మోడీ ప్రధాన మంత్రి అయ్యాక మేడ్ ఇన్ ఇండియా అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగానే స్వదేశ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ మివీ తన మొట్టమొదటి మేడిన్ ఇండియా ఉత్పత్తిని లాంచ్ చేసింది. పూర్తి స్వదేశీ పరికరాలతో రోమ్ 2 బ్లూటూత్ స్పీకర్ ను తయారు చేశామని కంపెనీ పేర్కొంది. దీని డిజైన్ మరియు రూపకల్పన, చివరికి ప్యాక్ చేసే బాక్స్ కూడా ఇండియాలోనే తయారయిందని సంస్థ వెల్లడించింది. భారత మార్కెట్లో తాము విజయవంతం అయ్యామని, అదే ఉత్సాహంతో దేశంలో పూర్తిస్థాయి తయారీ యూనిట్ను ఏర్పాటు చేశామని సంస్థ యాజమాన్యం తెలిపారు. చాలా తక్కువ కాలంలోనే మంచి ఆడియో టెక్నాలజీతో మివీ తనదైన ముద్ర వేసిందని, ఇకపై తమ ఉత్పత్తులన్నీ పూర్తిస్థాయిలో మనదేశంలోనే తయారవుతాయని స్పష్టం చేశారు.
పూర్తి స్వదేశంలో తయారైన ఈ మివీ రోమ్ 25 వాట్ల సౌండ్ అవుట్ పుట్ను అందించనుంది. అంతే కాదు దీని బ్యాటరీ సామర్థ్యం 2000 ఎంఏహెచ్గా ఉంది. పూర్తిగా చార్జ్ కావడానికి 3-4 గంటల సమయం పడుతుంది. సౌండ్ మీడియంగా పెట్టుకుంటే 24 గంటల పాటు పాటలు వినవచ్చు. దీని కనెక్టివిటీ రేంజ్ 10 మీటర్ల వరకు ఉంటుందని, ఐపీఎక్స్ 67 వాటర్ ప్రూఫ్ రేటింగ్ ఇందులో ఉంది. అందువల్ల ఇది తడిసినా పాడవుతుందన్న భయపడాల్సిన అవసరం లేదు. భారతీయుల మనోభావాలకు నచ్చిన విధంగా ఈ సేపెల్లర్ ద్వారా సంగీతాన్ని ఆనందించవచ్చు. ఇది హెచ్డీ స్టీరియో సౌండ్ ను అందించేలా రూపొందించారు.
నాలుగు మెటాలిక్ రంగులలో లభ్యమవుతున్న ఈ స్పీకర్ ధరను రూ.1,199గా నిర్ణయించారు. మివీ.ఇన్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ల్లో దీనికి సంబంధించిన సేల్ ఇప్పటికే ప్రారంభం అయింది. ఈ సంస్థ ఉపయోగించే విడి భాగాలు ఇంతకు ముందు విదేశాల్లో తయారయ్యేవి కానీ ప్రధాన మంత్రి ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా తమ స్వంత ప్లాంటును హైదరాబాద్లో నెలకొల్పినట్లు కంపెనీ పేర్కొంది. రోమ్ 2కి ముందు వెర్షన్ అయిన రోమ్ 1.0 పెద్ద సక్సెస్ అయిందని, ఇది దానికంటే పెద్ద సక్సెస్ అవుతుందన్న నమ్మకం ఉందని సంస్థ పేర్కొంది.