YSRCP: ఏపీలో అయిదు రోజుల నుండి రాజకీయాలు బాలేవు.. టీడీపీ (Telugu Desam party) వాడుతున్న బాష.. వైసీపీ (YS jagan) చేసిన దాడి.. దీక్షలు, కక్షలు ఏవీ సమర్ధనీయం కాదు. 2019 కి ముందు ఒక అనామక నాయకుడిగా ఉన్న పట్టాభి అనే వ్యక్తి.. ఆకస్మికంగా వచ్చి నోరేసుకుని పడిపోయి.. అర్ధం లేని ఆరోపణలు చేస్తుంటే అధికారంలో ఉన్న వైసీపీ ఊరుకోదు అని స్పష్టం చేసింది. అక్కడ వరకు ఒకే.., కానీ ఆ తర్వాత వైసీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేసుకుంటూ ఫోరికిపోతుంది..! టీడీపీ తరహా పార్టీని ప్రజలు ఆమోదించరు. చంద్రబాబు వంటి పాలన, అవినీతితో ప్రజలు విసిగిపోయి దారుణ ఓటమిని చూపించారు. పార్టీని మూలాన కూర్చోబెట్టారు. ప్రస్తుతం ఏపీలో జగన్ అత్యంత ప్రజాబలమున్న నాయకుడు.. ఒకరకంగా దేశంలోనే జగన్ కి మాంచి ఫాలోయింగ్ ఉంది. రాజకీయంగా ప్రాంతీయ పార్టీల్లో వైసీపీ ఇమేజ్ రెట్టింపవుతుంది.. అందుకే జాతీయస్థాయిలో జగన్ తలదూర్చాల్సిన సమయం వచ్చింది అంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఏపీలో పాలన, సంక్షేమం పరంగా జగన్ తండ్రిని మించి ఆకట్టుకుంటున్నారు.. అక్కడి వరకు బాగానే ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీలో తెరవెనుక ఎవరున్నారో కానీ.., కాపీ పాలిటిక్స్ ప్రజాబలమున్న తమ పార్టీని తక్కువయ్యేలా.., చీపయ్యేలా ఆలోచిస్తున్నారని విశ్లేషకులు చెప్పుకుంటున్నారు..
YSRCP: ప్రజాబలం ఉండగా.. తడబాటు ఎందుకు..!?
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ.. తిరుగులేని బలముంది. సంక్షేమంతో పేదల గుండెల్లో నిలుస్తుంది. అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేల బలముంది.. 22 మంది ఎంపీలు గెలిచారు. రాజ్యసభ సభ్యులు అధికంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో 156 లక్షల ఓట్లు వచ్చాయి. పార్టీ బ్యాక్ బోన్ గా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. కానీ ఎందుకో గానీ ఆ పార్టీకి సొంత ప్లానింగ్ కనిపించడం లేదు.. డిఫెన్స్ కోసం కాపీ గేమ్స్ ఆడుతూ దొరికిపోతుంది. మరీ సిల్లీగా అయిపోతుంది. వైసీపీ పాలిటిక్స్ చూస్తుంటే సిల్లీ అనిపిస్తున్నాయంటూ కొందరు సొంత పార్టీ నేతలే కామెంట్ చేస్తుండడం ఆ పార్టీ పెద్దలు రియలైజ్ అవ్వాల్సిన అంశం..! పట్టాభి వ్యవహారం.. ఆయన వాడిన పదం ‘బోష్డీకే’ అన్నారని, ఆ తరువాత ‘పబ్జీదొర’ అన్నారని ఆ సాయంత్రం టీడీపీ ఆఫీసు మీద, ఆ తరువాతి రోజు దీక్షలు ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ చేసిన తప్పును కవర్ చేసుకోవడానికి ఇంకా అనేక తప్పులు చేస్తోంది. ఆ తప్పులన్నీ కూడా తెలుగుదేశం పార్టీవి కాపీ కొడుతోంది. ‘బోష్డీకే’ అన్నారనీ, ‘బోష్డీకే’ అంటే అదో పెద్ద బూతు పదం అంటూ మీడియాలో హైలెట్ చేసుకున్నారు. ప్రచారం చేశారు. సీఎం జగన్ నోటి వెంట కూడా ఆ మాట వచ్చింది.
బాధితులు – బాధ్యులు..!
టీడీపీ ఆఫీసులో వాళ్లు దీక్ష చేస్తే.., వైసీపీ జనాగ్రహ దీక్షలు చేసింది.. టీడీపీ బంద్ చేస్తే వైసీపీ నిరసన ర్యాలీలు చేపట్టారు.. ఆ తరువాత టీడీపీ బృందం ఢిల్లీకి వెళ్లితే.. వైసీపీ నేతలు కూడా ఢిల్లీకి వెళతారు. టీడీపీకేమో రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఖరారు అయ్యింది. వైసీపీ బాధలను చెప్పుకోవడానికి వెళతారు. ఇక వైసీపీకి ఢిల్లీ వెళ్లాల్సిన పని ఏముందనేది పెద్ద ప్రశ్న..! ఈ మొత్తం వ్యవహారంలో బాధిత పార్టీ టీడీపీ. తప్పు చేసింది. నోటికి పని చెప్పింది. సీఎం స్థాయిని హీనం చేసేలా మాట్లాడింది టీడీపీ. అందుకు మూల్యం చెల్లించుకుంది. జగన్ అభిమానులకు కోపం వచ్చి కార్యాలయం పగలకొట్టారు.. అక్కడితో వైసీపీ పాత్ర అయినట్టే.. టీడీపీ ఏం చేస్తుంది..? దానిపై జనంలో ఏం చర్చ జరుగుతుంది..? అనేది గమనించుకుని తర్వాత ప్రణాళికలు వేసుకుంటే బాగుండేది. కానీ టీడీపీకి పోటాపోటీగా అదే రోజు, ఏవ్ తరహా కార్యక్రమాలు చేయడం వలన ఎవరికీ ఉపయోగం..!? బాధితులు ఢిల్లీ వెళతారా ? బాధ్యులు వెళతారా? బాధితులు దీక్షలు చేస్తారా? బాధ్యులు దీక్షలు చేస్తారా?. బాధితులు బంద్ చేస్తారా?. బాధ్యులు బంద్ చేస్తారా? అనే ప్రశ్నలు వెంటాడుతున్నాయి..! మొత్తం వ్యవహారం దగ్గరి నుండి చూస్తుంటే వైసీపీలో ఒక వ్యూహం లేదనిపిస్తుంది. పార్టీ పెద్దలు పిలుపునివ్వడం.. కిందిస్థాయి నాయకులు ఫాలో అవ్వడం తప్పితే.. టీడీపీకి కౌంటర్ గా ఏదో ఒకటి చేయాలని తప్పిస్తే.. వైసీపీలో ఒక నిర్దిష్ట ప్రణాళిక, ఒక రాజకీయ వ్యూహం.. ఈ దాడిని తమకు అనుకూలంగా మలచుకోవడం వంటివి చేస్తే వేరే స్థాయిలో ఉండేదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.