`మహర్షి`.. జర్నీ ఆఫ్ రిషి అంటూ సూపర్స్టార్ మహేష్ నటించిన చిత్రమిది. శ్రీమంతుడులో గ్రామాన్ని దత్తత తీసుకున్న యువకుడిగా, భరత్ అనే నేను చిత్రంలో ప్రజల కోసం పాటుపడే యువ ముఖ్యమంత్రిగా నటించి విజయాలను దక్కించుకున్నాడు మహేష్. ఈ స్టైల్లో రైతుల కోసం ఓ యువకుడు చేసిన ప్రయాణాన్ని `మహర్షి`సినిమా కథగా ఎంచుకున్నాడు. మహేష్ కెరీర్లో 25వ చిత్రం కావడంతో సినిమాపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. వంశీపైడిపల్లి దర్శకత్వంలో దిల్రాజు, అశ్వినీదత్, పివిపి వంటి అగ్ర నిర్మాతలు ఈ సినిమాను నిర్మించారు. కె.యు.మోహనన్, దేవిశ్రీ ప్రసాద్ వంటి స్టార్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు వర్క్ చేశారు. అసలు ఈ సినిమాలో రైతుల కోసం రిషి అనే యువకుడిగా మహేష్ ఎలాంటి ప్రయాణం చేశాడు? ఏం చెప్పాలనుకున్నాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమాకథేంటో చూద్దాం.
సినిమా: మహర్షి
నిర్మాణ సంస్థలు: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి సినిమా
నటీనటులు: మహేష్, పూజా హెగ్డే, అల్లరి నరేష్, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, మీనాక్షి దీక్షిత్, విద్యుల్లేఖారామన్, రావు రమేష్, కమల్కామరాజు, పోసాని కృష్ణమురళి, జయసుధ, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, రాజీవ్ కనకాల, సాయికుమార్ తదితరులు
ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్
కెమెరా: కె.యు.మోహనన్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
కథ, డైలాగ్స్: సాల్మన్, హరి, వంశీపైడిపల్లి
నిర్మాతలు: దిల్రాజు, అశ్వినీదత్, పివిపి
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి
కథ
కె.రిషికుమార్ (మహేష్) కి చిన్నప్పటి నుంచి ఓడిపోవడమంటే భయం. అతని తండ్రి (ప్రకాష్రాజ్) చిన్నతనం నుంచి ఓడిపోతూనే ఉండేవాడు. ఆయన్ని చూసి ఆయనలా మాత్రం ఉండకూడదని అనుకునేవాడు రిషి. తల్లి సపోర్ట్ తో విజేతగా ఎదిగేవాడు. బీటెక్ తర్వాత వైజాగ్లో ఎంటెక్ చదువుతాడు. అక్కడ అతనికి రవి (అల్లరి నరేష్) క్లాస్మేట్. రూమ్మేట్. ప్రొఫెసర్ (రావు రమేష్) ఇచ్చే క్లిష్టమైన సమస్యలను కూడా చకచకా పూర్తి చేసేవాడు రిషి. అతనిలోని ఆ గుణాన్ని చూసి ప్రేమలో పడుతుంది పూజా (పూజా హెగ్డే). అతనికి కూడా చెప్పకముందే, ఇంట్లో పెద్దలకు చెప్పేస్తుంది. పనిలో పనిగా ఆరిజన్ కంపెనీలో సీఈఓగా ఎంపికవుతాడు రిషి. అంతా సవ్యంగా సాగుతుందనుకుంటున్న సమయంలో పూజా ను పెళ్లి చేసుకోలేనని చెబుతాడు రిషి. ఆ విషయాన్ని రవితో చెప్పి బాధపడుతుంది పూజా. అదే విషయాన్ని రవి వెళ్లి రిషిని అడుగుతాడు. అప్పుడు వారి మధ్య మనస్పర్థలు ఏర్పడుతాయి. ఆ తర్వాత కొన్నేళ్లకు రవి తనకు చేసిన మంచి గురించి తెలుసుకుంటాడు రిషి. అతన్ని కలవడానికి వెళ్లిన రిషికి ఓ విషయం అర్థమవుతుంది. ఆ క్రమంలోనే రవికి రిషి సపోర్ట్ గా నిలబడుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది ఆసక్తికరం.
ప్లస్ పాయింట్లు
– మహేష్ బాబు నటన
– అన్ని పాత్రధారుల కాస్ట్యూమ్స్
– అల్లరి నరేష్, పూజా కేరక్టర్లు
– కొన్ని డైలాగులు
– లొకేషన్లు
– రీరికార్డింగ్
– క్లైమాక్స్
మైనస్ పాయింట్లు
– స్లోగా సాగిన సెకండాఫ్
– లెంగ్త్ ఎక్కువగా ఉండటం
– స్క్రీన్ప్లే, సీన్లు కొత్తగా లేకపోవడం
– బలమైన విలనీ లేకపోవడం
సమీక్ష
ఎప్పుడూ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి, లాస్ట్ ఫ్రేమ్ వరకూ దాదాపుగా ఒకే లుక్కుతో కనిపించే మహేష్, తాజాగా `మహర్షి`లో మూడు లుక్కుల్లో కనిపించారు. స్టూడెంట్, సీఈఓ, ఫార్మర్ లుక్కులు ఆకట్టుకున్నాయి. మహేష్ ఒన్ మ్యాన్ షోలాగా నడిపించినప్పటికీ, సినిమాలో ప్రతి చిన్న పాత్ర కూడా గుర్తుండిపోయేలా ఉంది. నటీనటులు తమ పరిధి మేరకు చాలా చక్కగా నటించారు. లొకేషన్లు, బ్యాక్గ్రౌండ్ స్కోర్, కొన్ని డైలాగులు బావున్నాయి. ఎటొచ్చీ స్క్రీన్ప్లే ఫ్లాట్గా సాగింది. కథలో ఏం జరుగుతుందో ముందే ఊహించుకునేలా ఉంది. పెకండాఫ్ మొదలుపెట్టినప్పటి నుంచి కొన్ని సీన్లు చిరాకు కలిగించాయి. మహేష్ను ఎలివేట్ చేయడం కోసం అల్లరి నరేష్ చేత అండర్ ప్లే చేయించారు. `శ్రీమంతుడు`లో శ్రుతిహాసన్ పాత్రకు, ఇందులో పూజా హెగ్డే పాత్రకు పెద్ద తేడా లేదు. సెకండాఫ్లో అక్కడ హీరో శ్రుతి ఇంట్లో ఉంటే, ఇందులో పూజా ఇతన్ని వెతుక్కుంటూ వస్తుంది. కాలేజీ సన్నివేశాల్లో పూజా గ్లామర్ ఒలకబోసింది. పాటల్లోనూ గ్లామర్ బాగా ఉంది. గత చిత్రాలతో పోలిస్తే ఇందులో మహేష్ కాస్త స్టెప్పులు వేశారు. ఇందులో ఒక సీన్లో రెట్రో లుక్ ఉంటుంది. మోసగాళ్లకు మోసగాడు స్టిల్ను అనుకరిస్తూ మహేష్ నిలుచున్న తీరు అభిమానులకు పండుగే. మామూలుగా సీన్లను ఇతర సినిమాల నుంచి కాపీ కొడతారు. కానీ ఈ సినిమాలో మహేష్ గత చిత్రాల నుంచి కాపీ కొట్టిన సన్నివేవాలు చాలా ఉన్నాయి. కానీ ఇందులో ప్రస్తావించాల్సిన విషయం `రైతు సమస్య`. రైతుకు, మామూలు ప్రజానికానికీ సంబంధం తెగిపోతోందని, వారాంతాల్లో పార్టీలు, పబ్బులకు వెళ్లడానికి బదులు మట్టిమీద మమకారాన్ని పెంచుకోవాలని, రైతు సమస్య నిజమైన సమస్య అని, రైతులకు మనం సానుభూతి చూపించక్కర్లేదు. వారి పట్ల గౌరవం ఉండాలని చెప్పిన తీరు బావుంది.
బాటమ లైన్: రైతుకు రెస్పెక్ట్ ఇచ్చిన `మహర్షి`
రేటింగ్: 3/5