(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తా విభాగం)
న్యూ ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో జనం భయంతో పరుగులు తీశారు. ఆదివారం రాత్రి 10 గంటల 10 నిమిషాల సమయంలో ఢిల్లీలో భూమి ఒక్కసారిగా కంపించింది. రెక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.2 గా నమోదైంది. భూప్రకంపనల ధాటికి పాతభవనాలు కొన్ని దెబ్బతిన్నట్లు సమాచారం. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీల కార్యాలయాల భవనాలపై ఈ ప్రకంపనల ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సీస్మొలాజికల్ రిసెర్చ్ గుర్తించింది. ప్రాణనష్టమేమీ జరకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఈ ప్రకంపనల ఎపిసెంటర్ (కేంద్రం) తెలంగాణలోని ప్రగతి భవన్ లో ఉండడం భూభౌతిక శాస్త్రవేత్తలను విస్మయపరిచింది. సాధారణంగా భూప్రకంపనలు వచ్చే చుట్టుపక్కల కొన్ని మైళ్లలోపే ఎపిసెంటర్ ఉండడం కద్దు. కానీ ఈసారి మాత్రం రెక్టర్ స్కేలు దానిని హైదరాబాద్ వైపు సూచించడంతో ఆశ్చర్యపోవడం వారి వంతైంది. ఆరా తీయగా అసలు విషయం వారిని నిశ్చేష్టులను చేసింది. పేరు వెల్లడించటానికి ఇష్టపడని ఒక సీనియర్ సైంటిస్ట్ చెప్పిన ప్రకారం తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగాలే ఈ ప్రకంపనలకు కారణం.
“కేసీఆర్ ఢిల్లీకి వస్తారు. సినిమాల్లో చివరకు విలన్లను తరిమినట్లు మమ్మల్ని తరుము తారని మోదీ, రాహుల్ భయపడుతున్నారు” అని కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్ సభలో సినిమాటిక్ కామెంట్లు చేశారు. అంతేకాదు, అవసరమైతే కొత్త జాతీయ పార్టీ పెట్టి ఢిల్లీలో పొలిటికల్ ప్రకంపనలు సృష్టిస్తానని ఆయన స్పష్టంగా ప్రకటించారు. ఆయన చేసిన ఈ ప్రకటన వల్లే ఢిల్లీలో పొలిటికల్ ప్రకంపనల్లో భాగంగా ముందస్తుగా భూకంపం వచ్చిందని భావిస్తున్నారు. మే 23 తర్వాత పరిస్థితి మరింత తీవ్రం కావచ్చుననీ, తీవ్ర ప్రకంపనల మూలంగా ఢిల్లీ ప్రజలు నగరాన్నే వదిలిపెట్టవలసి రావచ్చుననీ అంచనా వేస్తున్నారు. కేసీఆర్ ను తక్కువ అంచనా వేయొద్దనీ, ఆయన వాగ్దాటితో ఏ ప్రాకృతిక విపత్తునైనా సృష్టించగలరనీ శాస్త్రవేత్తలు భారత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తాజా ప్రకంపనలను వారు కేసీఆర్ ట్రెమర్స్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కాలుష్యం కోరల్లో చిక్కి సతమతమౌతున్న ఢిల్లీకి కొత్తగా ప్రకంపనల బెడద ఎదురవడంతో అక్కడ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలాఉండగా తన తండ్రి కేసీఆర్ తో పెట్టుకుంటే అంతేననీ, హరీశ్ రావుకు పట్టిన గతే మోదీ, రాహుల్లకు పడుతుందనీ ఆయన కుమారుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ట్వీట్లో వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇంకో యాగం గనక చేస్తే తెలుగు పౌరాణిక సినిమాల్లో ఋషుల తపస్సుకు స్వర్గంలో ఇంద్రుని సింహాసనం ఊగిపోయినట్లు ఢిల్లీ గద్దె కూడా కదిలి ఊడిపడక తప్పదని ఆయన హెచ్చరించారు. ఢిల్లీలో తమ నాయకుడు ఇలా ప్రకంపనలు సృష్టించడం పట్ల హర్షాతిరేకంతో టీఆర్ఎస్ శ్రేణులు పలు పట్టణాల వీధుల్లో బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. కేసీఆర్ చిత్రపటానికి పాలతో అభిషేకం వంటివి కూడా చేశారు.
అయితే రోదసిలో సైతం శాటిలైట్లను కూల్చగలిగే టెక్నాలజీ మన సొంతమైందనీ, కేసీఆర్ ప్రకంపనలను కూడా తాము సమర్థంగా ఎదుర్కోగలమనీ ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. కానీ ఈ ప్రకంపనలకూ, కేసీఆర్ ప్రకటనలకూ ఏ సంబంధమూ ఉండే అవకాశం లేదనీ, ఫూటుగా మందుకొట్టడం వల్ల ఆయన ఒంట్లోనే తప్ప వేరెక్కడా ప్రకంపనలు రావనీ టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
(గమనిక : వ్యంగ్య వార్తలన్నవి సెటైరికల్ రచనాప్రక్రియలో ఒక భాగం. ఇవి నిజం వార్తలు కావని గమనించాలి.)