రాష్ట్రంలో జరుగుతున్న పలు పరిణామాలపై అధికార పార్టీకి చెందిన పలువురు సీనియర్ శాసన సభ్యులే ఇటీవల కాలంలో బాహాటంగా విమర్శలు సంధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా అధికార పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడే ప్రభుత్వంపై విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం అయింది.
తొలి నుండి నర్సాపురం ఎంపి రఘు రామ కృష్ణంరాజు చర్యలు సంచలనాత్మకంగానే ఉన్నాయి. ఇటీవల ఆయన రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాల గురించి మీడియా ముందు మాట్లాడారు. సీఎం జగన్ వద్ద కోటరీ ఉందని, క్షేత్ర స్థాయిలో విషయాలు అయన వరకు వెళ్లడం లేదని, పలు విషయాలు తమ నేత, సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకుని వెళ్లాలని ప్రయత్నించినా తనకు అపాయింట్మెంట్ లభించలేదని కూడా మీడియా ముఖ్యంగా వెల్లడించారు. వైఎస్ఆర్ సీపి ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్ పై రఘురామ కృష్ణంరాజు విమర్శలు చేయడంపై నర్సాపురం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రఘు రామ కృష్ణంరాజుపై వ్యక్తిగత విమర్శలు చేశారు. సీఎం జగన్ మూలంగానే అయన ఎంపి అయ్యారని, పార్లమెంటరీ కమిటీ చైర్మన్ పదవి కూడా దక్కిందని ప్రసాదరాజు అన్నారు. సీఎం జగన్ చుట్టూ కోటరీ అంటూ ఏది లేదని, జగన్ కు అందరూ సమానమేనని పేర్కొన్నారు. ప్రసాదరాజు వ్యక్తిగతంగా విమర్శలు చేయడంపై రఘు రామ కృష్ణంరాజు తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. వచ్చే మంత్రి వర్గ విస్తరణలో మంత్రి పదవి ఖరారు చేసుకోవడానికి ప్రసాదరాజు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, అయనతో ఎవరు మాట్లాడిస్తున్నారో తనకు తెలుసనీ, తన మిత్రుడు ప్రసాదరాజుకు మంత్రి పదవి దక్కాలని కోరుకుంటున్నానని రఘు రామ కృష్ణంరాజు అన్నారు. తన విజయానికి, పార్లమెంటరీ పదవి దక్కడానికి తన వ్యక్తిగత ఇమేజ్ కారణమని పేర్కొన్నారు రఘు రామ కృష్ణంరాజు. ఈ సందర్భంలో పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించే విధంగానే అయన సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశమైంది.
రఘురామ కృష్ణంరాజుకి బీజేపీతో పాత స్నేహం ఉండటంతో అయన బీజేపీలోకి వెళతారని కూడా చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ సెంట్రల్ హల్ వద్ద ప్రధాని మోడీ..రాజు గారు బాగున్నారా అంటూ విష్ చేసినప్పటి నుండి అయన బీజేపీకి దగ్గర అవుతున్నారని ప్రచారం జోరుగా సాగింది. మరో పక్క వైకాపా సోషల్ మీడియాలో రఘురామ కృష్ణంరాజుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కామెంట్ లు చేస్తున్నారు.
ఇప్పుడు తాజాగా ఒకే పార్టీకి చెందిన ఎంపి, ఎమ్మెల్యే పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం ఎక్కడకు దారితీస్తుందో?, పార్టీ అధిష్టానంపైనే విమర్శలు చేసిన నేపథ్యంలో రఘురామ కృష్ణంరాజుపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా? లేక ఈ వివాదాన్ని సీఎం జగన్ ఏవిధంగా పరిష్కరిస్తారో వేచి చూడాలి.