(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం)
అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంపై డ్రోన్లు ఎగరేయడం వివాదాస్పదం కావడంతో ఏపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇకపై ఇలాంటి వివాదాలు తలెత్తకుండా చేసేందుకుగాను స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించింది. న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగానికి అందిన సమాచారం ప్రకారం ఈవారంలో తాజా మార్గదర్శక సూత్రాలపై జీవో వెలువడనుంది. కొత్త రూల్స్ ప్రకారం ఇకపై ప్రతిపక్షనాయకుడి నివాసంపై ఎప్పుడు పడితే అప్పుడు డ్రోన్లు తిప్పొచ్చు. హెలీకాప్టర్లు, చిన్నపాటి విమానాలూ ఎగరేసుకోవచ్చు. వాటి సాయంతో వీడియోలు, విజువల్సూ తీసుకోవచ్చు. అవసరమైతే వాష్ రూమ్ తో సహా నివాసభవనంలోని అన్ని గదుల్లో కెమెరాలు అమర్చుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రతిపక్షనేత ఫోన్లు కూడా ట్యాప్ చేయవచ్చు. ఇవన్నీ ప్రతిపక్షనాయకుడి భద్రత దృష్ట్యా ప్రభుత్వం తీసుకునే చర్యల్లో భాగంగానే పరిగణిస్తారు. ఈ జీవో వెలువడితే ఇక డ్రోన్లు ఎగరేయడం చట్టబద్ధం అవుతుంది కనుక నిబంధనలను అతిక్రమించారన్న వివాదమేదీ తలెత్తదని ప్రభుత్వం భావిస్తోంది.
ఇదిలావుండగా చంద్రబాబు నాయుడు నివాసంపై డ్రోన్లు ఎగరేయడాన్ని జగన్ ప్రభుత్వం గట్టిగా సమర్థించుకుంది. చంద్రబాబు నివాసం వరదల్లో కొట్టుకుపోతుందో లేదో అంచనా వేయడానికే డ్రోన్లు ఉపయోగించామని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాకు తెలిపారు. చంద్రబాబు నివాసం వరదల్లో మునిగిపోతే సహాయ చర్యలు చేపట్టవలసిన బాధ్యత ప్రభుత్వానికే ఉంటుందని ఆయన వివరించారు. అప్పట్లో ‘‘అన్నా! వరదలు వచ్చినప్పుడు మీ ఇల్లు మునగదా?’’ అని చంద్రబాబును కేసీఆర్ అడిగిన సంగతిని ఆయన గుర్తు చేశారు. డిజైన్లు మార్చేసి ప్రాజెక్టులు కట్టే కేసీఆర్ లాంటి గొప్ప ఇంజనీరింగ్ అనుభవం కలిగిన నేత ఆనాడే చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందని ఊహించారన్నారు. కాబట్టి చంద్రబాబు ఇల్లు ముంచడానికి తమ ప్రభుత్వం ప్రత్యేకంగా బ్యారేజ్ గేట్ల దగ్గర పడవలు ముంచనక్కర్లేదన్నారు.
మరోవైపు చంద్రబాబు నాయుడు నివాసంపై విజయవంతంగా డ్రోన్లు పంపినందుకుగాను అనిల్ కుమార్ యాదవ్ ను ప్రతిష్ఠాత్మకమైన ‘డ్రోనా’చార్య అవార్డు వరించింది. ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఏటేటా ప్రదానం చేసే ఈ అవార్డు కింద ఆయనకు 10 లక్షల నగదు, ప్రశంసాపత్రం లభిస్తాయని అధికార వర్గాలు తెలిపాయి. తాజాగా ఏర్పాటు చేసిన డ్రోన్లశాఖను కూడా ఇకపై అనిల్ కుమార్ యాదవ్ పర్యవేక్షిస్తారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఇదంతా ఇలావుంటే డ్రోన్ల రగడపై టీడీపీ ప్రతినిధిబృందం గవర్నర్ హరిచందన్ ను కలిసి ఫిర్యాదు చేసింది. డ్రోన్లు ఎగరేసే విషయంలో వివక్ష తగదని టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గల్లా జయదేవ్ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసంపై కూడా డ్రోన్లు ఎగరేసే అవకాశం ప్రతిపక్షానికి ఉండాలన్నారు.
——————————————————————————————————————————–
Note: వ్యంగ్యవార్త అన్నది Faking News రచనాపద్ధతిలో ఒక భాగం. ఇవి నిజం వార్తలు కావు. ఆయా వాదనలు, రాజకీయ నాయకుల వైఖరుల్లోని డొల్లతనాన్ని వ్యంగ్యపద్ధతిలో ఎత్తిచూపడం దీని ఉద్దేశ్యం. పాఠకులు గమనించగలరు.