గత నెలలో హైదరాబాద్లో వచ్చిన వరదలు భాగ్యనగర వాసులను ఓ రేంజ్లో పరేషాన్ చేసిన సంగతి తెలిసిందే. కొన్ని ప్రాంతాలైతే ఇప్పటికీ ఆ వరదల వల్ల కలిగిన సమస్యల నుంచి తేరుకోలేదు.
సహజంగానే ఇలాంటి సమయంలో నగరం అంటే ఓ బ్యాడ్ ఇమేజ్ పడుతుంది. అలాంటి సమయంలోనే తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖామంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రానికి అత్యంత భారీ పెట్టుబడి తీసుకువచ్చారు. ప్రముఖ ఐటీ కంపెనీ అమెజాన్ తన అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ రీజియన్ ని తెలంగాణలో ఏర్పాటు చేయనుంది.
అమెజాన్ అసలు కథ ఏంటంటే…
అమెజాన్ ఏర్పాటు చేయబోతున్న ఏషియా పసిఫిక్ హైదరాబాద్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ రీజియన్ 2022 ప్రథమార్థంలో తన కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ రీజియన్లో 3 అవైలబిలిటీ జోన్లు ఉంటాయని తెలిపింది. అమెజాన్ ఏర్పాటు చేయబోతున్న అవైలబిలిటీ జోన్లలో పెద్ద ఎత్తున డాటా సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపిన కంపెనీ, ఇవన్నీ ఒకటే రీజియన్ లో ఉన్నప్పటికీ, అదే సమయంలో ప్రతీ డేటా సెంటర్ దేనికదే స్వతంత్రంగా పని చేస్తుందని, తద్వారా విద్యుత్ సరఫరా, వరదలు, వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు నుంచి రక్షణ ఉంటుందని ఈ సందర్భంగా తెలిపింది.
20761 కోట్ల పెట్టుబడులు….
అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్లను సుమారు 20 వేల 761 కోట్ల రూపాయలు అంటే 2.77 బిలియన్ డాలర్లతో మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతుంది. అమెజాన్ లాంటి అత్యంత ప్రఖ్యాత సంస్థ ఇంత భారీ ఎత్తున తెలంగాణలో డాటా సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడి పెడుతున్న నేపథ్యంలో.. రానున్న రోజుల్లో తెలంగాణ డాటా సెంటర్ల పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా మారే అవకాశం ఉంది. తెలంగాణలో ఏర్పాటవుతున్న అమెజాన్ వెబ్ సర్వీసెస్ లాంటి డేటా సెంటర్ల ద్వారా తెలంగాణ డిజిటల్ ఎకానమీ మరియు ఐటీ రంగం అనేక రెట్లు వృద్ధి సాధించే అవకాశం ఉంది.
ఇప్పుడు ఏం జరుగుతుందంటే..
ప్రస్తుతం అమెజాన్ ఏర్పాటు చేస్తున్న ఏషియా పసిఫిక్ రీజియన్ వెబ్ సర్వీసెస్ వలన వేలాది మంది డెవలపర్లకు, స్టార్ట్ అప్ లకి, ఇతర ఐటీ కంపెనీలకు మరియు విద్య మరియు ఇతర రంగాల్లో పనిచేస్తున్న ఎన్జీవోలు, అనేక ఇతర కంపెనీలకు తమ వెబ్ ఆధారిత సర్వీసులను నిర్వహించుకునేందుకు వీలు కలుగుతుంది. భారీ ఎత్తున డేటా సెంటర్లు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఈ కామర్స్ ,పబ్లిక్ సెక్టార్, బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటి మరియు ఇతర అనేక రంగాల్లో తమ కార్యకలాపాల విస్తృతి పెరిగేందుకు అవకాశం కలుగుతుంది.
కేటీఆర్ ఏమంటున్నారంటే…
అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా సుమారు 20 వేల 761 కోట్ల రూపాయలు పెట్టుబడిగా తెలంగాణ రాష్ట్రం లోకి రావడం పట్ల పరిశ్రమలు మరియు ఐటీశాఖ మంత్రి కే. తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెట్టుబడికి సంబంధించి ప్రాథమిక చర్చలను దావోస్ పర్యటన లో ప్రారంభించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. దావోస్ పర్యటన లో అమెజాన్ సంస్థ ఉన్నతస్థాయి ప్రతినిధులతో ఇందుకు సంబంధించి చేసిన చర్చలను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా రాష్ట్రానికి వస్తున్న ఈ పెట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలోకి వస్తున్న అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని మంత్రి కేటీఆర్ తెలియజేశారు. ఈ పెట్టుబడి తర్వాత అనేక కంపెనీలు తమ డాటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని, అలాంటి వారందరికీ తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అమెజాన్ లాంటి ప్రఖ్యాత కంపెనీ తన భారీ పెట్టుబడికి తెలంగాణను ఎంచుకోవడం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పారదర్శక మరియు వేగవంతమైన పరిపాలనకు నిదర్శనం అని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక ఆదర్శవంతమైన ప్రభుత్వ విధానాలు మరియు పాలసీల ద్వారా ఐటి మరియు ఐటీ ఆధారిత రంగం పెద్ద ఎత్తున వృద్ధి చెందుతూ వస్తుందన్నారు.