YSRCP: జగన్ అంటే గట్స్ ఉన్న నాయకుడు.. ఆయన అడుగుల్లో డేరింగ్ ఉంటుంది.. నిర్ణయాల్లో నిండా రిస్క్ ఉంటుంది.. కానీ మంత్రివర్గ కూర్పు సందర్భంగా జగన్ కొన్ని అడుగులు వెనక్కు వేశారు.. తాను అనుకున్నది అనుకున్నట్టు అమలు చేయలేకపోయారు.. కొన్ని ఒత్తిళ్లకు, కొన్ని ప్రయత్నాలకు.. కొందరి సలహాలకు తలొగ్గారు..! ఇదే సమయంలో మంత్రివర్గ విస్తరణపై వచ్చిన అసమ్మతి వాదుల విషయంలో జగన్ తీసుకున్న ఓ నిర్ణయం షాకింగ్ డేరింగ్ వార్నింగ్ అని చెప్పుకోవచ్చు.. ఆ నిర్ణయమే అమలైతే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చేవి.. పొలిటికల్ హీట్ రగిలేది.. ఇద్దరు మాజీ మంత్రులు/ వైసీపీ ఎమ్మెల్యేల భవిత మునిగిపోయేది..!
YSRCP: రాజీనామాలు ఆమోదించేలా..!?
మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో కొందరు అసమ్మతి రాజేశారు.. బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు.. కొందరు కన్నీరు పెట్టుకున్నారు. కొందరు అలిగి ఇంట్లో పడుకున్నారు.. కొందరు రోడ్డెక్కారు.. ఈ క్రమంలోనే కొందరు హద్దులు దాటారు. బుజ్జగింపులకు లొంగలేదు. బుజ్జగించడానికి వెళ్లిన వాళ్లకు చుక్కలు చూపించారు.. కొందరు నేరుగా జగన్ పైకే విమర్శలు చేసే వరకు వెళ్లారు. సో.. ఇది జగన్ కి నచ్చలేదు. అసంతృప్తికి, అసమ్మతికి ఒక లిమిట్ ఉంటుంది.. అది దాటితే ఎందుకు ఊరుకోవాలి..? అనుకున్నారేమో.. జగన్ ఒక్క మాట చెప్పారు. తన కార్యాలయంలో తన సన్నిహితులకు సీరియస్ ఆదేశం ఇచ్చారు. పార్టీలో హద్దులు దాటితే ఎలా ఉంటుందో చూపించాలని డిసైడ్ అయ్యారు.. “బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకతోటి సుచరితల రాజీనాలు ఆమోదించండి, ఉప ఎన్నికలకు వెళదాం, అక్కడే తేలుద్దాం” అంటూ నిర్ణయం తీసుకున్నారు. తన సన్నిహితులకు చెప్పి, అమలు చేయమన్నారు.. కానీ ఇదే సందర్భంలో జగన్ దగ్గరి వాళ్ళు “ఓ సారి అలోచించి నిర్ణయం తీసుకుందాం. ఫైనల్ గా వాళ్లకు చెప్పి చూద్దాం” అని చెప్పినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే..!
బాలినేని దగ్గరకు తుది సంకేతం..!!
విజయవాడలో బాలినేని నివాసంలో ఆయన సన్నిహితులు చర్చలు సాగిస్తున్నారు.. మరోవైపు బాలినేని పార్టీలో ఎమ్మెల్యేలు, అసమ్మతి వాదులతో ఫోన్ లో చర్చలు జరుపుతున్నారు. కొన్ని ప్రణాళికలు వేస్తున్నారు.. (ఈ ప్రణాళికలు ఏమయ్యాయి..? అసలు విషయం ఏమిటో సాయంత్రం ప్రత్యేక కథనంలో ప్రచురిస్తాం) ఇదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి, గండికోట శ్రీకాంత్ రెడ్డిలు నిన్న మధ్యాహ్నం బాలినేని నివాసానికి వెళ్లారు. (అప్పటికే సజ్జల మూడు సార్లు బాలినేనితో చర్చించారు)..! సీఎం మనసులో మాటని.. ఆయన ఇచ్చిన సీరియస్ ఆదేశాలను బాలినేనికి చెప్పారు. “మెత్తబడితే మంచిది.. ఏదో పదవి దక్కుతుంది.. లేకపోతే ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమే. మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ సీఎంకి తెలుసు. ఇక మీ ఇష్టం” అంటూ చెప్పాల్సింది చెప్పేసారు. సున్నితంగా హెచ్చరించారు. దీంతో బాలినేని పునరాలోచనలో పడ్డారు.. “ఈ సమయంలో రాజీనామాలు ఆమోదిస్తే రిస్క్ తప్పదు. పార్టీని ధిక్కరించి ఉప ఎన్నిక అంటే అంత సులువు కాదు” అనుకున్న బాలినేని తన ప్రయత్నాలను ఆపేసి సాయంత్రానికి సీఎం దగ్గరకు చేరుకున్నారు. లోపలి వెళ్లి, కలిసి, మాట్లాడి, బయటకు వచ్చి “మేమంతా ఒక కుటుంబమే.. నేనేమి అలగలేదు.. నాకేం అసంతృప్తి లేదు.. మంత్రి సురేష్ కీ నాకు విబేధాలు లేవు.. వైఎస్ కుటుంబానికి సన్నిహితుణ్ణి” అంటూ వాక్యాలు వల్లించి బయటపడ్డారు. బాలినేని గనక నిన్న సాయంత్రానికి మెత్తబడకపోతే ఈ పాటికే మాజీ ఎమ్మెల్యే అయ్యేవారని పార్టీ పెద్దల సమాచారం..! ఇక మేకతోటి సుచరితకు చివరి అవకాశం ఇచ్చారు. ఆమె కూడా ఈరోజు సాయంత్రానికి దారిలోకి రాకుంటే రాజీనామా ఆమోదం ఖాయమని తెలుస్తుంది..!