నిర్మాణ సంస్థ: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ
నటీనటులు: చిరంజీవి, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చాసుదీప్, జగపతిబాబు, నయనతార, తమన్నా, అనుష్క, రవికిషన్, నిహారిక, బ్రహ్మాజీ, ముఖేష్ రుషి, థర్టీ ఇయర్స్ పృథ్వీ, రఘుబాబు తదితరులు
రచన: పరుచూరి బ్రదర్స్, సాయిమాధవ్ బుర్రా
ప్రొడక్షన్ డిజైన్: రాజీవన్
సంగీతం: అమిత్ త్రివేది
నేపథ్య సంగీతం: జూలియస్ పేకియం
ఛాయాగ్రహణం: రత్నవేలు
కూర్పు: ఎ.శ్రీకర్ ప్రసాద్
నిర్మాత: రామ్చరణ్
దర్శకత్వం: సురేందర్ రెడ్డి
మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఉంటుందని ప్రకటించగానే అందరూ ఆశ్చర్యపోయారు. 41 ఏళ్ల కెరీర్లో చిరంజీవి ఇప్పటి వరకు హిస్టారికల్ మూవీ ఒకటి కూడా చేయలేదు. దాంతో ఆయన ఎలా ఉంటాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. మరో పక్క ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను సినిమా రూపంలో తీసుకు రావడమనేది చిరంజీవి 12 ఏళ్ల కల. ఎప్పుడో చేయాల్సిన ఈ సినిమాను అప్పటి మార్కెట్ పరిస్థితులు అనుకూలించక పోవడంతో పక్కన పెట్టేశారు. చిరు రీ ఎంట్రీ తర్వాత ఈ ప్రాజెక్ట్ లైన్లోకి వచ్చింది. మరి భారీ బడ్జెట్ సినిమాను ఎవరు చేస్తారా అని అనుకుంటున్న తరుణంలో రామ్చరణ్ నిర్మాతగా మారి నాన్న కలల ప్రాజెక్ట్ను రూపొందించడానికి ముందడుగు వేశారు. రెండున్నరేళ్ల పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డారు. ప్యాన్ ఇండియా మూవీగా దీన్ని ఆవిష్కరించడానికి యూనిట్ చేయని ప్రయత్నం లేదు. చిరు శారీరకంగా, మానసికంగా కష్టపడితే.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది, యాక్షన్ కొరియోగ్రాపర్స్ గ్రెగ్ పావెల్, లీ విట్టేకర్, రామ్ లక్ష్మణ్ ఇలా అందరూ సినిమా అద్భుతంగా రావడంలో తమవంతు పాత్రను పోషించారు. గాంధీ జయంతి రోజున ప్రేక్షకుల ముందు భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా మెప్పించిందో తెలుసుకోవడానికి ముందు కథలోకి వెళదాం.
కథ:
1857 స్వాతంత్ర్య సమరంలో బ్రిటీష్ వారిని ఎదిరించి వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ తన సైనికుల్లో ధైర్యాన్ని నింపడానికి అంత కంటే పదేళ్ల ముందు బ్రిటీష్ వారిని ఎదిరించి వీర మరణం పొందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను చెప్పడం మొదలు పెడుతుంది. నొస్సం కోటకు దత్త పుత్రుడుగా వెళ్లిన మజ్జారి నరసింహారెడ్డి(చిరంజీవి).. చిన్నప్పటి నుండి బ్రిటీష్ వారి చెర నుండి స్వాతంత్ర్యం కోరుకుంటూ, వారితో పోరాటం చేయాలని అనుకుంటూ ఉంటాడు. గోసాయి వెంకన్న(అమితాబ్) మార్గదర్శకంలో పెద్దవాడవుతాడు నరసింహారెడ్డి. రేనాడు ప్రాంతం కరువు కాటకాలతో ఇబ్బందులు పడుతున్నా కూడా బ్రిటీష్వారు పన్నులు చెల్లించాల్సిందేనని అంటారు. ఓ సందర్భంలో క్రాకెన్ దొరను ఎదిరిస్తాడు నరసింహారెడ్డి. ఆ పగతో అతడు కొంత మంది రైతులను చంపేస్తాడు. కోపంతో ఉగ్ర నరసింహుడుగా మారి క్రాకెన్ దొర తల నరికేస్తాడు నరసింహారెడ్డి. అక్కడ నుండి నరసింహారెడ్డికి, బ్రిటీష్ వారికి ప్రత్యక్ష యుద్ధం మొదలవుతుంది. నరసింహారెడ్డి ప్రజల్లో చైతన్యం తెస్తూ వారినే తన సైన్యంగా చేసుకుని పోరాటం సాగిస్తుంటాడు. చివరకు నరసింహారెడ్డిని పట్టుకోవడానికి బ్రిటీష్వారు ఏ పన్నాగం పన్నుతారు. ఆ పన్నాగమేంటి? చివరకు నరసింహారెడ్డిని బ్రిటీష్వారు ఎలా బంధించారు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
ప్లస్ పాయింట్స్:
– చిరంజీవి ఇతర నటీనటుల నటన
– సినిమాటోగ్రఫీ
– వి.ఎఫ్.ఎక్స్
– బ్యాగ్రౌండ్ స్కోర్
– డైలాగ్స్
– యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్:
– ఫస్టాఫ్ డ్రాగింగ్గా అనిపిస్తుంది
– పాలెగాడు చేసే పోరాటాలను యుద్ధాల రేంజ్లో ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు
విశ్లేషణ:
చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత చేసిన రెండో చిత్రం. అది కూడా హిస్టారికల్ మూవీ. దాదాపు రూ.300 కోట్లతో తెరకెక్కే సినిమాను డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాను ఎలా డైరెక్ట్ చేస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఎందుకంటే బాహుబలి తర్వాత దక్షిణాది స్టార్స్ సినిమాలు ప్యాన్ ఇండియా సినిమాలుగా సందడి చేయడం మొదలు పెట్టాయి. అలాగే 41 ఏళ్ల సినీ కెరీర్లో చిరంజీవి చేస్తున్న తొలి హిస్టారికల్ మూవీ. ఇందులో ఎలాంటి యాక్షన్ ఎలిమెంట్స్ చేస్తాడోనని అందరిలో ఆసక్తి పెరిగింది. ఈ సినిమాను నిర్మించడానికి హీరో, చిరంజీవి తనయుడు రామ్చరణ్ ముందుకు వచ్చాడు. క్రమంగా సినిమాలో అమితాబ్ బచ్చన్, నయనతార, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా, అనుష్క ఇలా తారాగణం భారీ స్థాయిలో పెరిగింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలను అందుకోవడానికి మెగాస్టార్ పడ్డ కష్టం తెరపై కనపడుతుంది. ఆరు పదుల వయసు దాటినా కూడా ఆయన చేసిన యాక్షన్ సీన్స్ ఔరా అనిపించేలా ఉన్నాయి. ఇంటర్వెల్లో వచ్చే వాటర్ ఫైట్ సీక్వెన్స్ చాలా బావుంది. గ్రెగ్ పావెల్, లీ విట్టేకర్, రామ్ లక్ష్మణ్లు ఎమోషన్స్ మిక్స్ చేస్తూ చేసిన యాక్షన్ పార్ట్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. అమితాబ్ బచ్చన్ రోల్ పరిమితంగానే ఉన్నా.. ఆ పాత్రకు ఆయన తనదైన నటనతో ప్రాణం పోశాడు. ఇక అవుకురాజు పాత్రలో కిచ్చా సుదీప్, రాజా పాండి పాత్రలో విజయ్ సేతుపతి, వీరా రెడ్డి పాత్రలో జగపతిబాబు, సిద్ధమ్మ పాత్రలో నయనతార, లక్ష్మి పాత్రలో తమన్నా ఇలా అందరూ చాలా చక్కగా నటించారు. హీరోయిన్స్ విషయంలో తమన్నా పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత దక్కింది. ఆమె ఆత్మాహుతి దాడి చేసే సన్నివేశం హైలైట్గా నిలిచింది.
దర్శకుడు సురేందర్ రెడ్డి తన దర్శకత్వంలోని మరో కోణాన్ని చక్కగా ఎలివేట్ చేశాడు. ఓ హిస్టారికల్ మూవీని ఆయన తెరకెక్కించిన తీరు అభినందనీయం. కథలోని ప్రతిపాత్రకు చక్కగా న్యాయం జరిగింది. అయితే ఫస్టాఫ్ కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ఇక సెకండాప్ విషయానికి వస్తే ఇంటర్వెల్ నుండి కథలో స్పీడు అందుకుంది. క్లైమాక్స్ వరకు సినిమా ఎమోషనల్గా కనెక్ట్ చేసుకుంటూ సాగింది. క్లైమాక్స్లో డైలాగ్స్తో సహా దాన్ని చిత్రీకరించిన తీరు చాలా బావుంది. అభిమానులను మెప్పించే సీన్స్లో ఇదొకటి. రత్నవేలు సినిమాటోగ్రఫీతో ప్రతి సన్నివేశాన్ని మరో లెవల్లో చూపించాడు. అమిత్ త్రిదేవి సంగీతం, జూలియస్ పాకియం నేపథ్య సంగీతం సినిమాకు మరో ఎసెట్ అయ్యాయి. రాజీవన్ ప్రొడక్షన్ వర్క్, సుస్మిత కాస్ట్యూమ్స్ అన్నీ సినిమాకు ప్లస్గా నిలిచాయి. రామ్చరణ్ తన తండ్రి కలల ప్రాజెక్ట్ను నేరవేర్చడానికి రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఆ ఖర్చు ప్రతి సీన్లో మనకు తెరపై కనపడుతుంది. చరణ్ తన తండ్రికి ఈ చిత్రం ద్వారా మంచి బహుమతినిచ్చాడని చెప్పాలి.
చివరగా.. చరిత్రలో కనుమరుగైన స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను తెరకెక్కించడానికి పడ్డ కష్టం మనకు తెరపై కనపడుతుంది. సినిమా చూసిన తర్వాత ఎంటైర్ యూనిట్ను అభినందించాలనిపిస్తుంది. ఇలాంటి ఓ గొప్ప ప్రయత్నానికి రేటింగ్ ఇవ్వడం లేదు.
తెలుగువాడి పౌరుషాన్ని చాటిన రేనాటి సూర్యుడి కథే `సైరా నరసింహారెడ్డి`