‘రాజు లేని సైన్యం చెల్లాచెదురై పోతుంది’.. అని బాహుబలి సినిమాలో డైలాగ్ ఉంది. ఇందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పరిస్థితే ఉదాహరణ. తన మాటే శాసనంగా, ఒంటిచేత్తో వ్యవస్థను నడిపే నాయకుడిని బలహీనం చేసినా చాలు.. పరిస్థితులు అదుపు తప్పిపోతాయి. ప్రస్తుతం ఈ స్ట్రాటజీనే ఫాలో అవుతోంది అధికారంలో ఉన్న వైసీపీ. 2024 ఎన్నికల్లో గెలుపే కాదు.. తన బద్ద శత్రువైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని సొంత నియోజకవర్గం కుప్పంలో ఓడించడంపై కూడా దృష్టి పెట్టింది. ఇందుకు అప్పుడే పావులు కదుపుతోంది కూడా. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇటివల చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.
మంత్రి పెద్దిరెడ్డి ధైర్యం అదే..
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు చిత్తూరు జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా ఓటమి తథ్యం. లేదు.. కుప్పంలోనే పోటీ చేసి గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కూడా అనేశారు. ఇంతటి బలమైన మాట అనాలంటే.. గుండె ధైర్యం, వెనుక అంగ, అర్ధ బలం కూడా తప్పనిసరి. ఇవన్నీ బలంగా ఉన్న నేత పెద్దిరెడ్డి. గత ఐదేళ్ల కాలంలో చిత్తూరు జిల్లాలో వైసీపీపి ఒంటిచేత్తో నడిపించిన నాయకుడు. చంద్రబాబుపై ఇంతటి శపథం చేసేందుకు సీఎం జగన్ సహకారం కూడా ఉందని తెలుస్తోంది. కుప్పంలో చంద్రబాబునే ఓడిస్తే రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా పట్టు కోల్పోతుందని వైసీపీ ఆలోచన. కుప్పంలో చంద్రబాబు అనుకూల వ్యక్తులను 60 మందిని ఎంపిక చేసి.. వారిలో ఇప్పటికే 20 మందిని వైసీపీలో చేర్చుకుంది. ఎన్నికల నాటికి మిగిలిన వారిని పార్టీలో చేర్చుకుని చంద్రబాబు శక్తిని నిర్వీర్యం చేయాలనేది ప్లాన్.
చంద్రబాబును నిలువరించడం సాధ్యమేనా..?
నిజానికి చంద్రబాబుకు కుప్పంలో పెద్ద బలగమే ఉంది. అప్రతిహత విజయాలే ఆయన సొంతం. ప్రచారం కూడా చేయకుండా 70-80 వేల మెజారిటీ తెచ్చుకోగలరు. కానీ.. మొదటిసారి 2019లో చంద్రబాబును కుప్పం వణికించింది. మొదటి రెండు రౌండ్లలో వైసీపీ అభ్యర్ధి, మాజీ ఐఏఎస్ చంద్రమౌళికి ఆధిక్యం రావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. కానీ.. అంతిమంగా 34వేల ఓట్ల మెజారిటీతో చంద్రబాబు గెలిచారు. చంద్రబాబు స్థాయికి ఇది అవమానమే. ఈ పరిస్థితులను బేరీజు వేసుకునే.. 2024లో చంద్రబాబు ఓటమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది.. పెద్దిరెడ్డి ధైర్యానికి ఊపిరిపోస్తున్నాయి. మరి.. పెద్దిరెడ్డి వ్యాఖ్యలను చంద్రబాబు ఎలా తీసుకుంటారో, ధైర్యంగానే ఉంటారా.. వైసీపీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయనేది చూడాల్సిందే.