అమరావతి, మార్చి 28: వైసిపి గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిల ఎన్నికల ప్రచార షెడ్యూల్ను ఆ పార్టీ నేతలు విడుదల చేశారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి నిత్యం రెండు మూడు జిల్లాలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగిస్తున్నారు. జగన్మోహనరెడ్డి ఎన్నికల ప్రచారంలో కవర్ చేయలని ప్రాంతాల్లో విజయమ్మ, షర్మిలలు పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించనున్నారు. వీరు శుక్రవారం నుండి రోజు రెండు నియోజకవర్గాలలో జరిగే రోడ్షోలో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభించేందుకు ముందుగా వీరు గురువారం పులివెందులలో ఇడుపులపాయ వద్ద దివంగత సిఎం వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.
వైఎస్ విజయమ్మ ఈ నెల 29న శుక్రవారం ప్రకాశం జిల్లా కందుకూరు, కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లో, 30వ తేదీ ఫ్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం, గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గాల్లో, 31న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, పలాస, పాతపట్నం నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు.
వైఎస్ షర్మిల 29న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో 30న గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో, 31న గుంటూరు జిల్లా తాడికొండ పెదకూరపాడు, నర్సరావుపేట నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు