YSRCP: ఎమ్మెల్సీలు.., టీటీడీ బోర్డు సభ్యులు.., నామినేటెడ్ చైర్మన్ పదవులు.., ఇతరత్రా మొత్తం మీద 50 పదవులు కళ్లెదురుగా ఊరిస్తున్నాయి.. అందినట్టే ఉన్నాయి.., కానీ కాకుండా పోతాయేమో అనే భయం వెంటాడుతుంది. ఇదీ వైసిపిలో పరిస్థితి. మాజీలు, పోటీ చేసి ఓడిన వారు, ద్వితీయ శ్రేణి నేతలు, పార్టీ మొదటి నుండి కష్టపడిన వారికీ కలిపి ఈ పదవులను భర్తీ చేయాలని సీఎం జగన్ యోచిస్తున్నారు. ఇప్పటికీ చాలా మందికి ప్రాధమిక సమాచారం అందించారు. నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్ (ఆర్టీసీ, మైనింగ్, సివిల్, పోలీసు హోసింగ్, ఫుడ్) వంటి పదవులు.., అర్బన్ అథారిటీల పదవులు.., కార్పొరేషన్ చైర్మన్ పదవులు.., టీటీడీ బోర్డు పాలక మండలి సభ్యులు.., ఎమ్మెల్సీల పదవులతో వైసిపిలో పండగ నెలకొంది. ఆయా పదవుల వేటలో ఎవరికీ వారు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.. సీఎం జగన్ ఇప్పటికే కొన్ని పేర్లు ఖరారు చేశారు. అయితే వీటిలో 50 శాతం మహిళలకే కేటాయించడానికి సీఎం జగన్ మొగ్గు చూపుతున్నారట. అందుకే కొందరు నేతలు ప్రోటోకాల్ తమకు ఉంటె బాగుంటుందని.., తమ పేరు చేర్చాలని కోరుతున్నట్టు కీలక సమాచారం.
YSRCP: భర్తీ చేయనున్నవి ఇవే… !
రాష్ట్రస్థాయిలో గుర్తింపు ఉన్న కార్పొరేషన్ పదవులు మూడు ఉన్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ, మైనింగ్ (భూగర్భ గనుల), సివిల్ సప్లైస్, పోలీసు హోసింగ్ సహా మరో మూడు కార్పొరేషన్లు ఖాళీగా ఉన్నాయి. కనీసం రెండేళ్ల కాల వ్యవధితో ఈ పదవులను ఇవ్వనున్నట్టు తెలిసింది. ఈ మూడు పదవుల్లో ఒకటి దేవినేని అవినాష్ కి ఇవ్వనున్నట్టు సమాచారం. విజయవాడ తూర్పు ఇంఛార్జిగా బాధ్యతల్లో ఉన్న అవినాష్ ప్రస్తుతం ఒక కీలక పదవిని ఆశిస్తున్నారు. ఏడాదిన్నర కిందట పార్టీలో చేరినప్పుడు కూడా ఆయనకు సీఎం నుండి స్పష్టమైన హామీ ఇచ్చినట్టు తేలిసింది. ఈయనతో పాటూ రౌతు సూర్యప్రకాశరావు, బాచిన కృష్ణ చైతన్య, విశ్వేశ్వర్ రెడ్డి, తోట వాని తదితరులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు సమాచారం. టీడీపీన్ నుండి వచ్చిన వారికి కాకుండా వైసీపీ అధికారంలోకి రాకమునుపు నుండి పార్టీ కోసం పని చేసిన వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఎక్కువగా టీటీడీ బోర్డు సభ్యులు, ఎమ్మెల్సీలు వంటి కీలక పదవులు కూడా ఉన్నాయి.
* 15 మందికి టీటీడీ బోర్డు సభ్యులుగా కేటాయించనున్నారు. పక్క రాష్ట్రాలకు మూడు పోయినా… వైసిపిలో కీలకంగా ఉండే 12 మందికి ఈ పదవులు దక్కనున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు సహా.., కొందరు మాజీలకు కూడా ఈ పదవి వరించనున్నట్టు సమాచారం.
* స్థానిక సంస్థల కోటాలో ఇప్పటికే 13 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. కోర్టు నుండి తీర్పు వచ్చిన వెంటనే.. స్థానిక సంస్థలో ప్రజాప్రతినిధులు కొలువుదీరిన వెంటనే ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తానికి ఈ నెలాఖరు వరకు వైసీపీలో ఈ పదవుల పండగ మాత్రం కొనసాగానున్నట్టు చెప్పుకోవచ్చు.