(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం)
న్యూ ఢిల్లీ – దేశంలో దేశభక్తిని పెంపొందించేందుకు మోదీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇప్పటికే నియమించిన కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక మేరకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. తొలిదశలో ఇందుకు సంబంధించి దేశపౌరులు పాటించవలసిన అంశాలపై మార్గదర్శకాలు విడుదలయ్యాయి. త్వరలో వీటికి చట్టబద్ధత కల్పించనున్నారు. ఈ మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.
- లోగడ ఇందిర అంటే ఇండియా అని భావించినట్లే ఇప్పుడు మోదీ అంటే భారత్ అని అంతా విధిగా నమ్మాల్సి ఉంటుంది.
- పౌరులు ఒకరికొకరు ఎదురు పడ్డప్పుడు నమో నమో అని పలకరించుకోవాలి. నమస్తే, నమస్కార్ లాంటి పలకరింపుల స్థానంలో నమోను చేర్చుకోవాలి. నమో అంటే నరేంద్ర మోదీ అని గమనించాలి.
- దేశమంతా మోదీ మందిరాలు నిర్మించాలి. అందులో శాస్త్రోక్తంగా మోదీ విగ్రహం ప్రతిష్ఠించి నిత్యపూజలు జరపాలి. అక్బర్ చక్రవర్తి దీన్ ఇలాహీ మతంలాగే మోదీ కల్ట్ ని కూడా ఒక మతంగా పరిగణించాలి.
- మోదీని సమర్థించేవారు మాత్రమే దేశభక్తులుగా పరిగణించబడతారు. మోదీని వ్యతిరేకించేవారంతా దేశద్రోహులుగా పరిగణించబడతారని వేరే చెప్పనక్కర్లేదు.
- దేశభక్తికి మోదీ పేటెంట్ తీసుకున్నందున ఇకపై విపక్షాలు దేశం గురించి, దేశభక్తిని గురించి మాట్లాడే హక్కును కోల్పోతాయి.
- మోదీ సాధించిన విజయాల గురించి స్ఫూర్తిని కలిగించే విధంగా స్కూలు పుస్తకాల్లో పాఠ్యాంశాలు చేర్చాలి.
- దేశంలో క్రమంగా ప్రతిపక్షాలన్నీ బీజేపీలో విలీనమైపోతాయి కనుక మున్ముందు దశలవారీగా ఒకే దేశం..ఒకే ఎన్నిక… ఒకే పార్టీ విధానం అమలులోకి వస్తుంది.
- ప్రభుత్వ ఆఫీసుల్లోలానే అందరిళ్లలో మోదీ ఫోటో విధిగా గోడకి తగిలించుకోవాలి. స్థలం ఉంటే అమిత్ షా ఫోటో కూడా పెట్టుకోవాలి.
- వివిధ సామూహిక, సామాజిక కార్యక్రమాల్లో జనం మోదీ మాస్కులు ధరించాలి. వీటిని ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేస్తుంది.
- మోదీ లాకెట్లు, మోదీ టీ షర్టులు, మోదీ టోపీలు, మోదీ బాండ్లు ధరించేవారికి ప్రభుత్వపథకాల్లో ప్రాధాన్యం ఉంటుంది.
- మోదీని ఎవరైనా విమర్శిస్తే వారిపై సమీప పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయాలి. కేసులు నమోదయ్యేలా చూడాలి.
- మున్ముందు రిజర్వ్ బ్యాంకు జారీ చేసే నోట్లపై మోదీ సంతకం. మోదీ బొమ్మ ఉండే విధంగా చర్యలు చేపడతారు.
- మోదీపై కార్టూన్లు కూడా వేయరాదు. దాన్ని కూడా నేరంగా పరిగణిస్తారు. మోదీకి అనుకూలంగా ఉన్నవారికి సర్ప్రైజ్ బహుమతులు ఉంటాయి.
- ఈ మార్గదర్శకాలను పాటించని పక్షంలో తీసుకునే తదుపరి చర్యలకు ఆయా వ్యక్తులు, సంస్థలే బాధ్యత వహించవలసి ఉంటుంది.
- ఇదిలావుండగా ఈ మార్గదర్శకాల జారీని బీజేపీ స్వాగతించింది. ఇది నవ భారత్ నిర్మాణం దిశగా వేసిన మరో ముందడుగు అని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. మరోవైపు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రభుత్వ మార్గదర్శకాలను నిరసిస్తూ ఒక ట్వీట్ చేశారు. తాను వివిధ దేవాలయాలు సందర్శిస్తున్నప్పటికీ మోదీ మందిరాలకు పోయేది లేదని ఆయన స్పష్టం చేశారు.