సినిమా: వీర భోగ వసంత రాయలు
జానర్: క్రైమ్ థ్రిల్లర్
నటీనటులు: సుధీర్బాబు, నారా రోహిత్, శ్రీ విష్ణు, శ్రియ, శ్రీనివాస్ రెడ్డి, మనోజ్ నందం, శశాంక్, రవిప్రకాశ్ తదితరులు
కూర్పు: శశాంక్ మాలి
సినిమాటోగ్రఫీ: వెంకట్, నవీన్ యాదవ్
నిర్మాణ సంస్థ: బాబా క్రియేషన్స్
సంగీతం: మార్క్ కె రాబిన్
కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: ఆర్. ఇంద్రసేన
నిర్మాత: అప్పారావు
నారా రోహిత్, సుధీర్బాబు, శ్రీవిష్ణు ఈ తరం యువ కథానాయకుల్లో వీరి చిత్రాల ఎంపిక కాస్త భిన్నంగానే ఉంటుంది. ఫక్తు కమర్షియల్ సినిమాలకు దూరంగా వీరి కథలు సాగుతాయి. విభిన్నమైన కథల్ని ఎంచుకునే ఈ ముగ్గురు ఒకే సినిమాలో కలిసి నటిస్తే అభిమానుల అంచనాలు మరింత ఎక్కువగా ఉంటాయి. వీర భోగ వసంత రాయలు విషయంలో అదే జరిగింది. డిఫరెంట్ కాన్సెప్ట్తో ఈ ముగ్గురు హీరోలతో పాటు శ్రియ, శశాంక్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. పోస్టర్లతో మంచి హైప్ క్రియేట్ చేసిన వీర భోగ వసంత రాయలు తరువాత తరువాత ఆ స్థాయిలో సందడి చేయలేదు.
‘శమంతకమణి’ తర్వాత నారా రోహిత్, సుధీర్బాబు కలిసి నటించిన చిత్రం ‘వీర భోగ వసంత రాయలు’. టైటిల్తోనే సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. అందులోనూ అగ్ర కథానాయిక శ్రియ, శ్రీవిష్ణులాంటి నటీనటులు ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ట్రైలర్కి కూడా మంచి ఆదరణ లభించింది. మరి యువ దర్శకుడు ఇంద్రసేన తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉంది? ముగ్గురు యువ హీరోలు ఎలాంటి కథతో మెప్పించారు? ఓ లుక్కేద్దాం.
స్టోరీ:
వీర భోగ వసంత రాయలు సినిమా ప్రధానంగా మూడు నేరాలకు సంబంధించిన కథగా సాగుతుంది. క్రికెటర్లతో పాటు పలువురు ప్రముఖులలో శ్రీలంక నుంచి భారత్కు వస్తున్న ఓ విమానం హైజాక్ అవుతుంది. అదే సమయంలో హైదరాబాద్లో వరుసగా అనాథ పిల్లల కిడ్నాప్లు కలకలం సృష్టిస్తాయి. ఇక మూడో కేసులో ఓ పదిహేనేళ్ల కుర్రాడు తన ఇల్లు ఎక్కడో తప్పిపోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ప్రధానమైన విమాన హైజాక్ కేసును దీపక్ (నారా రోహిత్), నీలిమా (శ్రియ)లకు అప్పగిస్తారు. మిస్ అయిన ఇంటి కేసును వినయ్ (సుధీర్ బాబు) టేకప్ చేస్తాడు. ఫ్లైట్ హైజాక్ చేసిన వ్యక్తి 300 మంది బందీలను విడుదల చేసేందుకు అంతే సంఖ్యలో నేరస్థులను చంపేయాలని డిమాండ్ చేస్తాడు. అసలు.. విమానాన్ని హైజాక్ చేసిందెవరు? మిగిలిన రెండు కేసులతో ఈ కేసుకు ఉన్న సంబంధం ఏంటి? హైజాకర్ డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించిందా? అనేదే మిగతా కథ.
నటీనటులు:
ప్రమోషన్లో శ్రీవిష్ణు పాత్రను హైలెట్ చేసినా సినిమాలో ఎక్కువ సేపు తెర మీద కనిపించింది మాత్రం సుధీర్బాబు ఒక్కడే. అయితే సుధీర్బాబుకు మరొకరితో డబ్బింగ్ చెప్పించటం వర్కవుట్ కాలేదనే చెప్పాలి. సుధీర్ నటన పరంగా ఆకట్టుకున్నా వాయిస్ తనది కాకపోవటంతో ఆడియన్స్ కనెక్ట్ కావటం కష్టమే. నారా రోహిత్, శ్రియలకు తెర మీద కనిపించింది కొద్ది సేపే కావటంతో పెద్దగా ప్రూవ్ చేసుకునే అవకాశం రాలేదు. కీలకమైన పాత్రలో కనిపించిన శ్రీ విష్ణు తీవ్రంగా నిరాశపరిచాడు. ఇన్నాళ్ళూ పక్కింటి అబ్బాయి పాత్రలో కనిపించిన శ్రీవిష్ణు విలన్ లుక్లో ఆకట్టుకోలేకపోయాడు. డైలాగ్ డెలివరీ కూడా నిరాశపరుస్తుంది. ఇతర పాత్రలకు పెద్దగా ప్రాముఖ్యత లేకపోవటంతో ఉన్నంతలో తమ పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
విశ్లేషణ:
దర్శకుడు ఈ కథను చెప్పే విధానం చాలా ఆసక్తికరంగా ప్రారంభం అవుతుంది. సినిమాను ఇంట్రస్టింగ్ పాయింట్తో స్టార్ట్ చేసిన దర్శకుడు ఆ క్యూరియాసిటీని కొనసాగించటంలో తడబడ్డాడు. ఇల్లు మాయమైపోవడం అనే కాన్సెప్టే విచిత్రంగా అనిపిస్తుంది. అసలు ఇల్లు మాయమైపోవడం ఏంటి? ఎక్కడికి పోయింది? నిజంగా అలా జరుగుతుందా? అనే డైలమాలో ప్రేక్షకుడు పడతాడు. ఇది సోషియో ఫాంటసీ సినిమానా? అనే అనుమానాలూ వస్తాయి. మరోవైపు విమానం మిస్సయిన ఘటన, ‘వీర భోగ వసంత రాయలు’ చేసే డిమాండ్స్.. ఇవన్నీ చూస్తే ‘ఉన్నైపోల్ ఒరువన్’ (తెలుగులో ఈనాడు)సినిమా లక్షణాలు కనిపిస్తాయి. సమాజంలోని దుష్టులను శిక్షించడానికి కొంతమంది అమాయకులు బలైపోయినా ఫర్వాలేదు అనే కాన్సెప్ట్ ఈ కథలో కనిపిస్తుంది. కానీ, దాన్ని తీర్చిదిద్దిన విధానం గందరగోళంగా, ఆసక్తిలేని విధంగా కనిపిస్తుంది.