సమర్పణ: అల్లు అరవింద్
బ్యానర్స్: జీఏ 2 పిక్చర్స్, యువీ క్రియేషన్స్
నటీనటులు: సాయితేజ్, రాశీఖన్నా, సత్యరాజ్, రావు రమేష్, కృష్ణమాచారి, ప్రవీణ్, హరితేజ, అజయ్, సత్యం రాజేష్ తదితరులు
దర్శకత్వం: మారుతి
నిర్మాత: బన్నీవాస్
సంగీతం: ఎస్.తమన్
కెమెరా: జయకుమార్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
బంధాలు, అనుబంధాల కలయికే కుటుంబం. భావోద్వేగాల కుటుంబంలో ఓ సమస్య అంటే అందరూ ఒక్కటైపోతాం. అలాంటి అనుబంధాలన్నీ ఈరోజు కనపడటం లేదు. ఈ కథాంశంతో రూపొందిన చిత్రమే `ప్రతిరోజూ పండగే`. సాయితేజ్, సత్యరాజ్ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రాన్ని ఓ కుటుం కథా చిత్రంగా దర్శకుడు మారుతి తెరకెక్కించాడు. సాధారణంగా మారుతి తెరకెక్కించిన సినిమాల్లో హీరోలకు ఓ ఒక డిజార్డర్ ఉంటుంది. అలా కాకుండా పూర్తి కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన `ప్రతిరోజూ పండగే` సినిమాతో ప్రేక్షకులను మారుతి ఎలా ఆకట్టుకున్నాడో తెలుసుకోవాలంటే ముందుగా సినిమా కథలోకి వెళదాం..
కథ:
రాజమండ్రిలో ఉన్న రఘురామయ్య(సత్యరాజ్) ముగ్గురు కొడుకులు, ఓ కూతురు ఉంటుంది. అందులో ఇద్దరు కొడుకులు, కూతురు విదేశాల్లో ఉంటే.. ఆఖరి కొడుకు మాత్రం సిటీలో క్యాటరింగ్ వ్యాపారంలో బిజీగా ఉంటాడు. అందరూ బిజీగా ఉంటారు. ఎప్పుడో కానీ రఘురామయ్యను చూడటానికి రారు. రఘురామయ్య పెద్ద కొడుకు(రావు రమేష్)కి కొడుకు సాయి(సాయితేజ్)కి మాత్రం తాతయ్య అంటే ప్రాణం. రఘురామయ్యకి ఊపిరితిత్తుల క్యాన్సర్ అని ఎక్కువ రోజులు బ్రతకడని డాక్టర్లు చెబుతారు. అప్పుడు సాయి ఏమీ ఆలోచించకుండా తాతయ్య దగ్గరకి వచ్చేస్తాడు. ఆయన కోరిక ప్రకారం ఆయన స్నేహితుడు మనవరాలు ఏంజెల్ అర్ణ(రాశీఖన్నా)ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే బిజినెస్ డీల్లో భాగంగా కొడుక్కి మరో సంబంధం మాట్లాడిన సాయి తండ్రి రాజమండ్రి వచ్చేస్తాడు. అతనితో పాటు మిగిలిన కుటుంబ సభ్యులందరూ వస్తారు. ఐదు వారల్లో చనిపోతాడని డాక్టర్లు చెప్పిన రఘురామయ్య చనిపోడు. అందుకు కారణమేంటి? విదేశాల నుండి పనులు మానుకుని వచ్చిన కొడుకులు, కూతురు ఆయన్ని ఏమంటారు? తండ్రి సహా తన వాళ్లకి సాయి ఎలా బుద్ధి చెబుతాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పనితీరు:
సినిమా అంతా రఘురామయ్య అనే పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఆ పాత్రలో నటించిన సత్యరాజ్. సినిమాలోని ఎమోషన్స్ను చక్కగా క్యారీ చేశారు. ఇప్పటి వరకు తెలుగులో సత్యరాజ్ చేసిన పాత్రలకు ఈ పాత్ర చాలా డిఫరెంట్గా ఉంటుంది. తాను చనిపోతానని తెలసి కుటుంబంతో కలిసి ఉండాలని తాపత్రయ పడే తండ్రి పాత్రలో ఆయన నటన ఆకట్టుకుంటుంది. ఇక సినిమాలో కీలకమైన పాత్ర రావు రమేష్ది. రఘురామయ్య పెద్దకొడుకు పాత్రలో ఆయన నటన సింప్లీ సూపర్బ్. రావు రమేష్ని విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కామెడీ చేసిన క్యారెక్టర్స్లో చూశాం. కానీ ఈ సినిమాలో కామెడీ చేస్తూ ఓ ఎమోషన్ను ఆయన క్యారీ చేసిన తీరు సింప్లీ సూపర్బ్. సత్యరాజ్ తర్వాత రావురమేష్ పాత్ర చాలా కీలకంగా నిలిచింది. ఇక మూడో పాత్ర సాయితేజ్. ఎక్కడా హీరోయిజం ఉండకపోయినా.. కథను నమ్మి సినిమా చేశాడు. తన పాత్రకు తను న్యాయం చేశాడు. ఓ ఫైట్ కోసం తను సిక్స్ ప్యాక్ చేయడం అభినందనీయం. ఇక టిక్టాక్ సెలబ్రిటి ఎంజెల్ అర్ణగా రాశీఖన్నా కామెడీని పండించింది. కేవలం హీరోయిన్గానే కాకుండా ఓ పాటను పాడింది. అలాగే ఓ పాటలో గ్లామర్గానూ కనపడింది. ఇక మురళీశర్మ, విజయ్ కుమార్, హరితేజ, కృష్ణమాచారి, ప్రవీణ్, భద్రమ్ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశాడు.
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు మారుతి .. ఓ తెలిసిన కథాంశంతోనే సినిమా తీయాలనుకున్నాడు. అయితే వాటిని గ్రిప్పింగ్గా, ఎక్కువ డ్రెమటిక్గా లేకుండా తెరకెక్కించిన తీరు చాలా బావుంది. ఎమోషనల్ సీన్స్ను తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంది. ఇక కామెడీ సన్నివేశాలు, ముఖ్యంగా రావు రమేష్ కామెడీ ట్రాక్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఆ పాత్ర ప్రవర్తించే తీరు, డైలాగ్ డెలివరీ అన్ని బావున్నాయి. రాశీఖన్నా కామెడీ ట్రాక్ కూడా బావుంది. ఇక మిగిలిన పాత్రలను మలిచిన తీరు కూడా బావుంది. తమన్ సంగీతంలో రెండు సాంగ్స్ బావు్నాయి. నేపథ్య సంగీతం బావుంది. జయకుమార్ కెమెరా పనితనం బావుంది. కోటగిరి కూర్పు బావుంది. సెకండాఫ్ సాగదీతగా అనిపిస్తుంది. ఇక ఎమోషన్స్ కనెక్టింగ్గా అనిపించవు.
బోటమ్ లైన్:
ప్రతిరోజూ పండగే.. ఆకట్టుకునే కుటుంబ కథా చిత్రం
రేటింగ్: 3/5