హైదరాబాద్, జనవరి 28: తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ‘జయహో బిసి’ సభకు పోటీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త్వరలో ‘బిసి గర్జన ’ సభ నిర్వహించాలని నిర్ణయించింది. సోమవారం హైదరాబాద్లో వైసిపి అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ బిసి అధ్యయన కమిటి, బిసి నేతలు సమావేశమై ‘జయహో బిసి’ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీల గురించి చర్చించారు.
వైసిపి అధికారంలో వస్తే బిసిల కోసం ఏం చేస్తుందో ప్రజలకు తెలియజేయాలని ఆయన నేతలకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగున్నర ఏళ్ల కాలంలో బిసిలను ఏ విధంగా మోసం చేసిందో వివరించాలని ఆయన చెప్పారు. అందుకోసం టిడిపి సభకు దీటుగా రాష్ట్రంలో భారీ బిసి సభను పార్టీ పరంగా నిర్వహించాలని నేతలకు ఆయన సూచించారు.
బిసిల సమస్యల పరిష్కారం కోసం పార్టీ బిసి అధ్యయన కమిటీ సూచన మేరకు అధికారంలోకి రాగానే ప్రతి కులానికి ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్ధికంగా చేయూతనివ్వడానికి గతంలోనే నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. వైసిపి నేతతో పార్టీనేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, జంగా కృష్ణమూర్తి, పార్ధసారధి, జోగి రమేష్, పిల్లి సుభాష్ చంద్రబోస్ సమావేశమైనవారిలో ఉన్నారు.