ఎంపీ కావాలనుకున్నారు… అయ్యారు…!
వైసీపీని కెలకాలనుకుంటున్నారు… కెలుకుతున్నారు…!
బీజేపీతో స్నేహం చేయాలనుకుంటున్నారు…! మరి చేస్తున్నట్టా లేదా..? రాజుగారి రాజకీయం ఎక్కడ చెడింది..? తాజా వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటి..??
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ఉద్దేశం ఏమిటి..? ఇన్నాళ్లు బీజేపీ అండతో వైసిపిని ఢీకొన్నారు అనుకునే వాళ్లకి తాజాగా ఆయన ట్విస్టు ఇచ్చారు. నిన్న బీజేపీని కూడా టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. అటు వైసీపీ, ఇటు బీజేపీతో కయ్యం పెట్టుకుని ఆయన ఏం సాధించాలనుకుంటున్నారు..? రాజుగారి రాజకీయంలో తాజా ట్విస్టులతో ఎక్కడ చెడింది..?? అనే అనుమానాలు కలగక మానదు.
నిజానికి రాజుగారి లక్ష్యం ఒక్కసారి అయినా ఎంపీగా అవ్వాలని. అందుకే ఆయన 2012 నుండి రాజకీయాల్లో చురుకయ్యారు. మొదట వైసీపీలోనే రాజకీయం ఆరంభించారు. 2014 ఎన్నికల్లో సీటు విషయంలో స్పష్టత లేకపోవడంతో బీజేపీలో చేరారు. టీడీపీతో సయోధ్యగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరి, ఆశపడి భంగపడ్డారు. దీంతో 2019 లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కాసుకొని ఉన్నారు. ఎన్నికలకు ముందు వైసీపీ నుండి స్పష్టమైన హామీతో ఆ పార్టీలో చేరి ఎంపీ అయ్యారు. కానీ అయిష్టంగానే నడిచారు. ఇక గెలిచినా తర్వాత తన మాట నెగ్గకపోవడం, ఎమ్మెల్యేల నుండి ధిక్కారం ఎదురవ్వడం జీర్ణించుకోలేక ఎదురు తిరిగారు. పార్టీని టార్గెట్ చేస్తూ.., తాను కూడా పార్టీకి టార్గెట్ అయ్యారు. రాష్ట్రంలో బలంగా, దూకుడుగా ఉన్న వైసీపీతో కయ్యం వెనుక బీజేపీ హస్తం ఉండే ఉంటుందని అందరూ భావించారు.
బీజేపీ అండ ఉందా లేదా…?
ప్రస్తుతం వైసీపీతో రాజు గారి కాపురం చెడింది. విడాకుల వరకు వెళ్ళింది. అయితే ఆయన వెనుక బీజేపీ ఉందా? లేదా? అనే స్పష్టత మాత్రం లేదు. ఒక సందర్భంలో ఆయనకు బీజేపీ పెద్దల అండ ఉందని అందరూ భావించారు. దానికి బలం చేకూరుస్తూ ఆయనకు కేంద్రం నుండి రక్షణ రావడం.., బీజేపీ పెద్దల అపాయింట్మెంట్లు సులువుగా దొరకడం.., ఈయన రాసిన లేఖలకు కేంద్రం నుండి సానుకూల స్పందన వస్తుండడంతో ఇక రాజుగారు బీజేపీ రాజుగారిగా మారిపోయారు అంటూ అనుకున్నారు. అందుకే ఆయనపై వేటు పడదని భావించారు. కానీ తాజాగా ఆయన బీజేపీ కీలక ఎంత జీవీఎల్ పై ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఫోన్ టాపింగ్ అంశంపై జీవీఎల్ వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రూల్ ఉంటుందా..? అంటూ నిలదీశారు. జీవీఎల్ అంటే బీజేపీకి కీలక నేత. ఏపీలో ప్రస్తుతం చక్రం తిప్పుతున్న త్రిమూర్తుల్లో ఆయన ఒకరు. అటువంటిది ఆ నేతని రాజుగారు విమర్శించడం చర్చకు దారితీసింది. ఈ చర్చ ద్వారా కూడా ఒకటి కచ్చితంగా ఒకటి అర్ధమవుతుంది. విశ్లేషకులకు ఒక అంశంపై స్పష్టత వస్తుంది. అదేమిటంటే..!
వైసీపీపై యుద్ధం తీవ్రతరం…! అదే లక్ష్యం..!!
రాజుగారి ప్రస్తుత లక్ష్యం ఒక్కటే అదే వైసిపిని టార్గెట్ చేయడం, ఆ పార్టీని దించేయడం. జగన్ ని ప్రజల ముందు చులకన చేయడం, ఆ పార్టీని బలహీన పరచడం..! అదే లక్ష్యంగా ఆయన విమర్శలు, వ్యాఖ్యలు, జగన్ వ్యతిరేక మీడియాతో మాటలు ఉంటాయి. అందుకే బీజేపీ సహకరిస్తే ఒకే, సంతోషం.., లేకపోతే ఒంటరి పోరాటానికి సై అన్నట్టే. ఒంటరిగా .., బీజేపీ తోడు లేకుండా రాజుగారు పోరాటం చేయగలరా అనే సందేహం రావచ్చు..!! ఆయనకి బీజేపీ నుండి సహకారం లేకపోయినా అపకారం మాత్రం ఉండదు. అవసరమైతే చీకటి ఉపకారం మాత్రం ఉంటుంది. ఆయన ఢిల్లీ స్థాయిలో వారికి అంత ముఖ్యం. అది ఆయనతో కొందరు బీజేపీ పెద్దలతో ఉన్న లింకుల కారణం. అందుకే వైసీపీ లక్ష్యంగా ఆయన పోరాటంలో ఎవరు అడ్డు వచ్చినా ఆయన లాగేస్తారని, తాజాగా జీవీల్ పై ఆయన వ్యాఖ్యలతో అర్ధం చేసుకోవచ్చు. ఇలా రాజుగారి రాజకీయం వైసిపికి దూరంగా.., బీజేపీకి అటూ, ఇటుగా చెడినట్టే కనిపిస్తుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?