ఎమ్మెల్సీ పండుల రవీంద్ర బాబు న్యాయస్థానాల ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారంటూ లక్ష్మీనారాయణ అనే న్యాయవాది హైకోర్టుకు, రాష్ట్రపతి, అదేవిధంగా గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన పండుల రవీంద్ర బాబు ఏపీ సీఎం జగన్ వెంట్రుక కూడా పీకలేరు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానాలను ఉద్దేశించి రవీంద్ర బాబు చేసిన ఈ వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి.
దీంతో వెంటనే రవీంద్ర బాబునూ ఎమ్మెల్సీగా అనర్హుడిగా ప్రకటించాలని న్యాయవాది లక్ష్మీనారాయణ ఫిర్యాదులో కోరారు. ఏపీలో న్యాయవ్యవస్థపై పెద్ద కుట్ర జరుగుతుందని లక్ష్మీనారాయణ ఫిర్యాదులో పేర్కొన్నారు. కావాలనే కుట్రపూరితంగా న్యాయస్థానాల పై ఇటీవల విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఈ వ్యవహారం మొత్తంలో ఉన్నది ఎవరో తేల్చాలని స్పష్టం చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా ఎన్నికైన వ్యక్తి న్యాయవ్యవస్థపై ఇలా మాట్లాడటం సరికాదని తెలిపారు. ఇదిలా ఉండగా నేరుగా ఫిర్యాదు చేయడానికి గవర్నర్ అనుమతి కోరారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లక్ష్మీనారాయణ లెటర్ రాయడం జరిగింది.