(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తా విభాగం)
హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం భవనాల కూల్చివేత, కొత్త అసెంబ్లీ నిర్మాణం వివాదాస్పదం కావడంతో సీఎం కేసీఆర్ అత్యవసర కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి కొన్ని అత్యవసర నిర్ణయాలు తీసుకున్నారు. సచివాలయం కూల్చివేతకు, అసెంబ్లీ నిర్మాణానికి అడ్డుపడుతున్న దుష్టశక్తులను ఎదుర్కొనేందుకు ఒక మహాయాగం చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తక్షణం రూ. 50 కోట్లు విడుదల చేస్తూ 666 జీవోని కూడా విడుదల చేసింది. ఈ ఉచ్ఛాటన యాగాన్ని విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో నిర్వహించాలని కేసీఆర్ నిశ్చయించారు. ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చివేయరాదనీ, కొత్త అసెంబ్లీ కోసం ఎర్రమంజిల్ కాలనీలో ఉన్న ప్యాలెస్ కూల్చివేయరాదనీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలలో అన్ని అవాంతరాలను తొలగజేసే విధంగా ఈ యాగం తలపెట్టారు. ఎర్రమంజిల్ ప్యాలెస్ ను ఇక మంత్రాలతోనే పడగొట్టేందుకు కేసీఆర్ సంకల్పించారు. వెయ్యి మంది ఋత్వికులతో వెయ్యి హోమకుండాలతో మహాయాగం నిర్వహించి ప్యాలెస్ ను కూల్చేయాలన్నది కేసీఆర్ ఆలోచనగా ఉంది. ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లో యాగానికి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు మొదలుపెట్టాలని కేసీఆర్ ఆదేశించారు. కొత్త సచివాలయం కోసం పాత భవనాలకు కూడా మంత్రాలతోనే పడగొట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం కొన్ని ప్రాచీన రహస్య మంత్రాలను ఉచ్చరిస్తూ పది రోజుల పాటు యాగం జరుగుతుంది. ఈ మంత్రప్రభావం చేత సచివాలయ భవనాలు, ఎర్రమంజిల్ ప్యాలెస్ పూర్ణాహుతినాటికల్లా బీటలు వారి వాటంతట అవే పడిపోతాయి. దీని వల్ల న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో పాటు బుల్డోజర్లతో కూల్చివేత శ్రమ కూడా తప్పుతుందన్నది కేసీఆర్ వ్యూహంగా ఉంది. దీంతో ప్రజాధనం దుర్వినియోగం కూడా కాదని కేసీఆర్ భావిస్తున్నారు. ఇలాంటి యాగం ఒకటి పాండవుల కాలంలో చేశారని పూజ్యశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ కేసీఆర్ చెవిన వేశారట. దీంతో ఇదే సరైన మార్గమనీ, పనిలో పనిగా విపక్షాల తిక్క కూడా కుదురుతుందనీ కేసీఆర్ తలపోస్తున్నారు. యాగం జరుగుతున్నప్పుడు భారీ వర్షాలు కురుస్తాయనీ, దీంతో ఎర్రమంజిల్ ప్యాలెస్ లాంటి పాత భవనాలన్నీ కుప్పకూలతాయనీ కొందరు పండితులు కేసీఆర్ కు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే వానలు ఎక్కువ కురిస్తే హైదరాబాద్ రోడ్లు వాగులూ చెరువులూ అయిపోతాయి కాబట్టి ముందస్తుగా ప్రభుత్వం జీహెచ్ఎంసీని అప్రమత్తం చేసింది.
కాగా ఈ యాగానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించాలనీ, దీని ద్వారా ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు మరింత దృఢపడతాయనీ ప్రభుత్వం భావిస్తోంది. మంత్రాలతో భవనాలను కూల్చివేస్తే తమ చేతికి మట్టి అంటదని కూడా ప్రభుత్వం విశ్వసిస్తోంది. వాస్తు ప్రకారం కట్టే కొత్త సచివాలయానికి తప్ప ప్రస్తుత సెక్రటేరియట్ కు కేసీఆర్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఎలాగైనా యాగంతో పని చక్కబెట్టుకోవాలని కేసీఆర్ తలపోస్తున్నట్లు అభిజ్ఞవర్గాల భోగట్టా. ఇదిలావుండగా మంత్రాలకు చింతకాయలు కూడా రాలవనీ, ఎర్రమంజిల్ ప్యాలెస్ ను మంత్రాలతో కూల్చడం అసాధ్యమన్న విషయం కేసీఆర్ గమనించాలనీ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. మంత్రాలతో భవనాలను కూల్చివేసే బదులు చేతనైతే మంత్రాలతో కొత్త భవనాలు కట్టాలని మరో కాంగ్రెస్ నేత వీహెచ్ సవాలు విసిరారు. దీనిపై స్పందించిన కేటీఆర్ ఒక ట్వీట్ చేస్తూ రాజశ్యామల యాగంతోనే కేసీఆర్ విపక్షాలను మట్టికరిపించి తిరిగి అధికారంలోకి వచ్చిన విషయం గుర్తు తెచ్చుకోవాలన్నారు. తెలంగాణను వాస్తు తెలంగాణగా మార్చేందుకు కేసీఆర్ చేస్తున్న కృషిని విపక్షాలు ప్రశంసించాలన్నారు. వాస్తుకు అనుగుణంగా తెలంగాణ ఏర్పడితే తమకు పుట్టగతులుండవని కాంగ్రెస్, బీజేపీ వంటి ప్రతిపక్షాలు భీతిల్లుతున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
——————————————————————————————————————————-
Note: వ్యంగ్యవార్త అన్నది Faking News రచనాపద్ధతిలో ఒక భాగం. ఇవి నిజం వార్తలు కావు. ఆయా వాదనలు, రాజకీయ నాయకుల వైఖరుల్లోని డొల్లతనాన్ని వ్యంగ్యపద్ధతిలో ఎత్తిచూపడం దీని ఉద్దేశ్యం. పాఠకులు గమనించగలరు.