కరోనానా…. అదెక్కడ? అదేం లేదే…! అయినా మేము చికెన్, మటన్ తిని కండలు పెంచేస్తుంటే కరోనా మమ్మల్ని ఏం చేస్తుంది…! ప్రభుత్వాలకు బుద్ధి లేదు. లాక్ డౌన్ అన్నాయి! మాకేమైనా బుద్ధి లేదనుకున్నారా ఏంటి? మేము భలే బుద్ధిమంతులం. ఆదివారం వస్తే ముక్క లోనికి వెళ్లాల్సిందే. మందు ఎలాగూ దొరకట్లేదు, ముక్క కూడా అందకపోతే ఎలా? కరోనాకి మాత్రం ఆదివారం సెలవులు ఉండవా ఏంటి? అది వారం సెలవు తీసుకుంది, అందుకే మేము ఇలా రోడ్డుపైకి తెగబడ్డాం….!!!
పందండి ముందుకు.. పందండి తోసుకు.. పోదాంపోదాం పైపైకీ.. అంటూ జనం ఎగబడ్డారు.. ఇంటికే పరిమితం కావాల్సిన లాక్ డౌన్ సమయంలో వీళ్లంతా సమాజోద్ధరణ కోసం వెళ్లారనుకుంటే పొరపాటే.. వీళ్లంతా ఎగబడింది చికెన్, మటన్ కొనుక్కునేందుకు.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ అవకాశం దొరకదేమో అన్నంత ఆతృత ప్రదర్శించారు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజానీకం.. ఆదివారం తెల్లారీ తెల్లారకముందే పోలోమంటూ బజార్నపడ్డారు. కరోనా కేసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. వైరస్ నియంత్రణ కోసం లాక్ డౌన్ కొనసాగిస్తున్న ప్రభుత్వాలు నిత్యావసరాల కొనుగోలుకు కాస్త వెసులుబాటు కల్పించాయి ప్రభుత్వాలు. దొరికిందే అదునుగా పనిఉన్నా లేకపోయినా రోడ్లమీదకి రావటం అలవాటుగా మార్చుకున్నారు జనాలు. ఇక ఆదివారాలైతే పుట్టలు పగిలినట్లుగా కట్టలు తెంచుకున్నట్టుగా గుట్టలుగుట్టలుగా చికెన్, మటన్ కొనుగోళ్ల కోసం ఎగబడుతున్నారు. ఇది కేవలం ప్రధాన నగరాలోనో, పట్టణాలకు మాత్రమే పరిమితం కాలేదు. చిన్నాచితకా మండల కేంద్రాల్లో కూడా ఇదే తంతు. ఇప్పుడు తినకపోతే, కొనకపోతే ఇమెకెప్పుడూ దొరకదేమో అన్నట్టుగా ఎగబడ్డారు. సామాజిక దూరం పాఠించటం ద్వారా వైరస్ ను నియంత్రించే అవకాశం ఉందని నెత్తీనోరూ మోదుకుంటున్నా పట్టించుకోవటం లేదు. కొందరు కనీసం మూతికి మాస్కులు కూడా ధరించకుండా వేలం వెర్రిగా దుకాణాలపై పడిపోతున్నారు. ఒకవైపు కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుంటే జనం బాధ్యత లేకుండా వ్యవహరించటం ఆందోళన కలిగిస్తోంది. జనం యథేచ్ఛగా నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నా తమపై వస్తున్న విమర్శలు, ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. 1970 దశకం చివర్లో స్కైలాబ్ పడుతుందని, ఇక ఇవే ఆఖరి రోజులని భావించిన జనం కోళ్ళూ, మేకలు, గొర్రెలు.. ఇలా కనిపించిన దాన్నల్లా కోసుకుతినేశారు. విజ్ఞానం పెరిగిన ఈరోజుల్లోనూ జనం నాలుకకు రుచికరమైన తిండికోసం ఇలా వెంపర్లాడటం పట్ల మేధావులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళలో విద్యావంతులే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తుంది.
కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ప్రాణాంతక వైరస్. దీనికి మందులు లేవు. ఇళ్లలోనే వుంటూ సామాజిక దూరం పాఠించటం ఒక్కటే ముందున్న ప్రత్యామ్నాయం. ఓ మనిషీ, నీకర్థమౌతోందా…!