(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం)
అమరావతి : అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం తెలుగు భాషకు సంబంధించి మరో విధానపరమైన కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం తీసేసి ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతున్న ప్రభుత్వం ఇంకో అడుగు ముందుకు వేసి ఆంధ్రప్రదేశ్ పేరును కూడా మార్చాలని నిర్ణయించింది. రాష్ట్రానికి ఏ పేరు పెట్టాలన్న విషయంలో ప్రజల నుంచే సూచనలు కోరాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజధానిపై నిపుణుల కమిటీ వేసినట్లే రాష్ట్రం పేరు మార్పుపై కూడా ఓ ఉన్నతస్థాయి కమిటీని వేసి దాని ద్వారా ప్రజాభిప్రాయసేకరణ చేపట్టవచ్చునని ప్రభుత్వం తలపోస్తోంది. ఆంగ్లప్రదేశ్ గా మారిస్తే ఏపీ అన్న పొట్టి అక్షరాలకు కూడా అది సరిగ్గా సరిపోతుందని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అలాగే తెలుగును ఇప్పటి నుంచి టెలుగుగానూ, తెలుగు తల్లిని టెల్గుమదర్ గానూ, అమరావతిని అమరావటిగానూ, గోదావరిని గోడావరిగానూ, కర్నూలును కుర్నూలుగానూ, కడపను కుడపగానూ ఇంగ్లీష్ స్టైల్లోనే ఉచ్చరించాలని ఒక జీవోను కూడా జారీ చేసింది. ఉచ్చారణ తెలుగులోనే కొనసాగితే విదేశ విద్యార్థులతో మన పిల్లలు పోటీపడడం సాధ్యం కాదని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ సంస్కరణల్లో భాగంగా ‘మా తెలుగు తల్లికీ మల్లెపూదండ’ గీతాన్ని ‘గార్లాండ్ టు అవర్ టెల్గూ మదర్’గా ఇంగ్లీషులోకి అనువదింపజేసి సభల్లో పాడించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెమ్మది నెమ్మదిగా మన పౌరుల తెలుగు పేర్లని కూడా ఇంగ్లీషులోకి అనువదించుకునేలా ప్రజలను ప్రోత్సహించాలన్నది ప్రభుత్వం ఆలోచనగా ఉంది. అందుకే ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేశ్ తన పేరును ‘బిగినింగ్ రూట్ లార్డ్ ఆఫ్ ది గాడ్స్’ గా మార్చుకుని అందరికీ ప్రేరణదాయకంగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తగ్గట్టు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును సైతం ఇంగ్లీషులోకి మార్చితే మరింత స్ఫూర్తిదాయకంగా ఉంటుందని కొందరు మంత్రులు కేబినెట్ సమావేశంలో సూచించినట్లు తెలుస్తోంది. ఇక ‘సాక్షి’ పత్రిక కూడా పేరుని కూడా Eye Witness గానో Spectator గానో మార్చితే బాగుంటుందని వారు అభిప్రాయపడినట్లు సమాచారం.
ప్రభుత్వ పాలసీలో భాగంగా ఇక ఏపీలో ఎవ్వరికీ అమ్మానాన్నలు ఉండరు. మమ్మీ డాడీలే ఉంటారు. అలాగే తెలుగును మదర్ టంగ్ గా పేర్కొంటున్నట్లే ఇకపై ఇంగ్లీషును ఫాదర్ టంగ్ గా పరిగణించాలని ప్రభుత్వం తలంపుగా ఉంది. ఇంగ్లీషులో మాట్లాడేవారికి నగదు ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ఇవ్వాలని ప్రభుత్వం దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చింది. మొండిగా తెలుగు మాట్లాడేవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కట్ చేసే ఆలోచన కూడా ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలావుండగా ప్రభుత్వ ఇంగ్లీషు విధానాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా విమర్శించింది. టీడీపీ నేత లోకేశ్ ఒక ట్వీట్ చేస్తూ తన పేరును లార్డ్ ఆఫ్ ద వరల్డ్ గా మార్చుకోవడం తనకిష్టం లేదన్నారు. తమ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేరును మూన్ ఫాదర్ నాయుడుగా మార్చుకోవాలని ఒత్తిడి చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ పేరును ఇంగ్లీషులోకి మార్చి దొంగ దెబ్బతీసేందుకు చూస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు. మరోవైపు కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా తీసిన ఆర్జీవీ ఈ వివాదంపై ప్రభుత్వ విధానాన్ని సమర్థిస్తూ ఓ ట్వీట్ చేశారు. తన పేరును ‘ర్యామ్ కౌ మ్యాన్ వర్మ’గా మార్చుకుంటున్నానని ఆయన ప్రకటించారు. ‘ఇంగ్లీష్ రెడ్ల రాజ్యం’ పేరుతో ఓ సీక్వెల్ తీయనున్నన్నట్లు ఆయన వెల్లడించారు.
——————————————————————————–
Note: వ్యంగ్యవార్త అన్నది Faking News రచనాపద్ధతిలో ఒక భాగం. ఇవి నిజం వార్తలు కావు. ఆయా వాదనలు, రాజకీయ నాయకుల వైఖరుల్లోని డొల్లతనాన్ని వ్యంగ్యపద్ధతిలో ఎత్తిచూపడం దీని ఉద్దేశ్యం. పాఠకులు గమనించగలరు.