ఈ ప్యాక్ తో పాటు గడప గడపకూ కనీసం కిలో ఇసుకను కూడా ఉచితంగా అందిస్తే బాగుంటుందనీ, దీంతో ఇసుక సరఫరా విషయంలో ప్రభుత్వానికి వచ్చిన చెడ్డపేరు కాస్తా తొలగిపోతుందనీ వైసీపీ ప్రభుత్వ సలహాదారులు సూచించినట్లు సమాచారం. ఈ పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలనీ, అవసరమైతే పాటలు రాయించి విడుదల చేయాలనీ ప్రభుత్వం యోచిస్తోంది. దీని ద్వారా తెలుగుదేశం పార్టీ చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ “అభివృద్ధిఫలాల”ను నేరుగా లబ్ధిదారులకే అందించినట్లైతే విపక్షాల నోళ్లు మూతబడతాయని ప్రభుత్వ సలహాదారులు సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇదిలావుండగా సీఎం జగన్ తన ప్రభుత్వ పరిపాలన అంతా పారదర్శకంగా ఉంటుందని ప్రకటించినందున ఇకముందు మంత్రివర్గం సమావేశమయ్యే హాలును పూర్తి పారదర్శకంగా నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ఆ హాలును గాజు గోడలతో నిర్మించనున్నట్లు సమాచారం. మంత్రివర్గ సమావేశాలన్నీ గాజుగోడల నుంచి బయట ఉన్న అందరికీ పారదర్శకంగా కనబడేలా చేయాలన్నది దీని ఉద్దేశ్యంగా చెబుతున్నారు. ఎవరైనా సరే గాజుగోడల నుంచి మంత్రివర్గ సమావేశాలను నేరుగా వీక్షించే విధంగా బయట గ్యాలరీలు ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా మున్ముందు విపక్షాల నుంచి ఏ విమర్శలూ రాకుండా చూసుకోవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. పారదర్శక సమావేశ మందిరాల ఏర్పాటు కూడా దేశంలోనే వినూత్నమైన ప్రయోగమని ప్రభుత్వం చెబుతోంది.
——————————————————————————————————————————–
Note: వ్యంగ్యవార్త అన్నది Faking News రచనాపద్ధతిలో ఒక భాగం. ఇవి నిజం వార్తలు కావు. ఆయా వాదనలు, రాజకీయ నాయకుల వైఖరుల్లోని డొల్లతనాన్ని వ్యంగ్యపద్ధతిలో ఎత్తిచూపడం దీని ఉద్దేశ్యం. పాఠకులు గమనించగలరు.