రాజధానిగా చూపిస్తూ అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో పెద్ద భూకుంభకోణం జరిగిందనేది వైసీపీ ఆరోపణ. ఇప్పటివరకూ అమరావతి వరకే పరిమితమైన ఈ ఇన్ సైడర్ ట్రేడింగ్ ఇప్పుడు విశాఖ వరకూ పాకింది. అక్కడ వైసీపీ ఇందుకు తెరతీసిందని టీడీపీ ఆరోపిస్తోంది. మరి.. వైసీపీ చెప్తున్న ఇన్ సైడర్ ట్రేడింగ్ గెలుస్తుందా.. టీడీపీ లేవనెత్తుతున్న ఇన్ సైడర్ ట్రేడింగ్ గెలుస్తుందా అనేది ఆసక్తిగా మారింది. అమరావతిలో జరిగిందేమిటో.. విశాఖలో జరుగుతున్నదేంటే తేలాల్సిన తరుణం వచ్చినట్టే తెలుస్తోంది.
వేలాది ఎకరాలు రాజకీయ నాయకుల చేతుల్లోకేనా..?
రాజధానిగా ఓ ప్రాంతం నిర్ణయం కాకముందే.. ఆ ప్రాంతంలో రాజధాని రాబోతుందని తెలుసుకుని ముందుగా భూములు కొనడమే ఇన్ సైడర్ ట్రేడింగ్. గత టీడీపీ ప్రభుత్వం చేసింది ఇదేనంటూ ఆరోపిస్తూ.. ఈ ఆరోపణలకు కట్టుబడి ఉంది వైసీపీ. 4068 ఎకరాల్లో టీడీపీ ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిందని.. దానిపై సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ పట్టుబడుతోంది. దీనిలో టీడీపీ మాజీ మంత్రులు, నాయకులు, కొందరు న్యాయవాదులు, న్యాయమూర్తులు కూడా ఉన్నారనేది వైసీపీ ఆరోపణ. ఇదిలావుంటే.. విశాఖలో రాజధాని పేరుతో అక్కడ ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని టీడీపీ అనుకూల మీడియా మూడు రోజుల నుంచి కోడై కూస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిలోనే విశాఖలో దాదాపు 70వేల రిజిస్ట్రేషన్లు, 22వేల ఎకరాల భూముల లావాదేవీలు జరిగాయని.. ఆధారాలు కూడా ఉన్నాయని అంటోంది.
నిగ్గు తేలి నిజాలు బయటకొస్తే షాకయ్యేది ఎవరు?
మొత్తం మీద అమరావతి, విశాఖలో భూ కుంభకోణాలు జరిగిందనేది వాస్తవం. ఎవరు తిన్నారు, ఎవరు అవినీతి చేశారు.. ఏ ప్రభుత్వం ఎక్కువ చేసిందనేది తేల్చాలంటే.. రెండు పిల్లుల మధ్య కోతి కథలా మారే అవకాశం ఉంది. టీడీపీ, వైసీపీ భూభాగోతలు బీజేపీ చేతిలో రాయిలా మారేలా ఉంది. అమరావతిపై సీబీఐ విచారణ చేస్తే.. విశాఖపై కూడా సీబీఐ విచారణ చేయాలని టీడీపీ పట్టుబడుతోంది. ఇదే జరిగితే.. కేంద్రంలో ఉన్న బీజేపీకి వైసీపీ, టీడీపీని శాసించే అవకాశం చిక్కినట్టే. రెండు ప్రభుత్వాలు, రాజధానుల్లో జరిగిన అవినీతి ఆరోపణల్లోని నిజాలను న్యూట్రల్ వర్గాలు నిగ్గు తేలిస్తే వచ్చే ఎన్నికలపై ఆ ప్రభావం తప్పక ఉంటుందనే చెప్పాలి.