ఏపీలో ప్రకంపనలు రేపుతూ.. సంచలనాలకు వేదికవుతున్న అంశం ‘పంచాయతీ ఎన్నికలు’. దాదాపు ఏడాదిగా ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కు మధ్య జరుగుతున్న ఈ యుధ్దం ప్రస్తుతం చివరి అంకానికి చేరుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల బంతి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. ప్రభుత్వం మాత్రం కరోనా కేసులు, విస్తృతంగా జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ కు కారణాలుగా చూపిస్తోంది. దీనిని ఎస్ఈసీ వ్యతిరేకిస్తూ.. దేశంలో చాలాచోట్ల ఎన్నికలు జరుగుతుంటే లేని కరోనా.. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఎస్ఈసీ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేశారు. అయితే.. ప్రభుత్వం కరోనా భయం గురించి చెప్తున్నా లెక్కచేయని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇప్పుడు ఒక విషయంలో అడ్డంగా బుక్కయ్యారు.. ప్రభుత్వం నుంచి వైసీపీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఎస్ఈసీ పొరపాటు చేసినట్టేనా..?
ఈరోజు ఎస్ఈసీ మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. అంతా బాగానే ఉన్నా.. ఆయన నిర్వహించిన మీడియా సమావేశమే ఇప్పుడు విమర్శలకు కారణమవుతోంది. మామూలుగా అయితే.. ఒక టేబుల్ వద్ద లేదా కుర్చీలో కూర్చుని ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయొచ్చు. కానీ.. నిమ్మగడ్డ ఏకంగా ఒక చిన్న అద్దాల చాంబర్ లో కూర్చుని షెడ్యూల్ విడుదల చేశారు. మీడియా లోగోస్ కూడా ప్రత్యేకంగా పెట్టారు. మొత్తంగా బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ మధ్య కూర్చున్నట్టు అద్దాల చాంబర్ లో కూర్చుని షెడ్యూల్ విడుదల చేశారు. ఇలా ఆయన ఎందుకు చేశారో ప్రత్యేకించి చెప్పేదేముంది. కరోనా భయంతోనే.. అనే చెప్పాలి. అద్దాల చాంబర్ లో కూర్చున్న నిమ్మగడ్డ ప్రెస్ మీట ఫొటో ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే వైసీపీకి, ప్రభుత్వానికి ఆయుధంగా మారింది.
ప్రజలకు ఇంకెంత జాగ్రత్తల అవసరం..
ఒక్క ప్రెస్ మీట్ కే.. అదీ పరిమితంగా వచ్చే జర్నలిస్టుల మధ్యే ఎస్ఈసీకి కరోనా భయం ఉంటే రాష్ట్ర ప్రజల రక్షణ పరిస్థితి ఏంటనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం. నిమ్మగడ్డ అంత జాగ్రత్త తీసుకుంటే సామాన్య ప్రజలకు ఇంకెంత రక్షణ అవసరం అనే ప్రశ్నలు.. విమర్శలు వస్తున్నాయి. ఒక వ్యక్తికే అద్దాల చాంబర్ అవసరమైతే.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు ఎన్ని గాజు చాంబర్లు కావాలి.. దూరాల నుంచి ఓటింగ్ కు వచ్చే ఓటర్లకు రక్షణ ఎంత అవసరమనేదే నిమ్మగడ్డకు ఎదురవుతున్న ప్రశ్నలు. మీకు మాత్రమే ప్రాణం.. ప్రజలు, అధికారులు, సిబ్బందివి కావా.. అంటూ కౌంటర్లు, విమర్శలు బాణాల్లా దూసుకొస్తున్నాయి.
ప్రభుత్వానికి అందిన ఆయేధమేనా..?
ఇదే ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాకు, పార్టీ నాయకులకు లభించిన ఆయుధంగా మారింది. డైరెక్టుగా నిమ్మగడ్డను ఇదే ప్రశ్నలు వేస్తూ విమర్శిస్తున్నారు. ఓపక్క పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇదే కరోనా భయాన్ని చూపిస్తూ ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతున్నా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ముందుకే వెళ్లారు. నిమ్మగడ్డ చేసిన ఈ తప్పు ఇప్పుడు ప్రభుత్వానికి, వైసీపీ లభించిన పెద్ద ఆయుధం అని చెప్పాలి. ఇదే ఫొటోను ఆధారంగా చూపించి సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానున్న ప్రభుత్వం అప్పీలులో సుప్రీంకోర్టుకు విన్నవించే అవకాశం ఉంది. మరి వీటన్నింటిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ సమాధానం ఏంటో చూడాలి.