(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం)
హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చిన విందులో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సూటు వేసుకుని మెరిసిపోతున్న కేసీఆర్ ట్రంప్ తో చేతులు కలిపిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఈ విందుకు పొరుగు తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఎందుకనో ఆహ్వానించ లేదు. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఒక హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇది మంత్రి కే కన్నబాబు ఆధ్వర్యంలో పని చేసి ఓ నివేదిక ఇస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. మరో పక్క బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ను కూడా సంప్రదించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.
ఆర్థిక నేరస్తుడు కనుకనే జగన్ ను ట్రంప్ విందుకు ఆహ్వానించలేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కనిపెట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు వెల్లడించిన ఈ సమాచారం తాలూకు మూలాలను కూడా ప్రభుత్వ కమిటీలు పరిశీలిస్తాయని చెబుతున్నారు. ట్రంప్ విమానం దిగగానే చంద్రబాబు గురించి వాకబు చేశారంటూ ప్రచారం సాగుతోందని కన్నబాబు అన్నారు. అలాగే చంద్రబాబు ఆస్తులు ప్రకటించారా అని కూడా ట్రంప్ అడిగారని ఆయన- సెటైరికల్ గానే అయినా- విషయం బయటపెట్టారు. అసలు ట్రంప్ ఇండియాకు రాగానే మొదట చంద్రబాబు గురించి అడిగారా లేక జగనన్న గోరుముద్ద పథకాన్ని గురించి అడిగారా తేల్చాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. చంద్రబాబు నాయుడు ప్రజాచైతన్యయాత్ర గురించీ, లోకేశ్ 26 కోట్ల అప్పుల గురించీ ట్రంప్ వాకబు చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ట్రంప్ ను చంద్రబాబు ఎలా మేనేజ్ చేశారో కూపీ లాగాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ‘మీ జోష్ చూస్తుంటే అమెరికాలో కూడా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం అనిపిస్తోంది ‘ అంటూ లోగడ లోకేశ్ బాబు ప్రవాసాంధ్రులను ఉద్దేశించి అమెరికాలో చేసిన వ్యాఖ్యలు ట్రంప్ దృష్టికి వెళ్లి ఉండవచ్చుననీ, అందుకే విమానం దిగగానే లోకేశ్ గురించి ప్రత్యేకంగా వాకబు చేసి ఉండవచ్చుననీ కమిటీ భావిస్తోంది.
కాగా, వరుస ట్వీట్ల గొడవలో పడి ఎంపీ విజయ సాయి రెడ్డి ఢిల్లీలో జగన్ కు అనుకూలంగా చక్రం తిప్పలేకపోయారని హైపవర్ కమిటీ ఇప్పటికే ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చింది. జగన్ ఇంగ్లీష్ మీడియం నిర్ణయం కూడా ఇంతదాకా ట్రంప్ చెవినపడలేదనీ, ఏపీ రివర్స్ టెండరింగ్ విధానంపై కూడా ఆయనకు సమాచారం లేదనీ కమిటీ తన తొలి పరిశీలనలో తేల్చినట్లు చెబుతున్నారు. ఏపీలో మూడు రాజధానుల సంగతి సైతం ట్రంప్ కు ఎవరూ చెప్పలేదని కమిటీ అనుమానిస్తోంది. ఈ వివరాలు కనుక ట్రంప్ కు తెలిసి వుంటే వైఎస్ జగన్ ను విందుకు పిలవాలంటూ తప్పక పట్టుబట్టేవారని కమిటీ తలంపు. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ ను విందుకు ఆహ్వానించడం వెనుక ఇవాంకా సిఫారసు ఉండవచ్చని కూడా కమిటీ భావిస్తోంది. అదే కాకుండా కేసీఆర్ తరచు చేసే యాగాలు కూడా ట్రంప్ దృష్టికి వెళ్లి ఉండవచ్చునని కమిటీ ఒక అంచనాకు వచ్చింది. ఎర్రవల్లి, చింతమడక గ్రామాల్లో కేసీఆర్ జరిపిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కూడా ట్రంప్ దృష్టిని ఆకర్షించి ఉంటుందని ఏపీ హైపవర్ కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోసారి అమెరికా అధ్యక్షుడు వస్తానంటున్నారు కాబట్టి ఈసారి విందుకు జగన్ కు తప్పనిసరిగా ఆహ్వానం అందేలా చేపట్టవలసిన చర్యలను ఈ కమిటీ సిఫారసు చేస్తుందని చెబుతున్నారు.
——————————————————————————–—————————————-
Note: వ్యంగ్యవార్త అన్నది Faking News రచనాపద్ధతిలో ఒక భాగం. ఇవి నిజం వార్తలు కావు. ఆయా వాదనలు, రాజకీయ నాయకుల వైఖరుల్లోని డొల్లతనాన్ని వ్యంగ్యపద్ధతిలో ఎత్తిచూపడం దీని ఉద్దేశ్యం. పాఠకులు గమనించగలరు.