Chandra Babu cuppam tour: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ సీనియర్ నేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో రెండు రోజులుగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతోందనీ, జిల్లాలో గ్రానైట్ పరిశ్రమను వైసీపీ నేతలు హస్తగతం చేసుకుని దోచుకుంటున్నారనీ దుయ్యబట్టారు. చంద్రబాబు చేస్తున్న విమర్శలపై వైసీపీ నేతలు ఘాటుగా స్పందిస్తూ ప్రత్యారోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ సీనియర్ నేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు.
Chandra Babu cuppam tour: ప్రజలు మళ్లీ బుద్ది చెబుతారు
వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ అరాచకాలు చేసే సంప్రదాయం వై సీ పీకి గానీ, తమ అధికారులకు గానీ లేదని అన్నారు. అమరావతిలో ఏ విధంగా బూతులు తిట్టి దాడులు చేయించుకున్నారో అందరూ చూశారన్నారు. ఢిల్లీ వరకూ రంకెలు వేశారనీ, రాష్ట్రపతి పాలన కావాలని కోరారని ఎద్దేవా చేశారు. కుర్చీ లేకపోతే చంద్రబాబు ఉండలేక పోతున్నారని వై వీ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో వైెఎస్ జగన్ శాశ్వతంగా సీఎంగా ఉండిపోతారన్న భయంతో చంద్రబాబు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ప్రజలు ఒక సారి బుద్ది చెప్పినా ఇంకా ఆయన బుద్ది మారలేదన్నారు. మరలా బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.
కుప్పంలో ఇల్లు, ఆఫీసు కూడా లేదు
చంద్రబాబు ఓ వీది రౌడీలా వ్యవహరిస్తున్నారని నగరి వై సీ పీ ఎమ్మెల్యే ఆర్ రోజా విమర్శించారు. కుప్పంలో కనీసం ఇల్లు, ఆఫీసు కూడా ఏర్పాటు చేయని చంద్రబాబు నేడు ప్రజలను ఓట్లు అడుగుతుండటం హాస్యాస్పదం అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఏనాడైనా తన సొంత నియోజకవర్గంలో సంక్షేమం గురించి పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. పైగా కుప్పం రండి తేల్చుకుందాం అంటూ సిగ్గు లేకుండా సవాళ్లు విసురుతున్నారని రోజా విమర్శించారు. గత వారం పట్టాభితో బూతు డ్రామాలు ఆడించారనీ ఇప్పుడు కుప్పం వచ్చి బాంబు డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. బాబు డ్రామాలను నమ్మేందుకు ప్రజలు సిద్ధం గా లేరని పేర్కొన్నారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని రోజా దుయ్యబట్టారు.