హైదరాబాద్, జనవరి 4: ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసును జాతీయ దర్యాప్త సంస్థ ఎన్ఐఏకు అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.
ఏపీ హై కోర్టు వైఎస్ జగన్పై జరిగిన హత్యాయత్నం కేసును శుక్రవారం విచారించింది.
ఈ కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అవహేళన చేశారనీ, ఏపీ డీజీపీకి కనీస పరిజ్ఞానం లేదన్నారు. ఈ కేసును సీఎం వత్తిడి మేరకే తప్పుదోవ పట్టించారన్నారు. కేసును నీరుకార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. జగన్పై హత్యాయత్నం మధ్యాహ్నం 12.30గంటలకు జరిగితే సాయంత్రం వరకు కేసు నమోదు చేయలేదన్నారు. డీజీపీ చేసిన తప్పులను కూడా ఎన్ఐఏ ముందు ఉంచుతామన్నారు. హత్యాయత్నం వెనుక ఉన్నవాళ్ళను ఎన్ఐఏ ముందు నిలబెడతామనీ, నిందితులకు శిక్షలు పడతాయని రామకృష్ణారెడ్డి తెలిపారు.