దేశ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు భారత్ షాకుల మీద షాకులు ఇస్తున్నది. ఇప్పటికే చైనాకు చెందిన 59 యాప్లను భారత్ నిషేదించిన సంగతి తెలిసిందే. ఇంకా మరి కొన్ని యాప్ ల పైనా వేటు వేసేందుకు భారత్ సన్నద్ధమవుతోంది. మొత్తం 275 చైనా మొబైల్ యాప్స్ డేటా చోరీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఇప్పటికే ఇండియాలో బాగా ప్రాచుర్యం అయిన టిక్టాక్, హెలో లాంటి 59 యాప్స్ని నిషేధించి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారత్.. పాపులర్ గేమింగ్ యాప్స్ అయిన పబ్జీ మొబైల్, లూడో వాల్డ్, ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ అలీ ఎక్స్ప్రెస్ లాంటి మరో 47 యాప్స్ ను కూడా బ్యాన్ చేయాలని భావిస్తోందట.
కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఇప్పటికే చైనాలో సర్వర్లు ఉన్న యాప్లను గుర్తించే పనిలో నిమగ్నమైంది. యాప్ల ద్వారా డేటా ఎలా మారుతుందో సమాచారం సేకరిస్తోంది. అవసరమైతే చైనాలో సర్వర్లు ఉన్న అన్ని యాప్లను నిషేదించే పై ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం.
గాల్వన్ లోయల్ భారత్ – చైనా మధ్య ఉద్రిక్తలు నెలకొన్నప్పటి నుండి చైనాకు చెందిన యాప్లపై భారత్ ప్రత్యేక దృష్టి సారించింది. భారత వినియోగదారుల డేటాను పలు యాప్ ల ద్వారా చైనా తస్కరిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేంద్రానికి నివేదించారు. టిక్ టాక్ పై నిషేధం విధించిన తర్వాత చైనా కు చెందిన జిలి, స్నాక్ వీడియో అనే రెండు మొబైల్ ఆప్స్ ప్రత్యామ్నాయంగా నిలిచాయి. ఇదే మాదిరి మరి కొన్ని యాప్స్ మారు పేర్లతో పుట్టుకొస్తున్నాయి. ఈ అంశం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్నది. ఈ తరుణంలో చైనా యాప్స్కు కళ్లెం వేసేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది.