ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు తన యూజర్లకు ఆకట్టుకునే కొత్త కొత్త ఫీచర్లను అందిస్తూనే వస్తోంది. అందులో భాగంగానే మల్టీ డివైస్ ఫీచర్ను కూడా త్వరలోనే అందివ్వనుంది. దీనికి గాను వాట్సాప్ ప్రస్తుతం చివరి దశ టెస్టింగ్ ను నిర్వహిస్తుందని తెలుస్తోంది. ఈ మేరకు వాట్సాప్ ఫీచర్లను ట్రాక్ చేసే డబ్ల్యూఏ బీటా ఇన్ఫో ఈ వివరాలను వెల్లడించింది.
నిజానికి వాట్సాప్ తన యాప్లో మల్టీ డివైస్ ఫీచర్ను అందిస్తున్నట్లు ఎప్పుడో అనౌన్స్ చేసింది. కానీ ఆ ఫీచర్ను ఇప్పటికీ వాట్సాప్ ఇంకా టెస్ట్ చేస్తూనే ఉంది. అందువల్ల దీన్ని యూజర్లకు అందించడం ఆలస్యమవుతోంది. కానీ ఎట్టకేలకు అతి త్వరలోనే దీన్ని యూజర్లకు వాట్సాప్ అందుబాటులోకి తేనుంది. దీంతో యూజర్లు ఇకపై ఒక వాట్సాప్ అకౌంట్ను ఎన్ని డివైస్లలో అయినా వాడుకునేందుకు వీలు కలుగుతుంది.
వాట్సాప్లో మల్టీ డివైస్ ఫీచర్ను ముందుగా బీటా యూజర్లకు అందిస్తారు. తరువాత ఆండ్రాయిడ్ యూజర్లకు, ఆ తరువాత ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి తెస్తారు. ఇక ఈ ఫీచర్ను వాడుకోవాలంటే సెట్టింగ్స్లోకి వెళ్లి ఏయే డివైస్లలో ఒకే వాట్సాప్ అకౌంట్ను వాడుతారో ఆయా డివైస్లను ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత వాటిల్లోకి ఒకేసారి లాగిన్ అయి మల్టిపుల్ డివైస్లలో ఒకే వాట్సాప్ అకౌంట్ను వాడుకోవచ్చు. కానీ ఒక దాంట్లో ఏమైనా సెట్టింగ్స్ చేసినా, ఫైల్స్ను డిలీట్ చేసినా, మెసేజ్లను పంపినా.. అన్నింటిలోనూ ఆ విధంగా మారుతుంది. కనుక మల్టీ డివైస్ ఫీచర్ను వాట్సాప్ లో వాడేవారు జాగ్రత్తగా ఉండాలి.