మేకపాటికి ఇస్తే అదే జిల్లాకి చెందిన మస్తానయ్యకి ఇవ్వలేం. మస్తానయ్య పార్టీలో చేరినప్పుడు హామీ ఇచ్చిన ప్రకారం రాజ్యసభ ఇవ్వాలి. మరి సీనియర్ మేకపాటికి ఇవ్వకపోతే కష్టం…! వైవికి ఇవ్వాలంటే బోస్ కి ఇవ్వలేం. బోస్ కి ఇస్తే మోపిదేవికి ఏమివ్వాలి? మరి అయోధ్యరామిరెడ్డి సంగతి ఏంటి..? ఇవన్నీ ముఖ్యమంత్రి జగన్ ఆలోచలు. ఉన్నవి నాలుగు సీట్లు, పోటీలో ఉన్నది పది మంది ఎవరికీ ఇవ్వాలి? ఎవరికీ నచ్చ చెప్పాలి? ఇవి వైసీపిలో “రాజ్యసభ” తలనొప్పులు. ఏపీ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు స్థానాలు ఏప్రిల్ నాటికి ఖాళి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది, దీనికి సంబంధించిన షెడ్యూల్ నిన్న విడుదలయ్యింది. రాష్ట్రంలో ఖాళీ కానున్న నాలుగు స్థానాలు వైసిపికే దక్కనున్నాయి. ఈ పార్టీలో అంతర్గతంగా ఆశావహులు ఎక్కువగా ఉన్నారు.
ఆశావహులు…అవకాశాలు పరిశీలిస్తే…!
మేకపాటి రాజమోహన్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, బీద మస్తానయ్య, సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఇలా ఆశిస్తున్నవారి పేర్లు ఎక్కువగానే ఉన్నాయి. కానీ సీఎం జగన్ మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నారు. నాలుగు స్థానాలు నాలుగు సామజిక వర్గాలకు ఇవ్వాలని అనుకుంటున్నట్టు సన్నిహితుల ద్వారా తెలిసింది. ఇదే జరిగితే వైవి సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డిలతో ఎవరో ఒకరికే అవకాశం దక్కనుంది. బిసిల్లో ఒకరికి, కాపు నుండి ఒకరికి, ఎస్సీ ల నుండి ఒకరికి అవకాశం కల్పించాలని అనుకుంటున్నట్టు సమాచారం.
* ఇటీవల పార్టీలో చేరిన బేడా మస్తానయ్యకి రాజ్యసభ హామీ ఇచ్చారు. ఆయన వైసిపి ముఖ్యనేత విజయసాయిరెడ్డికి సన్నిహితుడు కూడా. అందుకే బిసిల కోటాలో ఆయనకీ ఇస్తారని తెలుస్తుంది. నెల్లూరు జిల్లాకే చెందిన మేకపాటికి రెడ్డిల కోటాలో ఇవ్వాలన్నా అదే జిల్లాకి రెండు ఇచ్చామనే భావన లేకుండా ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికే ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకవేళ బిసిల కోటాలో మోపిదేవి లేదా సుభాష్ చంద్రబోస్ లకు ఇస్తే ఈ సారికి మేకపాటికి ఇచ్చి, మస్తానయ్యకు తర్వాత ఇచ్చే అవకాశమూ లేకపోలేదు.
* ఇక రెడ్డిల కోటాలో వైవి సుబ్బారెడ్డి, అయోధ్యరామిరెడ్డి, మేకపాటి పేర్లు పోటీలో ఉన్నాయి. వీరు ముగ్గురిదీ ఒకే పరిస్థితి పార్టీ అవసరాల రీత్యా 2019 ఎన్నికల్లో ఎంపీ స్థానాలకు పోటీ చేయకుండా తేరా వెనుక ఉండిపోయారు. అందుకే వీరికి అవకాశాలు కల్పిస్తామని నాడే జగన్ హామీ ఇచ్చారు. వీరిలో మేకపాటి అవకాశం మస్తానయ్యతో ముడిపడి ఉంది. వైవి ప్రస్తుతం టిటిడి చైర్మన్ గా ఉన్నారు. మరో మూడు నెలలు ఉంటారు. ఆయన గట్టిగా అడిగి, పట్టుపట్టే స్థితిలో లేరు. ఇక ముందు వినిపిస్తున్న పేరు అయోధ్యరామిరెడ్డి. ఈయనకు కచ్చితంగా ఇవ్వాలని పార్టీ వర్గాలు కూడా కోరుతున్నట్టు తెలుస్తుంది. మేకపాటికి కాకపోయినా ఆయన కుటుంబం లో ఇతరులకు పదవులు ఇచ్చారు. వైవికి టిటిడి ఇచ్చారు. అయోధ్యరామిరెడ్డి కి ఎటువంటి పదవి ఇవ్వనందున ఈయనకు ఇవ్వాలని పార్టీలో చర్చ జరుగుతుందట.
* ఇక బిసి సామజిక వర్గం నుండి మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ల పేర్లు ఉన్నాయి. వీరిద్దరూ ప్రస్తుతం ఎమ్మెల్సీల కోటాలో మంత్రులుగా ఉన్నారు. మండలి రద్దుపై వైసిపి ముందగుడు వేస్తున్న తరుణంలో ఈ ఇద్దరు తమ పదవులు కోల్పోవాల్సిందే. అందుకే ఈ ఇద్దరిలో ఒకరికి రాజ్యసభ, ఒకరికి పార్టీలో కీలక స్థానం ఇవ్వాలని జగన్ యోచిస్తున్నారట. అయితే బిసిల కోటాలో అక్కడ మస్తానయ్యకి ఇచ్చినా ఈ ఇద్దరిలో ఒకరికి కచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మంత్రి పదవులు వదులుకోవడం, సీనియర్లు కావడం కలిసివచ్చే అంశం.
* ఇక మిగిలిన రెండు స్థానాల్లో ఒకటి ఎస్సీ లకు ఇవ్వాల్సి ఉంది. ఎస్సీ మహిళకు ఇస్తే బాగుంటుందని జగన్ యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఇక కాపు కోటాలో చాల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆశావహుల జాబితాలో ఉన్నారు.