నటీనటులు: ప్రియదర్శి, అనన్య, ఝాన్సీ, చక్రపాణి, తాగుబోతు రమేశ్ తదితరులు
పాటలు: గొరేటి ఎంకన్న, చంద్రబోస్, దాశరథి
డైలాగ్స్: పెద్దింటి అశోక్ కుమార్
ప్రొడక్షన్ డిజైన్: నితిన్ లుకాసొ
సినిమాటోగ్రఫీ: బాలు శాండిల్యస
మ్యూజిక్: మార్క్ కె.రాబిన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్ సిద్ధారెడ్డి
నిర్మాతలు: రాజ్.ఆర్, శ్రీఅధికారి
దర్శకత్వం: రాజ్.ఆర్
బయోపిక్ల హవా బాగా నడుస్తుంది. పలు రంగాల్లో తమ కంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తుల బయోపిక్స్ రూపొందుతున్నాయి. టాలీవుడ్లో రూపొందిన అలాంటి బయోపిక్ `మల్లేశం`. ఈ పేరు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసుండొచ్చు. ఎందుకంటే ఈయన క్రికెటర్ కాదు.. రాజకీయ నాయకుడూ కాదు. చేనేత కార్మికుల కష్టాలను తీర్చడానికి ఆసు యంత్రాన్ని కనిపెట్టిన వ్యక్తి. సరే! ఈయనేమైనా గొప్ప చదువులు చదువుకున్నాడా? అంటే అదీ లేదు. 6వ తరగతి వరకు మాత్రమే చదుకున్నారీయన. మరి ఆయన ఓ మిషన్ను ఎలా కనిపెట్టాడు? అందుకు దారి తీసిన పరిస్థితులేంటి? ప్రయాణంలో ఆయన ఎదుర్కొన సమస్యలేంటి? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా కథేంటో చూద్దాం
కథ:
మల్లేశం(ప్రియదర్శి) కుటుంబం, నల్గొండ జిల్లాలో ఓ చిన్నగ్రామంలో చేనేత జీవినాధారంగా ఉంటుంది. తండ్రి(చక్రపాణి) ఎంతో కష్టపడ్డా కూడా వచ్చే ఆదాయం కష్టాలను తీర్చదు. అప్పులే ఉంటాయి. తండ్రికి వేరే గత్యంతరం లేక మల్లేశాన్ని చేనేత పనే చేయమంటాడు. చదువు మానడం ఇష్టం లేకున్నా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మల్లేశం చేనేత పని నేర్చుకుంటాడు. మల్లేశం తల్లి లక్ష్మి(ఝాన్సీ) ఆసు పనిని చేతితో చేయడం వల్ల ఆమె భుజంలోని ఎముకలు విరిగిపోతాయి. చిన్నప్పట్నుంచి తల్లి పడే కష్టాన్ని చూస్తూ వచ్చిన మల్లేశం, తల్లి కష్టాన్ని తీర్చడానికి ఏదైనా చేయాలని ఆలోచిస్తున్న తరుణంలోఆసు యంత్రాన్ని కనుక్కోవాలనే ఆలోచన వస్తుంది. స్నేహితుల సహాయంతో అక్కడా, ఇక్కడా అప్పులు చేసి కొయ్యల సాయంతో ఆసు యంత్రాన్ని తయారు చేసినా అందులో కొన్ని సాంకేతిక సమస్యలు వస్తాయి. చివరికి ఇనుముతో మిషన్ను తయారు చేయాలనుకుంటాడు. ఎప్పుడూ ఆసు యంత్రాన్ని తయారు చేయాలనే ధ్యాసలో ఉండే మల్లేశాన్ని చూసి ఊరివాళ్లంతా పిచ్చోడని గేలి చేస్తుంటారు. మల్లేశం దారి మరల్చడానికి ఇంట్లో వాళ్లు పద్మ(అనన్య)తో పెళ్లి జరిపిస్తారు. భర్త ఉన్నతాశయాన్ని గుర్తించిన పద్మ కూడా భర్తకే సపోర్ట్ చేస్తుంది. కొన్ని పరిస్థితుల మూలంగా మల్లేశం ఊరు వదిలి పట్నం రావాల్సి వస్తుంది. ఆ పరిస్థితులేంటి? పట్నం వచ్చిన తర్వాత మల్లేశం ఆసుయంత్రాన్ని కనుక్కొన్నాడా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
బయోపిక్స్ తీయడమంటే మాటలు కాదు.. పెద్దగా ప్రాచుర్యం లేని వ్యక్తి బయోపిక్ అంటే ప్రేక్షకుడ్ని ఆకట్టుకోడానికి చాలా గట్టిగానే ప్రయత్నం చేయాలి.
నటీనటుల విషయానికి వస్తే ఇప్పటి వరకు కమెడియన్గానే మనకు తెలిసిన ప్రియదర్శి తొలిసారి హీరోగా.. అదేనండి.. టైటిల్ పాత్రధారి మల్లేశంగా కనిపించాడు. ఏదో నటించానని అన్నట్లు కాకుండా పాత్రలో పరకాయ ప్రవేశంచేశాడని చెప్పాలి. తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పే సందర్భంలో, ఎమోషనల్ సీన్స్లో ఇలా అన్నింటా ప్రియదర్శి తనదైన ముద్ర చూపించాడు. ఇకపై ప్రియదర్శిని కమెడియన్ అని అనరేమో! అనేంత గొప్పగా పాత్రలో లీనమై నటించాడు. ఇక మల్లేశం భార్య పద్మ పాత్రలో అనన్య చక్కటి ఎక్స్ప్రెషన్స్తో మెప్పించింది. ఇక మల్లేశం తల్లి లక్ష్మి పాత్రలో ఝాన్సీ కెరీర్లోనే బెస్ట్ పాత్ర చేసిందనాలి. తండ్రి పాత్ర పోషించిన చక్రపాణి కూడా పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. మంచి ఇంజన్ ఉంటేనే వాహనం చక్కగా ముందుకెళుతుంది. సినిమా విషయంలో నటీనటులు కూడా అంతే. సన్నివేశాలను వారు నటనతో మరో లెవల్కు తీసుకెళతారు. ఈ సినిమాలో నటీనటులందరూ అలా చక్కగా అమరారు.
సాంకేతికంగా చూస్తే.. దర్శకుడు రాజ్.ఆర్ సినిమాను వ్యాపార కోణంలో చూసి కమర్షియల్ అంశాలను చొప్పించే ప్రయత్నం చేయలేదు. సహజత్వానికి దగ్గరగా సినిమాను తెరకెక్కించారు. సినిమాను ఎక్కడా ఎక్కువగా లాగకుండా ఎంత మోతాదులో చూపించాలో అంతే చూపించారు. దర్శకుడిగా మంచి పేరుతో పాటు, నిర్మాతగా మంచి సినిమాను చేసినందుకు రాజ్ను అభినందించాలి. మార్క్ కె.రాబిన్ సంగీతం, నేపథ్య సంగీతం బావుంది. బాలు శాండిల్య కెమెరా పనితం బావుంది. దర్శకుడికి ప్రతి శాఖ తన వంతు సపోర్ట్ను చక్కగా అందించారు.
తెలంగాణ ప్రాంతాలలో 1980-90 నాటి పరిస్థితులను కళ్లకు కట్టారు. ఒక పక్క ఓ వ్యక్తి బయోపిక్ను తెరకెక్కిస్తూనే మరో పక్క చేనేత కార్మికుల వ్యథలు, మనోవేదన, చేనేతకు తగ్గిపోతున్న ప్రాధాన్యత అంశాలను చూపించారు. ప్రత్యేకమైన కామెడీ అంటూ లేకుండా సందర్భానుసారం వచ్చే కామెడీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. హీరో స్నేహితులుగా నటించిన నటులు చక్కగా నటించారు. సినిమా అంటే కమర్షియల్ అంశాల కలయిక అన్నట్లు కాకుండా, మన చుట్టూనే మనకు తెలియని స్ఫూర్తిదాయకమైన కథలుంటాయి. వాటిని చక్కగా తెరకెక్కిస్తే చాలని సినిమా చూసిన వారికి అనిపిస్తుంది. మంచి సంభాషణలుంటాయి. ప్రీ క్లైమాక్స్లో వచ్చే `సముద్ర గర్భంలో దాగిన బడబాగ్నులెన్నో, సమాజంలో అజ్ఞాత సూర్యలెందరో, గాయపడిన కవి గుండెల్లో రాయబడని కవితలెన్నో` అనే ఓ కవిత సినిమా మొత్తం కథాంశాన్ని క్లుప్తంగా చెప్పేస్తుంది.
రేటింగ్: భారత ప్రభుత్వంతో పద్మశ్రీ అవార్డు అందుకున్న వ్యక్తి బయోపిక్కి రేటింగ్ ఇవ్వడం భావ్యం కాదని భావించి రేటింగ్ ఇవ్వడం లేదు