బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో డ్రగ్స్ కోణం ఉందని చెప్పి ప్రస్తుతం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కేసును దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే నటి రియా చక్రవర్తి, ఇతర వ్యక్తుల వాట్సాప్ డేటాను ఎన్సీబీ యాక్సెస్ చేసింది. అయితే ఈ విషయంపై దేశవ్యాప్తంగా అనుమానాలు రేకెత్తుతున్నాయి. వాట్సాప్ డేటాను ఎన్సీబీ తీసుకోవడంతో అసలు అందులో ఉన్న యూజర్ల డేటా సురక్షితమేనా ? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో ఈ విషయంపై వాట్సాప్ స్పందించింది.
వాట్సాప్ లో యూజర్లు పంపుకునే మెసేజ్లు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ను కలిగి ఉంటాయని వాట్సాప్ తెలిపింది. మెసేజ్ లు పంపుకునే వారికి, రిసీవ్ చేసుకునేవారికి తప్ప ఇతరులెవరికీ అవి యాక్సెస్ కావని తెలిపింది. వాట్సాప్ కు కూడా ఆ మెసేజ్లను యాక్సెస్ చేయడం సాధ్యం కాని పని అని తెలిపింది. కాకపోతే యూజర్లు తమ చాట్ను ఫోన్లో, గూగుల్ డ్రైవ్లో, ఐక్లౌడ్ లో బ్యాకప్ తీసుకుంటారు కనుక.. ఆయా ప్రదేశాల్లో స్టోర్ అయి ఉండే వాట్సాప్ డేటాను ఎవరైనా యాక్సెస్ చేయవచ్చని, దానికి సెక్యూరిటీ అంటూ ఏమీ ఉండదని వాట్సాప్ తెలిపింది.
కనుక యూజర్లు వాట్సాప్ లో తమ డేటా పట్ల ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపింది. అయితే బ్యాకప్గా తీసుకునే వాట్సాప్ డేటా విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలని, దాన్ని ఇతరులు యాక్సెస్ చేయకుండా వేరే ఎక్కడైనా స్టోర్ చేసి దానికి పాస్వర్డ్లు పెట్టుకోవాలని వాట్సాప్ సూచించింది. ఈ మేరకు వాట్సాప్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.