(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తా విభాగం)
ఏపీకి ప్రత్యేక హోదా సాధించడం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఈ కార్యాచరణ పథకం ప్రకారం ఏపీ శాసనసభలో తరచు హోదా అడుగుతూ పదే పదే తీర్మానాలను ఆమోదించి పంపుతారు. అలాగే ప్రధాని మోదీని సీఎం జగన్ ఎప్పుడు వీలైతే అప్పుడు కలిసి వినతి పత్రాలు ఇస్తూ ఉంటారు.
మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా, సీఎం ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా పట్టు శాలువాలు కప్పి వినతి పత్రాలు సమర్పిస్తారు. ఒకే వినతిపత్రాన్ని తేదీలు మార్చి మార్చి మోదీకి ఇస్తూ ఉంటారు. ఏపీకి ప్రత్యేకహోదా అన్నది ఇక ఎప్పటికీ స్టేల్ అయ్యే సబ్జెక్టు కాదు కనుక ఎన్ని సార్లయినా వినతిపత్రాలు ఇస్తూనే ఉండవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఆ వినతిపత్రంలో ఉండే విషయాన్ని కూడా ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారులు, ఇతర నిపుణుల సహాయంతో ఎంతో జాగ్రత్తగా ఆచి తూచి రూపొందించింది. అభిజ్ఞవర్గాల సమాచారం ప్రకారం ఆ వినతిపత్రం సారాంశం ఈ కింది విధంగా ఉండబోతోంది.
శ్రీరామ నీవే కలవు!
గౌరవనీయులైన నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారికి, భారత ప్రధానమంత్రివర్యులు, న్యూ ఢిల్లీ
ఆర్యా!
విష్ణు సమానులైన తమకు ఐదు కోట్ల ఆంధ్రుల తరఫున నేను ఈ వినతిపత్రాన్ని సమర్పించడం జరుగుతోంది. రాజ్యసభలో అప్పటి ప్రధాని హోదాలో గౌరవనీయులైన మన్మోహన్ సింగ్ ఏపీకి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తానన్నారు. అప్పుడు బీజేపీ సభ్యుడిగా ఉన్న ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడుగారు పదేళ్ల హోదా కోరారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలుత మీరిచ్చిన ప్యాకేజీకి అంగీకరించినా ఆ తర్వాత ప్రతిపక్షంగా ఉండిన మా పార్టీ ఒత్తిడి వల్ల యు టర్న్ తీసుకుని ప్రత్యేక హోదా కోరారు.
అప్పట్లో మీ ప్రభుత్వంపై ప్రత్యేక హోదా అంశంపై అవిశ్వాస తీర్మానం కూడా పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఫలితాలూ వచ్చాయి. అయితే మా ఖర్మ, దురదృష్టం కొద్దీ మీ ఎన్డీఏకు అవసరమైన మెజారిటీ కన్నా ఎక్కువ స్థానాలు వచ్చేశాయి. మీకు మెజారిటీ రాకూడదని నేను ఆ దేవుడిని చాలా ప్రార్థించాను. కానీ ఆ దేవుడు కూడా మీ పక్షమే వహించాడు. దీంతో మాకు 22 ఎంపీ సీట్లు వచ్చినా మేం పోరాటం మాని హోదా కోసం విజ్ఞప్తులు మాత్రమే చేసుకోవలసిన పరిస్థితి వచ్చింది. అందుకే ఇప్పుడు మీకు ఈ వినతిపత్రాన్ని సమర్పిస్తున్నాం. దయచేసి ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పించండి. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నినాదం ఇచ్చినా ఇప్పుడు మేం గట్టిగా అడగలేని స్థితిలో ఉన్నామని గమనించండి.
హోదా కోసం భవిష్యత్తులో ఎలాంటి ఉద్యమమూ చేయబోమనీ, చేయలేమనీ ఇందు మూలముగా మీకు తెలియ జేసుకుంటున్నాము. మీరు పెట్టే సకల షరతులకూ మేం కట్టుబడి ఉంటామనీ, మీకు నచ్చే రీతిలోనే వ్యవహరిస్తామనీ విన్నవించుకుంటున్నాము. దేశంలో ఇవాళ మీరు నంది అంటే నంది..పంది అంటే పంది కనుక మమ్మల్ని కనికరించి మా అభ్యర్థనకు సమ్మతించాలని మరోసారి మరీ మరీ కోరుచున్నాము. మీరు మా విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించేవరకూ ఇలాగే వినతిపత్రాలు ఇస్తూ ఉంటాము. ఇదే మేం మా హోదా కోసం చేసే రాజీలేని పోరాటంగా భావించమని మనవి. హోదా ప్లీజ్…హోదా ప్లీజ్ అన్నదే మా నినాదం. మా వినతిపత్రంలో తప్పులు ఉన్నచో క్షమించగలరు.
ఇట్లు
భవదీయ
వై ఎస్ జగన్మోహన్ రెడ్డి
ఏపీ ముఖ్యమంత్రివర్యులు
Note: వ్యంగ్యవార్త అన్నది Faking News రచనాపద్ధతిలో ఒక భాగం. ఇవి నిజం వార్తలు కావు. ఆయా వాదనలు, రాజకీయ నాయకుల వైఖరుల్లోని డొల్లతనాన్ని వ్యంగ్యపద్ధతిలో ఎత్తిచూపడం దీని ఉద్దేశ్యం. పాఠకులు గమనించగలరు.