని చూడడం ఇది మరో డ్రామాగా కొందరు చెప్పుకుంటున్నారు. “ఏపీలో షర్మిల పార్టీ పేరిట పుకార్లు.., లీకులు ఇవ్వడం ద్వారా మీడియాని డైవర్ట్ చేయడం.., బాబుని ధీమాలోకి పంపించడం.. టీడీపీ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీయడం.. రాజకీయాన్ని రక్తి కట్టించి.. చివర్లో అనూహ్య ట్విస్ట్ ఇవ్వడం లాంటి మైండ్ గేమ్ కావచ్చనేది కొన్ని వర్గాల అభిప్రాయం..!