గతంలో నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఆన్ లైన్ షాపింగ్ లు నేడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది. ఆండ్రాయిడ్ ఫోన్ ల వాడకం ఎక్కువ కావడంతో చాలా మంది ఆన్ లైన్ షాపింగ్ కి ఇష్టపడుతున్నారు. వినియోగదారులు కోరుకున్న వస్తువులు ఆన్ లైన్ షాపింగ్ ద్వారా ఇంటి ముంగిటికే వస్తుండటంతో దీనికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. అయితే కొంత మంది అమాయకులు ఆన్ లైన్ మోసగాళ్ల చేతిలో చిక్కి భారీగా నష్ట పోతున్న ఉదంతాలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. అందుకే పలు బ్యాంకులు .. కస్టమర్ లను చైతన్య పరుస్తూ సూచనలు, హెచ్చరికలు జారీ చేసున్న సంగతి తెలిసిందే. ఏటీఎం కార్డు నెంబర్, పిన్ నెంబర్, ఒటీపీ తదితర విషయాలు ఎవరితోనూ చెప్పవద్దని సూచిస్తుంటారు. అయినప్పటికీ కొందరు ఆన్ లైన్ మోసాల బారిన పడుతున్నారు. తమిళనాడుకు చెందిన ఒ మహిళ ఆన్ లైన్లో నైటీ ఆర్డర్ చేసి ఏకంగా 60వేల రూపాయలు పోగొట్టుకున్న వైనం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని శ్రీపెరుంబదూర్ సమీపంలోని కొరట్టూరుకు చెందిన ఒక మహిళ కొద్ది రోజుల క్రితం ‘క్లబ్ ఫ్యాక్టరీ’ అనే సంస్థ యాప్ ద్వారా ఆన్లైన్లో నైటీ బుక్ చేసింది. దీనికి గాను తన భర్త ఏటీఎం కార్డు దారా 550 రూపాయలు ఆన్లైన్ ద్వారా చెల్లించింది. అయితే తాను బుక్ చేసిన నైటీ ఆ సంస్థ పేర్కొన్న సమయానికి రాకపోవడంతో ఆమె కాల్ సెంటర్ కు ఫోన్ చేసి ఆర్డర్ క్యాన్సిల్ చేసింది. ఇక్కడే అసలు మోసం జరిగింది. ఆన్ లైన్ వ్యవహారాలపై పూర్తిగా అవగాహన లేని ఆమె కస్టమర్ కేర్ ప్రతినిధి అడిగిన బ్యాంకు అకౌంట్ వివరాలు అన్ని చెప్పేసింది. అలానే వాడు చేయమన్నట్లు తన మొబైల్ లో టీమ్ వ్యూవర్ యాప్ ను డౌన్ లోడ్ చేసింది. దీనితో వాడికి పని సులువు అయింది. ఆర్డర్ క్యాన్సిల్ చేసిన డబ్బులు తిరిగి వస్తాయని ఆమె భావిస్తుండగా, తన భర్త అకౌంట్ నుంచి 60 వేల రూపాయలు డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది. దీనితో ఖంగుతిన్న ఆమె మళ్లీ కస్టమర్ కేర్కు ఫోన్ చేయగా వేరే వ్యక్తి కూడా బ్యాంకు అకౌంట్ కు సంబందించిన వివరాలను అడగడంతో మళ్ళీ మోసపోయామని భావించి ఆ వివరాలు ఇవ్వలేదు. తనకు జరిగిన మోసంపై ఆమె కొరట్టూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు స్వీకరించలేదుట. ఆన్లైన్ వ్యవహారం కావడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారు సూచించారుట.