ఓ ఎమ్మెల్యే పార్టీ వీడుతున్నారంటే బోలెడంత బుజ్జగింపులు ఉంటాయి. ఓ ఎమ్మెల్యే కొత్తగా పార్టీలోకి వస్తున్నాడంటే చాలా హడావిడి ఉంటుంది. కానీ.. ప్రస్తుతం ఓ ఎమ్మెల్యే విషయంలో ఆ బుజ్జగింపులు లేవు.. హడావిడీ లేదు. ఆ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి. అనేక పర్యాయాలు చివరి వరకూ వెళ్లి ఆగుతోంది ఈ ప్రక్రియ. దీంతో నాన్నా.. పులి కథలా తయారైంది గంటా పార్టీ మారే పరిస్థితి. దీంతో రెండు పార్టీలతోపాటు విశాఖలో కూడా గంటాను లైట్ తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.
మొదటి నుంచీ లైట్ తీసుకుంటున్న టీడీపీ..
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నుంచి వీడిపోయే ఎమ్మెల్యేల లిస్టులో గంటా పేరు మొదటి వరుసలో నిలిచింది. గంటా రాజకీయ నేపథ్యం, అవితీని ఆనవాళ్లు తెలిసిన టీడీపీ ఇందుకు సిద్ధమైపోయింది. ఆయన వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నా ఎటువంటి బుజ్జగింపులు చేయలేదు. అధినేత నుంచి కబురు కూడా రావడం లేదు. విశాఖ టీడీపీ నుంచి కూడా గంటాను పట్టించుకోవడం లేదు. టీడీపీ కార్యకర్తలు, గంటా అనుచరులు కూడా ఆయన్ను లైట్ తీసుకున్న ధోరణే కనిపిస్తోంది. అందుకే ఎవరూ స్పందించడం లేదు.
వైసీపీ నుంచి కూడా హడావిడి లేదు..
ఓ ఎమ్మెల్యే పార్టీని వీడి తమ పార్టీలోకి వస్తున్నాడంటే హడావిడి ఉంటుంది. మంత్రి, ఎంపీగా అనుభవం.. ఇవి చూసైనా కాస్త హడావిడి ఉంటుంది. కానీ.. వైసీపీలో అదేమీ కనిపించడం లేదు. కారణం.. గంటా రాజకీయ చరిత్ర. తన అవినీతి మరకలు చెరిపేసుకునేందుకే పార్టీ మారుతున్నారని వారు కూడా పట్టించుకోవడం లేదు. పైగా.. గంటా రాకను ఆ జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్, ముఖ్య నేత విజయసాయి రెడ్డి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ శ్రేణులు కూడా గంటా రాకపై పెదవి విరుస్తున్నారు. దీంతో రెండు వైపుల నిరాదరణకు గురవుతున్నారు గంటా. అయితే.. జగన్ ఇచ్చిన భరోసా మీద గంటా వైసీపీలోకి వెళ్తున్నారని తెలుస్తోంది. మరి.. గంటా రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చూడాల్సిందే.