మనిషి జీవితం డబ్బుతో ముడిపడి ఉందన్న సంగతి తెలిసిందే. రోజులో ఏ పని చేయాలన్నా ఆ పనికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో డబ్బుతో సంబంధం ఉంటుంది. అయితే చిన్న మొత్తంలో డబ్బు అవసరం ఉంటే స్నేహితులు, బంధువులు సహాయం చేస్తారు. కానీ కొంత ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరమైతే మాత్రం బ్యాంకులు లేదా వడ్డీ వ్యాపారులను ఆశ్రయించేవాళ్లం. అయితే గత రెండు మూడేళ్లుగా తక్కువ వడ్డీకే లోన్లు ఇస్తామంటూ పదుల సంఖ్యలో ఇన్ స్టంట్ లోన్ యాప్స్ పుట్టుకొచ్చాయి.
విద్యార్థులు, యువత, చిన్నచిన్న ఉద్యోగులను, వ్యాపారులను టార్గెట్ చేస్తూ పుట్టుకొచ్చిన ఈ యాప్స్ ఆకర్షణీయమైన ప్రకటనలతో డబ్బు అవసరం ఉన్నవారికి చేరువవుతున్నాయి. బయట వడ్డీ వ్యాపారులు ఇచ్చే వడ్డీ కంటే తక్కువ వడ్డీకే ఇస్తున్నామని ఆన్ లైన్ యాప్స్ చెబుతూ ఉండటంతో చాలామంది ఈ లోన్లు తీసుకుంటున్నారు. అయితే లోన్ తీసుకున్న తరువాతే అసలు సమస్య మొదలవుతోంది.
లోన్లు ఇచ్చిన యాప్స్ లోన్లు సరైన సమయానికి చెల్లించినా చెల్లించకపోయినా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. 10,000 రుణం తీసుకుని ఒక్కరోజు ఆలస్యంగా చెల్లించినా అసలుకు రెట్టింపు డబ్బును వసూలు చేస్తున్నాయి. ఏ కారణం చేతనైనా చెల్లించడం సాధ్యం కాకపోతే లోన్ ఇచ్చే సమయంలోనే యాప్ సహాయంతో లోన్ తీసుకునే వాళ్ల కాంటాక్ట్స్ ను సేకరించి లోన్ తీసుకున్న వాళ్ల బంధువుల, స్నేహితుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.
మరికొన్ని ఆన్ లైన్ యాప్స్ అడిగినంత డబ్బు చెల్లించకపోతే లీగల్ గా చర్యలు తీసుకుంటామంటూ రుణ గ్రహీతలను బెదిరిస్తున్నాయి. 30,000 రూపాయలు లోన్ తీసుకుని 1,50,000 రూపాయలు చెల్లించామని ఆన్ లైన్ యాప్స్ బారిన పడి మోసపోయిన బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్ లో ఇలా లోన్లు ఇచ్చే యాప్ లు 150కు పైగా ఉన్నాయంటే ఈ యాప్ లు ఏ విధంగా మోసాలకు పాల్పడుతున్నాయో సులభంగానే అర్థమవుతుంది.
అప్పు ఇచ్చే యాప్ లు ఫేక్ ఎఫ్.ఐ.ఆర్, ఫేక్ వార్నింగ్ లెటర్లతో రుణ గ్రహీతలను మానసిక క్షోభకు గురి చేస్తున్నాయి. అందువల్ల ఇలాంటి యాప్స్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇలాంటి యాప్స్ దేశంలో పదుల సంఖ్యలో మరణాలకు కూడా పరోక్షంగా కారణమవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి యాప్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టి మోసాలకు పాల్పడుతున్న ఆన్ లైన్ లెండింగ్ యాప్స్ ను నిషేధిస్తే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది.