(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం)
హైదరాబాద్ : తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత పటిష్ఠ పరచటం కోసం ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇరు రాష్ట్రాల సీఎంలతో ఓ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. మరింత సయోధ్య కోసం సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ కరచాలనాలు, గాఢ ఆలింగనాలు కొనసాగించాలని ఈ భేటీలో నిర్ణయించారు.
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఉభయులకూ శత్రువైనందున ఆయన్ను ఉడికించడానికి ఎప్పుడు కుదిరితే అప్పుడు గాఢపరిష్వంగంతో కెమెరాలకు ఫోజులివ్వాలని వారు తీర్మానించారు. చంద్రబాబు కుళ్లుకునేలా ఇందుకు మీడియా కవరేజ్ ఉండాలని కూడా వారు భావించినట్లు తెలుస్తోంది. అంతేగాక, ఒకరికొకరు స్వీట్లు తినిపించుకోవాలనీ, నవ్వుతూ చెట్టపట్టాలేసుకుని తిరగాలనీ వారు నిర్ణయించినట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. కరచాలనం పేరుతో ఇందుకోసం ఒక ప్రచార కార్యక్రమానికి సైతం శ్రీకారం చుట్టాలన్న ప్రతిపాదనపై వారిరువురి మధ్య చర్చ జరిగినట్లు చెబుతున్నారు. రోజుకొకసారైనా ఇద్దరూ పలకరించుకోవాలనీ, రెండ్రోజుల కొకసారి ఎవరో ఒకరు అమరావతికో, హైదరాబాద్ కో వెళుతూ ఉండాలని వారు సూత్రప్రాయంగా నిర్ణయించారు.
రెండు రాష్ట్రాల మధ్య అనేక సారూప్యతలు ఉన్నందున ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సఖ్యతగా ఉండాలని గవర్నర్ సూచించినట్లు తెలుస్తోంది. అభిజ్ఞవర్గాల సమాచారం ప్రకారం నరసింహన్ ఈ క్రింది సలహాలు ఇచ్చినట్లు సమాచారం…
- రెండు రాష్ట్రాలూ తెలుగు మాట్లాడే రాష్ట్రాలు…
- రెండు రాష్ట్రాలూ అప్పుల కుప్పలు…
- రెండు రాష్ట్రాలూ ఆర్థిక సంక్షోభంలోనే ఉన్నాయి…
- రెండు రాష్ట్రాల సీఎంలకు చంద్రబాబే ఉమ్మడి శత్రువు…
- రెండు రాష్ట్రాల సీఎంలకు విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతే రాజగురువు…
- రెండు రాష్ట్రాల సీఎంలకు త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయరు స్వామివారే ధర్మగురువు…
- రెండు రాష్ట్రాల సీఎంలకూ ప్రధాని మోదీయే మార్గదర్శకుడు…
- రెండు రాష్ట్రాల సీఎంలు ఇంకా పెట్టని ఫెడరల్ ఫ్రంట్ లోనే ఉన్నారు…
- రెండు రాష్ట్రాల సీఎంలలో ఒకరు మెడ నరుక్కుంటారే తప్ప మాట తప్పరు…ఇంకొకరు పెన్షన్ల పెంపు వంటి హామీల్లో మాట మారుస్తారే తప్ప మడమ తిప్పరు…
- రెండు రాష్ట్రాలకూ రాష్ట్రాలు వేరైనా, ఐదేళ్లు పూర్తయినా, ఆరు నూరైనా ఒకరే గవర్నర్…
- ఇలా ఎన్నో సారూప్యతలున్నందున ఇక ఇరు రాష్ట్రాలూ కేసీఆర్, జగన్ లలా కలిసిపోవాలి…
- రెండు రాష్ట్రాల్లోనూ ఇరువురు సీఎంలకు పర్యటనలప్పుడు ఫ్లెక్సీలు కట్టేందుకు పెద్ద యెత్తున వారి అభిమాన సంఘాలు పెట్టాలి…
ఈ సూచనలపై కేసీఆర్, జగన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీనికి నరసింహన్ ఫార్ములా అని పేరు కూడా పెట్టినట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.
ఇదిలావుండగా హైదరాబాద్ లో ఉన్న తెలంగాణ ఆఫీసులన్నిటినీ ఏపీకి దఖలుపరచడంతో పాటు సుహుద్భావ సూచకంగా అమరావతిలోని ఏపీ ఆఫీసుల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి తెలంగాణ మంత్రుల కోసం ప్రత్యేకంగా కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరిద్దరి మధ్య ఇంత స్నేహం కుదిరాక ఇక విభజన సమస్యలన్నవి ఉండే ప్రసక్తే లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
Note: వ్యంగ్యవార్త అన్నది Faking News రచనాపద్ధతిలో ఒక భాగం. ఇవి నిజం వార్తలు కావు. ఆయా వాదనలు, రాజకీయ నాయకుల వైఖరుల్లోని డొల్లతనాన్ని వ్యంగ్యపద్ధతిలో ఎత్తిచూపడం దీని ఉద్దేశ్యం. పాఠకులు గమనించగలరు.)