వాట్సాప్ లో తరచూ చాలా ఫార్వర్డ్ మెసేజెస్ మనం వైరల్ కావడం చూస్తూనే ఉంటాం. వాటిలో కొన్ని నిజాలు ఉంటాయి కొన్ని అబద్ధాలు ఉంటాయి. అయితే ఇప్పుడు దేశ ప్రజలందరి లో కలకలం రేపిన ఈ ఫార్వర్డ్ మెసేజ్ లలో ఒకటి ఏమిటంటే మన ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ఐఫోన్ లలో covid19 ఎక్స్పోజర్ సెన్సార్ అనేది మనకు తెలియకుండానే సీక్రెట్ గా అమర్చారు అని. అంటే covid 19 ఉన్న వ్యక్తి గనుక ఫోను వాడినట్లయితే అతని లక్షణాలను గమనించిన సెన్సార్ ఎవరికి అయితే మెసేజ్ పంపాలి అని అందులో సాఫ్ట్వేర్ ను రూపొందించారో…. వారికి మెసేజ్ పంపిస్తుంది అట.
అయితే అసలైన నిజం ఉన్న మెసేజ్ ఎన్నో రకాలుగా మార్పులు చెంది చివరికి ఇలా బయటికి వచ్చింది. అని టెక్ నిపుణులు చెబుతున్నారు. విషయం ఏమిటంటే మన మొబైల్లో ఆరోగ్య సేతు యాప్ ఉన్నట్లే covid-19 కి సంబంధించి అనేక దేశాల్లో అనేక యాప్స్ రూపొందించబడ్డాయి. అయితే రోగులు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒకదానికి ఒకటి అనుసంధానం జరిగింది. అందువల్ల మన మొబైల్ లో బ్లూటూత్, లొకేషన్ కనుక ఆన్ చేసినట్లు అయితే మనకు దగ్గరలో ఉన్న కోవిడ్ పాజిటివ్ పేషెంట్లను ఆటోమేటిక్ గా చూపిస్తుంది లేదా మనం ఉన్న ఏరియా నుంది కోవిడ్ రిస్క్ జోన్ ఎంత దూరంలో ఉంది అన్న విషయాన్ని తెలియజేస్తుంది.
అంతే కానీ ఆ వైరల్ అయిన మెసేజ్ లో లాగా ఏ సెన్సార్ కానీ లేదా మన కదలికలను ట్రాక్ చేసే ట్రాకింగ్ డివైస్ కానీ ఏ ఒక్క ఫోన్ లో కూడా లేదని ఆపిల్ మరియు గూగుల్ వారు స్పష్టం చేశారు. అంతేకాకుండా కరోనా కాంటాక్ట్స్ కనిపెట్టడం లోనే తమ ఫోన్లు సహకరిస్తాయని అంతేకానీ ఒక వ్యక్తికి కరోనా ఉందని కానీ లేదా అతనికి సంబంధించిన విషయాన్ని ఎవరికీ పంపే సిస్టం ని తాము రూపొందించలేదని కన్ఫర్మ్ చేశారు. కాబట్టి ఒక వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ వచ్చినప్పుడు వెంటనే ఏదైనా సెర్చ్ ఇంజన్ లోకి వెళ్లి దాని గురించి శోధించడం మంచిది. ఊరికే మనం కూడా ఆ మెసేజ్ ను ఫార్వర్డ్ చేయకుండా ఉండటం శ్రేయస్కరం.