(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం)
అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) బోర్డు సభ్యుల సంఖ్యను వెయ్యి నూటా పదహార్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దీంతో ఇప్పటికే నామినేట్ చేసిన పాతికపై చిలుకు మందికి తోడు మరో వెయ్యికిపైగా సభ్యులను నియమించేకునే వీలు కలిగింది. ముందు ముందు ఎప్పుడు వీలైతే అప్పుడు అవసరాన్ని బట్టి బోర్డు సభ్యుల నియామకాలను చేపట్టేందుకు వీలుగా వైఎస్ జగన్ ప్రభుత్వం తాజా జీవో ఎంఎస్ నం.1116 జారీ చేసింది. శ్రీవారి సేవ కోసం పరితపిస్తున్న వీఐపీల సంఖ్య మరీ ఎక్కువగా ఉండడంతో ఈ జీవోను జారీ చేసినట్లు చెబుతున్నారు. దీంతోపాటు త్వరలో శ్రీశైలం వంటి పలు దేవస్థానాల పాలక మండళ్లలో కూడా సభ్యుల సంఖ్యను గణనీయంగా పెంచనున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంలో భాగంగా ఇకపై ఏ గుడి బోర్డులోనైనా ఐదొందల పదహారుకు తగ్గకుండా సభ్యులను నియమించేందుకు వీలుకల్పిస్తారని తెలుస్తోంది. దీని వల్ల వీఐపీలు, బినామీల మనోభావాలను గౌరవించినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
టీటీడీ వంటి పెద్ద ఆలయం బోర్డులో ముప్పైమంది సభ్యులు మాత్రమే ఉండడం ఎంత మాత్రమూ సరికాదని సీఎం వైఎస్ జగన్ భావించినట్లు ప్రభుత్వ వర్గాల భోగట్టా. ఆలయాల పవిత్రతను కాపాడి, ఆయా దేవాలయాల సేవలో తరించాలంటే వీలైనంత ఎక్కువమందికి అవకాశం కల్పించడం తప్పనిసరి అని ముఖ్యమంత్రి తలపోస్తున్నారు. టీటీడీ వంటి పెద్ద ఆలయాల బోర్డు సభ్యులకు కేబినెట్ హోదా కూడా కల్పిస్తే మరింత మంచిదని ఆయన అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే, లోగడ పెద్దనోట్ల కేసులో ఇరుక్కున్న “చంద్రబాబు బినామీ” శేఖర్ రెడ్డి (ఏజే శేఖర్)ని టీటీడీ బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించడాన్ని వైఎస్ఆర్సీపీ గట్టిగా సమర్థించుకుంది. దీనిపై ఆ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు బినామీలకు కూడా ప్రభుత్వం కీలక పదవులు ఇస్తోందంటే వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంత నిష్పక్షపాతంగా, ఉదారంగా వ్యవహరిస్తోందో తెలుస్తుందన్నారు. చివరికి బాబు బినామీలను కూడా గౌరవించి నియామకాలు జరుపుతుంటే, ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందంటూ టీడీపీ బృందం గవర్నర్ కు ఫిర్యాదు చేయడం అన్యాయమని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు, టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యను వెయ్యి నూటా పదహార్లకు పెంచడాన్ని విపక్షాలు సైతం స్వాగతించాయి. తమ నేత నారాయణ వంటి మంచి భక్తులకు కూడా టీటీడీ బోర్డులో స్థానం కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ డిమాండ్ చేశారు. సీపీఐ నేతలకు అవకాశం కల్పిస్తే తమకు కూడా తప్పనిసరిగా బోర్డులో వాటా దక్కాల్సిందేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. ఇక బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు మాట్లాడుతూ చంద్రబాబు బినామీలనే కాకుండా తమ బినామీలను కూడా టీటీడీ బోర్డులో నియమించాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ మొత్తం వ్యవహారంపై టీడీపీ ఆచి తూచి స్పందించింది. నిజానికి తిరుమలను తామే అభివృద్ధి చేశామనీ, ఆలయం బోర్డులో అందరి బినామీలకు అవకాశం కల్పించడం మంచిదేననీ, ఇదొక్కటే ఇటీవలి కాలంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న పాజిటివ్ నిర్ణయమని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నేత మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు స్పందిస్తూ, అసలు బినామీలను, రాజకీయనిరుద్యోగులను టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించే సంప్రదాయానికి ఒరవడి పెట్టింది తామేనన్నారు.
——————————————————————————————————————————–
Note: వ్యంగ్యవార్త అన్నది Faking News రచనాపద్ధతిలో ఒక భాగం. ఇవి నిజం వార్తలు కావు. ఆయా వాదనలు, రాజకీయ నాయకుల వైఖరుల్లోని డొల్లతనాన్ని వ్యంగ్యపద్ధతిలో ఎత్తిచూపడం దీని ఉద్దేశ్యం. పాఠకులు గమనించగలరు.