సీఎం జగన్ అంటే అభిమానం అన్నారు.. కానీ ఆయన పద్దతులను విమర్శించారు. వైసిపి అంటే అభిమానం అన్నారు.. కానీ పార్టీ పరిపాలనను తప్పుబట్టారు. సహచర నాయకులంటే గౌరవం అన్నారు..కానీ బాహాటంగా వ్యాఖ్యలు చేస్తూనే వచ్చారు. బహిరంగంగా అసంతృప్తి చాటారు. ఇన్ని జరిగినా ఒక అధికార పార్టీతో కయ్యం పెట్టుకున్నా.. ఎమ్మెల్యేలతో గిల్లికజ్జాలు పెట్టుకున్నా.. సాక్షాత్తు పార్టీతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమైనా..దానిలో హీరోగా మాత్రం ఎంపినే మిగిలిపోతారా?. వైసిపి సీరియస్ చర్యలు తీసుకోవడం ఇంకా అయ్యే పని కదా?. అంటే అదే రకమైన సమాధానాలు వస్తున్నాయి. ఎందుకు.. ఏమిటో.. చూద్దాం పడండి.
రఘురామ కృష్ణంరాజు దేనికి బాటలు వేసినట్లు..?
నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు వ్యవహారం అందరికీ తెలిసిందే. వైసీపీతో కయ్యం పెట్టుకుని ప్రస్తుతం ఆ పార్టీకి మింగుడుపడని నాయకుడిగా తయారయ్యారు. పార్టీ అధిష్టానం కూడా ఈయన పట్ల సీరియస్ గా స్పందించి లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసి అనర్హత వేటు వేయాలని కోరింది. మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలు కూడా పశ్చిమ గోదావరి జిల్లాలలోని ను పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించారు. ఇలా రాజకీయంగానూ, వ్యక్తిగతంగానూ ఆ ఎంపిని ఎదుర్కోవడానికి వైసిపి త్రిముఖ వ్యూహం అమలు చేసింది. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల నుంచి, ఢిల్లీ స్థాయిలో స్పీకర్ పార్టీ నుంచి, రాష్ట్ర స్థాయిలో వైసీపీ కీలక నేతల నుండి ఆ ఎంపిపై విమర్శల దాడి మొదలైంది. ఒంటరిని చేసే ప్రక్రియ ఆరంభమైంది. ఇంత సీరియస్ గా ఉన్నా, వైసీపీ నుంచి గట్టి చర్యలే ఎదురవుతున్నా ఆ ఎంపి మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. ప్రధాన మంత్రి మోడీకో లేఖ, సీఎం జగన్ కు ఓ లేఖ రాసుకుంటూ, మోడీ గారికి బిస్కెట్లు వేస్తున్నారు.. జగన్ గారికి బాధ్యతను గుర్తు చేస్తున్నారు. ఆయన బాట ఏమిటి అన్నది ఇప్పటికీ అంతుపట్టడం లేదు.
టోటల్ ఎపిసోడ్ లో విన్నర్ గా మిగిలే అవకాశం ఈయనదేనా?
వైసీపీ ఇన్ని పిర్యాదులు చేసినా ఎంపి రఘురామ కృష్ణంరాజు ఏమాత్రం తొణకడం లేదు, వణకడం లేదు. ఆయన ఆరోపణలు, ఫిర్యాదులు, విమర్శలు, వ్యాఖ్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. పార్టీకి వ్యతిరేక మీడియాతో తరచూ మాట్లాడుతూ.. ఇంటర్వ్యూలు ఇస్తూ జగన్మోహన రెడ్డి, ఆయన చుట్టూ ఉన్న నాయకులు, వైసీపీ ఎమ్మెల్యేలపై అర్థరహిత ఆరోపణలు, వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అంటే ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఒక ఎంపి కయ్యం పెట్టుకొని ఇలా నెగ్గుకు రావడం అంటే సాధారణ విషయమేమీ కాదు. మొదటి నుంచి అనుకుంటున్నట్టు రఘురామకృష్ణరాజు వెనుక బిజెపి కేంద్ర పెద్దలు ఉన్నా లేకపోయినా ఈ వ్యవహారంలో మాత్రం రఘురామ కృష్ణంరాజే హీరోగా మిగులుతారని పశ్చిమ గోదావరిలో టాక్ వినిపిస్తుంది. అందుకు స్పీకర్ కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేకపోవడం, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా తదుపరి విచారణ ఏమీ లేకపోవడం, రఘురామ కృష్ణంరాజు తన శైలి మార్చుకోకుండా ఏమాత్రం తొణుకు బెణుకు లేకుండా అదే తరహా విమర్శల దాడి కొనసాగిస్తుండటం ఇవన్నీ చూస్తుంటే జిల్లాలో రాజు గారి రాజకీయమే నెగ్గినట్లు కనిపిస్తోంది.