ఫేస్బుక్.. స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్లే కాదు లేని వాళ్లకు కూడా ఈ సోషల్ మీడియా దిగ్గజం గురించి తెలుసు. ముఖేష్ అంబానీ …. భారతదేశపు ముఖ్యమైన అంశాల గురించి అవగాహన ఉన్న వారికి ఈ పేరు పరిచయం చేయడం అనవసరం. ఈ ఇద్దరి మధ్య జరిగిన చర్చల్లో ఓ కీలక అంశం ప్రస్తావనకు వచ్చింది. అది నిజంగా భారతీయులకు ఎంతో గర్వకారణం.
జుకర్ బర్గ్ , ముఖేష్ అంబానీ ఏం మాట్లాడుకున్నారంటే…
ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముఖేష్ అంబానీ మధ్య వర్చువల్ విధానంలో ‘పార్ట్నరింగ్ ఫర్ డిజిటల్ ఇండియా’ కార్యక్రమంలో 4 జి, 5 జి విప్లవం గురించి చర్చించారు. ఫేస్బుక్ సీఈవో జుకర్బర్గ్తో జరిగిన సంభాషణలో ముఖేష్ అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేసింది. కొన్ని దేశాలు ఆర్థికంగా దారుణమైన పరిస్థితికి దిగజారిపోయాయి కానీ, సంక్షోభాన్ని సైతం తట్టుకొని భారత్ నిలబడింది. సంక్షోభం నుంచి మళ్లీ బయటపడి ఆర్థిక పురోగాభివృద్ధివైపు అడుగులు వేస్తోంది అని రిలయన్స్ సంస్థల అధినేత తేల్చి చెప్పారు. సంక్షోభానికి, ఉపద్రవానికి కుంగిపోవడం భారత్ డీఎన్ఏలోనే లేదని స్పష్టం చేసిన అంబానీ.. సంక్షోభాన్ని కొత్త అధ్యాయానికి అవకాశంగా మలుచుకునే నైజం భారత్కు ఉందని తెలిపారు.
టాప్ 3 లో భారత్ ఉంటుంది
రాబోయే రెండు దశాబ్దాల్లో భారత్ ప్రపంచంలో ఆర్థిక వృద్ధి సాధించిన టాప్ 3 దేశాల్లో ఒకటిగా నిలుస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముఖేష్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. కరోనా లాంటి సంక్షోభాన్ని ఐదేళ్ల క్రితం భారత్ ఎదుర్కోవాల్సి వచ్చి ఉంటే.. పరిస్థితి ఊహించని విధంగా ఉండేదన్నారు. డిజిటల్ ఇండియాను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్కు ముఖేష్ ధన్యవాదాలు తెలిపారు.
జుకర్ బర్గ్ ఖుష్
భారతదేశంలో 4 జీ విప్లవాన్ని రిలయన్స్ తీసుకువచ్చిందని జుకర్బర్గ్ ప్రశంసించారు. 5 జీ ఇప్పుడు కంపెనీకి మరో పెద్ద ఫోకస్ అని జుకర్ బర్గ్ తెలిపారు. వందలాది మిలియన్ల మంది ప్రజలను ఇంటర్నెట్లోకి తీసుకురావడంలో ఆర్ఐఎల్ నిజంగా గొప్ప పని చేసిందని ప్రశంసించారు. కాగా, ఈ చర్చలో ఆర్ఐఎల్-ఫేస్బుక్ భాగస్వామ్యం మరియు భారత్ను అగ్రస్థానంలో నిలిపేందుకు వ్యాపారాలు పోషించగల పాత్రలు రాబోయే రెండు దశాబ్దాలలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండబోతోందని అనే విషయాలు చర్చకు వచ్చాయి.