టెలికాం సంస్థ భారతీ ఎయిర్ టెల్ తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ను అందిస్తోంది. లేస్ చిప్స్, కుర్కురే, అంకుల్ చిప్స్, డొరిటోస్ ప్యాక్స్ కొనుగోలుపై ఉచిత డేటాను అందిస్తోంది. ఈ చిప్స్కు చెందిన రూ.10 ప్యాక్ను కొంటే 1జీబీ డేటా వస్తుంది. అదే రూ.20 ప్యాక్ను కొంటే 2 జీబీ డేటా వస్తుంది. ఇలా ఒక్క యూజర్ గరిష్టంగా 3 ప్యాక్లతో ఉచిత డేటాను రిడీమ్ చేసుకోవచ్చు.
కాగా దేశంలో ప్రస్తుతం వినియోగదారులు మొబైల్ డేటాను ఎక్కువగా వాడుతున్నారని అందుకనే ఈ ఆఫర్ను అందిస్తున్నామని ఎయిర్ టెల్ తెలిపింది. జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికి ఒక్కో యూజర్ సగటున 16.3 జీబీ డేటాను ఉపయోగిస్తున్నట్లు వెల్లడైందని ఎయిర్టెల్ తెలియజేసింది. గతేడాదితో పోలిస్తే ఇది 40 శాతం అధికమని పేర్కొంది.
ఇక చిప్స్ను కొనుగోలు చేశాక ఆ ప్యాక్ల వెనుక వైపు ఉండే కోడ్ను ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్లో ఎంటర్ చేసి ఉచిత డేటాను రిడీమ్ చేసుకోవచ్చు. ఇందుకు గాను ఎయిర్ టెల్, పెప్సీ కో కంపెనీలు భాగస్వామ్యమయ్యాయి. కాగా ఈ విధంగా పొందిన ఉచిత డేటాను మూడు రోజుల్లోగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. తరువాత డేటా రిసెట్ అవుతుంది.