వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం రాష్ట్రానికి తీరని లోటు. సుమారు 30 ఏళ్ల రాజకీయ చరిత్ర తరువాత ముఖ్యమంత్రిగా మొదటి సారి బాధ్యతలు స్వీకరించిన వైఎస్ 2004 నుండి 2009 వరకూ చరిత్ర లిఖించారు. సంక్షేమ రథాన్ని పరుగులు పెట్టించారు. రాష్ట్రంలో పరిపాలన అంటే ఇలా ఉండాలి అనేటట్లు చూపించారు. పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయేలాంటి పాలన అందించారు. ఆ సంక్షేమ స్పూర్తితోనే 2009 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. అయితే 2009 నుండి 2014 వరకూ పూర్తి స్థాయిలో అయిదేళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన అందిస్తారు అనుకున్న తరుణంలో అనుకోని ఘటన కారణంగా ఆయన మరణం రాష్ట్రానికి లోటుగా మిగిలింది. అయితే ఆయన ఎలా మరణించాడు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. రాజశేఖరరెడ్డి చనిపోవడానికి ముందు రోజు 24 గంటలు ఏమి జరిగింది అనేది “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేకంగా అందిస్తోంది.
- 2009 సెప్టెంబర్ 1 మంగళవారం కారుమబ్బులు కమ్మేశాయి, రాష్ట్రంలో ఎక్కడికక్కడ కుండపోత వర్షాలు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోనూ అదే పరిస్థితి నెలకొన్నది. ఆ సమయంలో సిఎం వైఎస్ఆర్ కలెక్టర్లతో సమావేశమైన రాష్ట్రంలో భారీ వర్షాలపై సమీక్ష జరిపారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
- 2009 ఎన్నికల్లో మళ్లీ గెలిచినా వైఎస్ఆర్ మదిలో ఏదో ఒక మూల చిన్న అసంతృప్తి మిగిలిపోయింది. ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసినా, బొటాబొటి మెజార్టీతో గెలిచామన్న భావన ఆయన వైఎస్ఆర్ మదిలో బలంగా నాటుకుపోయింది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఏదో కనెక్షన్ మిస్ అయ్యింది దాన్ని అధిగమించడానికి ప్రజలకు మరింత చేరువ కావాలన్న నిర్ణయానికి వచ్చారు వైఎస్ఆర్. అందుకే రచ్చబండ కార్యక్రమంతో నిర్వహించాలని తలపెట్టారు. రోజుకు రెండు మూడు జిల్లాల్లో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా చేశారు.
- ఎన్నికల్లో గెలిచాక తొలి అసెంబ్లీ సమావేశాల చివరి రోజు నవ్వుతూనే ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇచ్చారు. సమావేశాలు వాడివేడిగా సాగాయి. అసెంబ్లీ సెషన్ ముగియగానే అటు నుంచి అటు క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు వైఎస్ఆర్.
- మరుసటి రోజే ఒక చారిత్రాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. అప్పటికే రచ్చబండ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష జరిపారు. ఆ తరువాత కాన్వాయ్లో ఇంటికి చేరుకున్నారు. క్యాంప్ ఆఫీసులో వైఎస్ఆర్ గడిపిన ఆఖరి రోజు అదే.
- అసెంబ్లీ కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాలతో బాగా అలసిపోయారు వైఎస్ఆర్ను చూసిన విజయమ్మ రేపు రచ్చబండ కార్యక్రమానికి వెళ్లాలా? విశ్రాంతి తీసుకుని ఎల్లుండి వెళితే బాగుంటుంది కదా అని సమాధాన పరిచే ప్రయత్నం చేయగా, వైఎస్ఆర్ నుండి వచ్చిన సమాధానం మరోలా ఉంది. “నేను మాట ఇచ్చాను, ప్రజలు నా కోసం ఎదురు చూస్తుంటారు. నేను తప్పక వెళ్లాల్సిందే” అన్నారు వైఎస్ఆర్. ఇక ఆ మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. భోజనం అయిన తరువత రాత్రి 9.30 గంటలకు వైఎస్ నిద్రపోయారు. అదే ఆయన ఆఖరి నిద్ర.
- ఆ రోజుతో మహానేత గుండె ఆగిపోతుందని, ఓ చరిత్ర ముగిసిపోతుందని, కోట్లాది మంది బోరున విలపించే సందర్భం ఒకటి వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఒ నాయకుడి కోసం అభిమానుల కళ్లు ఆశగా, ఆతృతగా ఎదురు చూస్తాయని కలగని ఉండరు.
- వైఎస్ హెలికాప్టర్ అదృశ్యం అయిన క్షణం నుండి నరాలు తెగే ఉత్కంఠ మధ్య రాష్ట్రం నిద్రలేని రాత్రి గడిపింది.
- 2009 సెప్టెంబర్ 2 బుధవారం వేకువజామునే లేచిన వైఎస్ఆర్ యోగా చేసి తన పనుల్లో నిమగ్నమైయ్యారు. అదే ఆయన చూసిన ఆఖరి సూర్యోదయం. చిత్తూరు జిల్లా అనుపల్లిలో రచ్చబండ కార్యక్రమానికి వైఎస్ఆర్ నోట్స్ తయారు చేసుకున్నారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి క్యాంప్ ఆఫీసుకు వచ్చిన ప్రజలను ఆత్మీయంగా పలకరించారు. వారు ఇచ్చిన అర్జీలు తీసుకుని చిరునవ్వుతో కొండంత భరోసా ఇచ్చారు. మరో పక్క బేగంపేట ఎయిర్ పోర్టులో సిఎం ప్రయాణానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లడానికి కాన్వాయ్ కూడా సిద్ధమైంది. వైఎస్ఆర్కు విజయమ్మ హారతి ఇచ్చి సాగనంపారు. అదే ఆమెకు చివరి చూపు అవుతుందని ఊహించలేదు. అదే వైఎస్ ఆఖరి వీడ్కోలు. రచ్చబండకు బయలుదేరే ముందు ఆ కార్యక్రమం గురించి మీడియాతోనూ వైఎస్ఆర్ మాట్లాడారు. ప్రజలతో మరింతగా మమేకం అయ్యేందుకు, వారి కష్టనష్టాలను నేరుగా తెలుసుకునేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పుకొచ్చారు వైఎస్ఆర్. మీడియాతో మాట్లాడిన చివరి సందర్భం అది.
- సమయం ఉదయం 8.30 నిమిషాలు హెలికాఫ్టర్ ప్రయాణానికి వాతావరణం అంత అనుకూలంగా లేదు. అప్పటికే హైదరాబాదులో చిరు జల్లులు పడుతునే ఉన్నాయి. అయినా అలాంటి వాటిని లెక్కచేసే మనస్తత్వం వైఎస్ఆర్ది కాదు. అందుకే నవ్వుతూనే హెలికాఫ్టర్ ఎక్కేశారు. వైఎస్ఆర్తో పాటు సిఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి పి సుబ్రమణ్యం, ప్రధాన భద్రతా అధికారి జాన్ వెస్లీ, పైలట్ ఎస్కె భాటియా, కో పైలెట్ ఎమ్ఎస్ రెడ్డి ఉన్నారు.
- సమయం 8.38 నిమిషాలు హెలికాఫ్టర్ గాలిలోకి ఎదిరింది. బేగంపేటలో సిఎం హెలికాఫ్టర్ బయలుదేరగానే అక్కడ చిత్తూరు జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. హెలికాఫ్టర్ లాండ్ అవ్వడానికి అయిదు మండల కేంద్రాల్లో హెలీప్యాడ్లు ఏర్పాటు చేశారు. మరో వైపు హైదరాబాదులో వర్షం తీవ్రత పెరిగింది. అటు వినాయక నిమజ్జన వేడుకలతో నగరం అంతా సందడిగా మారింది.
- చిత్తూరు జిల్లా అనుపల్లి రచ్చబండ కార్యక్రమం అనంతరం వైఎస్ఆర్ నెల్లూరు, ప్రకాశం జిల్లాలో పర్యటించాలి. బేగంపేట ఎయిర్ పోర్టు నుండి 8.38 నిమిషాలకు బయలుదేరిన వైఎస్ఆర్ హెలికాఫ్టర్ అటు ఇటుగా పదిన్నర లోపు గమ్యస్థానానికి చేరుకోవాలి. ప్రయాణించాల్సిన దూరం 473 కిలో మీటర్లు. హెలికాఫ్టర్లో మూడు గంటలకు సరిపడా ఇంధనం ఉంది. వాతావరణం అనుకూలిస్తే రెండు గంటల్లోనే గమ్యస్థానానికి చేరిపోవాలి.
- ఉదయం 9గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి, 9.02 నిమిషాలకు చెన్నై ఎయిర్ పోర్టుకు వైఎస్ఆర్ ప్రయాణించిన హెలికాఫ్టర్ నుంచి హై ఫ్రీక్వెన్సీ రేడియో సిగ్నల్స్ అందాయి. 9.12 నిమిషాలకు పైలట్ భాటియా శంషాబాద్ ఏటిసీని సంప్రదించారు. 9.30నిమిషాలకు చెన్నై ఎటిసీకి టచ్లోకి వస్తామని పైలెట్ భాటియా చెప్పినట్లు శంషాబాద్ ఎటిసీలో రికార్డు అయ్యింది. వెంటనే చెన్నై ఏటిసితో మాట్లాడిన శంషాబాద్ ఏటిసి సిబ్బంది కమ్యూనికేషన్ ఫ్రీకెన్సీ మార్చుకోవాలని సూచించారు.
- 31 నిమిషాలకు శంషాబాద్ ఏటీసి రాడార్ పై హెలికాఫ్టర్ మాయం అయ్యింది. ఆ తరువాత బెల్ 430 హెలికాఫ్టర్కు ఏటీసితో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. హెలికాఫ్టర్లో ఉన్న అధికారుల ఏ సెల్ ఫోన్కు సిగ్నల్ అందలేదు. అందులో శాటిలైట్ ఫోన్ కూడా లేదు.
- రెండు గంటల్లో గమ్యానికి చేరుకోవాల్సిన హెలికాఫ్టర్ మూడు గంటలైనా చేరుకోలేదు. అప్పటి చిత్తూరు జిల్లా మంత్రి గల్లా అరుణ కుమారితో పాటు అధికారుల్లో టెన్షన్ మొదలైంది. అప్పటికే వైఎస్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ మిస్ అయ్యిందన్న వార్త లీక్ అయ్యింది. మంత్రులు, ఉన్నతాధికారులు, పోలీస్ ఉన్నతాధికారుల ఫోన్లు అన్నీ బిజిగా మారాయి. అసలేమయ్యుంటుంది? హెలికాఫ్టర్ సేఫ్గా లాండ్ అయి ఉంటుందా? అందరిలోనూ ఒక్కటే టెన్షన్. నరాలు తెగే ఉత్కంఠ. ఇప్పటికీ ఆ రోజు గుర్తుకు వస్తే తెలియకుండానే చెమటలు పడతాయి. ఆ విషాద క్షణాలు మదిలో మెదిలితే కళ్లు చెమరుస్తాయి.
- వైఎస్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ అదృశ్యం వార్త రాష్ట్రంలో దావానలంగా పాకింది. అధికారులు, మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. కేబినెట్లో సీనియర్ మంత్రి రోశయ్య ఆధ్వర్యంలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా ఇతర మంత్రులు, అధికారులతో అత్యవసర భేటీ అయ్యారు.
- హెలికాఫ్టర్ ఎక్కడ ఉంది? ఏమి చెద్దాం? అందరి మొహల్లోనూ ఒక్కటే టెన్షన్. అప్పటికే హెలికాఫ్టర్ సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. అది ఫలించకపోతే నెస్ట్ ఏమిటి? ‘ఇస్రో’ను సంప్రదించాలా? అవసరమైతే ‘నాసా’ సహాయం తీసుకోవాలా? అనే దానిపై సుదీర్ఘందా చర్చ జరిగింది. వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు మండలాల్లో హెలికాఫ్టర్ అత్యవసరంగా లాండ్ అయి ఉంటుందని అంతా భావించారు. ఎయిర్ పోర్టుకు చెందిన రెండు హెలికాఫ్టర్లతో పాటు బెంగళూరు నుండి మరో మూడు హెలికాఫ్టర్లు, హైదరాబాదు నుండి ప్రభుత్వ హెలికాఫ్టర్తో గాలింపు చర్యలు చేపట్టారు.
- ఏడు జిల్లాల్లో విస్తరించిన నల్లమల అటవీ ప్రాంతంలో వైఎస్ ప్రయాణించిన హెలికాఫ్టర్ కోసం అనువణువూ గాలించారు. అయినా ఆచూకీ దొరకలేదు. చివరకు సెర్చ్ ఆపరేషన్లోకి యుద్ధ విమానం సుఖోయ్ దిగింది. హెలికాఫ్టర్ ఎక్కడైనా క్రాష్ అయితే దాని నుండి వచ్చే రాడార్ సిగ్నల్స్ ను సుఖోయ్ క్యాచ్ చేస్తుంది. అంతే కాదు అతి తక్కువ ఎత్తు నుంచి అది ఎగురగలదు. నల్లమల అటవీ ప్రాంతం మొత్తం గాలించినా ఎందుకో గానీ ఎలాంటి సిగ్నల్స్ అందలేదు. అంటే హెలికాఫ్టర్ ఎక్కడో సేఫ్ గా లాండ్ అయ్యిందన్న ఆశలు అందరినో చిగురించాయి. అయినా ఉత్కంఠ మాత్రం వీడలేదు. ఆశ నిరాశల మధ్య ఊగిసలాటలతో క్షణక్షణం గడిచింది.
- నిజానికి వైఎస్ ప్రయాణించిన హెలికాఫ్టర్ లో ఉండే సిగ్నల్స్ సిస్టమ్ అప్ డేట్ కాకపోవడం వల్లే ఆ రోజు సుఖోయ్ కి సిగ్నల్స్ అందలేదు. వైఎస్ఆర్ క్షేమంగా తిరిగి రావాలని రాష్ట్రం అంతా సర్వమత ప్రార్థనలు జరిగాయి. ఒక్క తెలుగు మీడియానే కాదు నేషనల్ మీడియా కూడా దీనిపైనే దృష్టి పెట్టింది. కోట్లాది మంది ప్రజలు టీవిలకు హతుక్కుపోయారు. క్షణక్షణం నరాలు తెగే ఉత్కంఠ. వైఎస్ హెలికాఫ్టర్ ఎక్కడైనా సేఫ్ గా లాండ్ అయ్యిందా? అయితే ఎక్కడ లాండ్ అయ్యింది, వైఎస్ క్షేమంగానే ఉన్నారా? ఇలాంటి ప్రశ్నలు అందరిలో మెదిలాయి. గంటలు గడుస్తున్నా వైఎస్ ప్రయాణించిన హెలికాఫ్టర్ ఆచూకీ దొరకలేదు. నల్లమల అటవీ ప్రాంతంలో ఏదైనా మిస్ అయితే వెతికి పట్టుకోవడం అంత సులభం కాదు. అందుకే ప్రభుత్వానికి కూడా చెంచులే దిక్కు అయ్యారు. రాత్రి సమయంలోనూ స్వచ్చందంగా వచ్చిన చెంచులు బృందాలుగా విడిపోయి అడవి మొత్తం జల్లెడపట్టారు. మరో వైపు గంటకో విధంగా వినిపిస్తున్న ఊహగానాలు, గంట గంటకూ పెరుగుతున్న ఉత్కంఠ, ఆ టెన్షన్ రాత్రంతా కొనసాగింది. ఏవ్వరికీ కంటి మీద కునుకు లేకుండా అయ్యింది.
- ఎవరికోసమైతే కోట్లాది మంది ఎదురు చూశారో. అతను మళ్లీ రాలేదు. ఏ వార్త వినకూడదని రాష్ట్రం తలచిందో ఆదే దుర్వార్త వినాల్సి వచ్చింది. ఆ మహానేత తిరిగి రావాలని మొక్కిన మొక్కులు, చేసిన ప్రార్థనలు ఏ ఒక్కటీ ఫలించలేదు. హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ దుర్మరణం వార్త అందరినీ కలచివేసింది. తెలుగు ప్రజలను శోకసంద్రంలోకి నెట్టేసింది. అంతులేని విషాదాన్ని మిగిల్చింది.
- 2009 సెప్టెంబర్ 3 గురువారం ఉదయం ఓ చరిత్రను తనలో కలిపేసుకుంటుందని. ఆ సూర్యోదయం మరో సూర్యుడు అస్తమించాడనే వార్త మోసుకు వస్తుందని ఏ ఒక్కరూ ఊహించలేదు. కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి 24 కిలో మీటర్ల దూరంలో రుద్రకొండపై ఉన్న పావురాలగుట్టపై వైఎస్ఆర్ ప్రయాణించిన హెలికాఫ్టర్ కూలిపోయింది.
- ఈ ప్రమాదంలో వైఎస్ఆర్తో సహా ఇద్దరు అధికారులు, మరో ఇద్దరు పైలెట్ లు దుర్మరణం పాలైయ్యారు. ప్రమాద స్థలాన్ని గుర్తించిన అధికారులు అక్కడే మృత దేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వాటిని ప్రత్యేక హెలికాఫ్టర్ లో హైదరాబాదుకు తీసుకు వెళ్లారు. ఓ నాయకుడి కోసం రాష్ట్రం మొత్తం కన్నీళ్లు పెట్టుకోవడం అదే మొదటి సారేమో.తమ అభిమాన నాయకుడు దూరం అయ్యాడని కొన్ని గుండెలు ఆగిపోవడం ఆదే తొలిసారి కావచ్చు. అంతలా ప్రజలకు దగ్గర అయ్యారు దివంగత వైఎస్ఆర్.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?